.
‘నిశ్శబ్దం’ అంటే ఇదేనా..? కిరీటం గెలిపించిన కాజియా సమాధానం … అందాల పోటీ వేదికపై సాధారణంగా అడిగే ప్రశ్నలు కూడా సాధారణంగానే ఉంటాయి. అందం అంటే ఏమిటి? మహిళా సాధికారతపై మీ అభిప్రాయం ఏమిటి? సమాజానికి మీరేం చేయాలనుకుంటున్నారు? ఇలాంటి రొటీన్, స్టీరియోఫోనిక్ ప్రశ్నలకు పోటీదారులు సిద్ధపడుతుంటారు.
కానీ జైపూర్లో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2026 ఫైనల్లో కేరళకు చెందిన 19 ఏళ్ల కాజియా లిజ్ మెజోకు ఎదురైన ప్రశ్న మాత్రం కాస్త భిన్నంగా ఉంది. “మీ జీవితంలో ‘నిశ్శబ్దం’ కలిగించే అనుభూతిని వివరించగలరా?”
Ads
ఒక అందాల పోటీ ఫైనల్లో ‘నిశ్శబ్దం’ గురించి అడగడం ఆసక్తికరమే. కానీ దానికంటే ఆసక్తికరమైనది కాజియా ఇచ్చిన సమాధానం… ఆమెకు నిశ్శబ్దం అంటే ఎక్కడా శబ్దం లేని ప్రదేశం కాదు. వేదికపైకి వెళ్లే కొన్ని క్షణాల ముందు తనలో తాను అనుభవించే ప్రశాంతత.
“స్టేజ్పైకి వెళ్లే ముందు ఉండే ఆ ప్రశాంతతే నాకు నిశ్శబ్దం. గుండె లోతుల్లోంచి ఒక గాఢమైన శ్వాస తీసుకున్నప్పుడు, గుండెచప్పుడు నెమ్మదించినప్పుడు, ‘నేను ఇక్కడికి చెందినదాన్నే’ అనే భావన కలిగినప్పుడు వచ్చే అనుభూతే నిశ్శబ్దం” అన్నది ఆమె సమాధానం. చివర్లో “అదే నేను ఈ రోజు నిలబడి ఉన్న ప్రదేశం.. ఇండియా” అంటూ ముగించింది. ఆ సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.

అంతే కాదు.. ఆ మాటల్లో కాజియా జీవిత కథ కూడా దాగి ఉంది. వేదిక అంటే ఆమెకు కొత్త కాదు. కాజియా లిజ్ మెజో కేరళకు చెందిన యువతి. 2007లో జన్మించిన ఆమె అబుదాబిలో పెరిగింది. అక్కడే పాఠశాల విద్య పూర్తి చేసింది. ప్రస్తుతం న్యాయశాస్త్రం చదువుతోంది.
చిన్న వయసులోనే కళల ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఐదేళ్ల వయసు నుంచే శాస్త్రీయ నృత్యం నేర్చుకుంది. పాటలు పాడటం, డ్రమ్ములు, వయొలిన్ వాయించడం వంటి వాటిపైనా ఆమెకు ఆసక్తి ఉంది. మోడలింగ్తో పాటు నటనలోనూ అడుగుపెట్టింది. మలయాళ చిత్రం ‘షైలాక్’లో నటించడం ద్వారా సినీ అనుభవం కూడా సంపాదించింది.
అంటే.. కాజియాకు స్టేజ్ కొత్త కాదు. అందుకే ఫైనల్లో ఆమె చెప్పిన “నేను స్టేజ్పై పెరిగాను” అనే మాట కేవలం అందమైన వాక్యం కాదు. చిన్నప్పటి నుంచి వేదికల మీద పెరిగిన ఒక యువతి అనుభవం నుంచి వచ్చిన మాట…
ఒక కిరీటంతో కథ మొదలు కాలేదు… కాజియా అందాల పోటీల ప్రయాణం కూడా ఒక్క రోజులో మొదలై ఒక్క రాత్రిలో విజయంగా మారలేదు.
2025లో మిస్ టీన్ ఇంటర్నేషనల్ పోటీలో భారత్ తరఫున పాల్గొని ఫస్ట్ రన్నరప్గా నిలిచింది. ఆ పోటీలో స్పెయిన్కు చెందిన లోరెనా రూయిజ్ విజేతగా నిలిచింది. అంటే అంతర్జాతీయ స్థాయిలో ఆమెకు మొదటి పెద్ద అనుభవమే ఓటమి- విజయం మధ్యలో నిలిచిన అనుభవం.
అయితే అదే అనుభవం ఆమెను వెనక్కి తగ్గించలేదు. మరికొంత ముందుకు నడిపించింది. ఇప్పుడు అదే కాజియా 19 ఏళ్ల వయసులో మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటం గెలుచుకుంది. దేశవ్యాప్తంగా ఎంపికైన 52 మంది పోటీదారులను వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించింది. ఈ టైటిల్ గెలిచిన తొలి కేరళ యువతిగా కూడా ఆమె రికార్డు సృష్టించింది.
అసలు పోటీ అందంతో కాదు.. మనసుతో … ఈసారి ఫైనలిస్టులకు నిర్వాహకులు మరో పరీక్ష కూడా పెట్టారు. 20 ప్రశ్నలకు 90 నిమిషాల్లో సమాధానాలు రాయాల్సి వచ్చింది. అందులో ఆధునిక భారతదేశాన్ని ఎలా చూస్తారు? అందాల పోటీలు స్త్రీవాదానికి సంకేతమా? వాతావరణ మార్పులపై అందాల భామలు ఎలా అవగాహన కల్పించగలరు? వంటి ప్రశ్నలు ఉన్నాయి.
కాజియా దృష్టిలో నిజమైన అందం అంటే కేవలం రూపం కాదు. ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఓటమి తర్వాత మళ్లీ లేచి నిలబడే శక్తి అని ఆమె చెప్పింది. భయం, వైఫల్యం, బలహీనతలను బలంగా మార్చుకోవడమే నిజమైన అందమని వివరించింది. అందుకే ఫైనల్లో ‘నిశ్శబ్దం’ అనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం మరింత అర్థవంతంగా కనిపిస్తుంది.
నిశ్శబ్దం అంటే ఆమెకు భయం కాదు. నిశ్శబ్దం అంటే ఓటమి కాదు. నిశ్శబ్దం అంటే మాట్లాడకుండా ఉండటం కూడా కాదు. మనలోని గందరగోళం ఒక్కసారిగా ఆగిపోయి.. “నేను సరైన చోటే ఉన్నాను” అని మనసు చెప్పే క్షణం. అదే కాజియా నిర్వచించిన నిశ్శబ్దం.
అబుదాబి నుంచి జైపూర్ వరకు…
అబుదాబిలో పెరిగిన ఓ కేరళ అమ్మాయి.. న్యాయశాస్త్రం చదువుతూ.. శాస్త్రీయ నృత్యం నేర్చుకుంటూ.. నటన, మోడలింగ్ చేస్తూ.. టీన్ ఇంటర్నేషనల్ వేదికపై రన్నరప్గా నిలిచి.. చివరకు దేశం తరఫున ప్రపంచ వేదికపై పోటీ పడే స్థాయికి చేరుకుంది.
ఆమె కథలో గ్లామర్ ఉంది. కానీ గ్లామర్ ఒక్కటే లేదు. శిక్షణ ఉంది. ఓటమి ఉంది. మళ్లీ ప్రయత్నించడం ఉంది. వేదికపైకి వెళ్లే ముందు వచ్చే భయం ఉంది. ఆ భయాన్ని దాటి నిలబడే ధైర్యం ఉంది. అందుకే ఫైనల్లో ఆమె చెప్పిన “I feel at home” అన్న మాట అంత బలంగా తాకుతుంది.
నవంబర్లో ప్యూర్టరికోలో జరిగే 75వ మిస్ యూనివర్స్ పోటీలో భారత్ తరఫున కాజియా లిజ్ మెజో బరిలోకి దిగనుంది… బెస్టాఫ్ లక్ కాజియా… ఆ కిరీటం కూడా నీ తలపై మెరియుగాక !!
Share this Article