.
సుప్రీంకోర్టు కీలక తీర్పు: ‘మహాప్రభు జగన్నాథ్’ యానిమేషన్ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ – యానిమేషన్ చిత్రం ‘మహాప్రభు జగన్నాథ్’ (Mahaprabhu Jagannath) విడుదలను నిలిపివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కళాత్మక సృజనపై సున్నితత్వాల పేరుతో తరచూ కోర్టులకెక్కుతున్న ధోరణిపై సర్వోన్నత ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సినిమా శ్రీ జగన్నాథుని భక్తిని, పవిత్రతను ఏమాత్రం కించపరిచేలా లేదని స్పష్టం చేస్తూ, సినిమా విడుదలను అడ్డుకోవడానికి దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది.
న్యాయమూర్తులు జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.
Ads
-
జూలై 17 ఉత్తర్వుల కొనసాగింపు…: పూరీలో జగన్నాథుని రథయాత్ర ముగిసిన తర్వాత (జూలై 28) సినిమాను విడుదల చేసుకోవచ్చంటూ తాము జూలై 17న ఇచ్చిన ఉత్తర్వులను సవరించబోమని కోర్టు స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులను సవరించాలని కోరుతూ శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలనా యంత్రాంగం (SJTA), కొందరు భక్తులు దాఖలు చేసిన అనుబంధ దరఖాస్తులను ధర్మాసనం కొట్టివేసింది.
-
యానిమేషన్ రూపంపై అభ్యంతరం తోసివేత…: భగవంతుడిని యానిమేషన్ రూపంలో చూపడం నేరమన్న వాదనను కోర్టు తిరస్కరించింది. ఈ చిత్రం ప్రధానంగా పిల్లల కోసం రూపొందించబడిందని పేర్కొంది. ఒడిశా అడ్వకేట్ జనరల్ (AG) పితింబర్ ఆచార్య వాదిస్తూ.. చిత్రంలో లార్డ్ జగన్నాథ్ను “డోరేమాన్” , “స్పైడర్ మ్యాన్” లాగా చూపించారని అభ్యంతరం వ్యక్తం చేయగా, కోర్టు దానిని పరిగణనలోకి తీసుకోలేదు.
-
నిర్మాతకు స్వేచ్ఛ…: ఆర్డర్ డిక్టేట్ చేసిన తర్వాత, సినిమా నిర్మాత తన స్వంత అంతరాత్మకు అనుగుణంగా, తను సముచితమని భావించిన ఏవైనా మార్పులు చేసుకోవచ్చని, అయితే కోర్టు మాత్రం సృజనాత్మక నిర్ణయాలపై జోక్యం చేసుకోదని ధర్మాసనం తేల్చిచెప్పింది.
కొంతమంది మనోభావాలు దెబ్బతింటున్నాయనే సాకుతో కళను నియంత్రిస్తే, భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఉంటాయని కోర్టు హెచ్చరించింది.
-
రామాయణ, మహాభారతాల ప్రస్తావన…: “ఇదే తరహాలో సున్నితత్వాలు పెరిగి, ఎవరో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు వచ్చి రిట్ పిటిషన్లు దాఖలు చేస్తే, దేశంలో హిందూ దేవుళ్లు, దేవతలు లేదా పురాణాలకు సంబంధించిన ఏ కళా రూపమూ ఉండకూడదని మేము ఉత్తర్వులు జారీ చేయాల్సి వస్తుంది” అని జస్టిస్ నాగరత్న హెచ్చరించారు.
-
వివిధ రూపాల ప్రస్తావన…: దేశంలో కబీర్ రామాయణం, ప్రతీ రాష్ట్రానికి చెందిన వేర్వేరు రామాయణాలు, అనేక సృజనాత్మక సంప్రదాయాలు ఉన్నాయని కోర్టు గుర్తుచేసింది. ఇలాంటి పిటిషన్లను అనుమతిస్తే టెలివిజన్లలో రామాయణ, మహాభారతాలు ప్రసారాలు ఆగిపోతాయని, హిందూ దేవతల చిత్రాలు, పెయింటింగ్లు, శిల్పాలు వంటి ఏ కళారూపం కూడా దేశంలో నిలవదని ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ వివాదం నేపథ్యం:
-
హైకోర్టు నిషేధం…: అంతకుముందు, ఈ యానిమేషన్ చిత్రం ‘స్కంద పురాణం’లోని మతపరమైన గ్రంథాలకు కట్టుబడి లేదని పేర్కొంటూ ఒడిశా హైకోర్టు దేశవ్యాప్తంగా సినిమా విడుదలను నిషేధిస్తూ జూలై 15న ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా సెన్సార్ సర్టిఫికెట్ను రద్దు చేయాలని, రాష్ట్రంలో పబ్లిక్ స్క్రీనింగ్ను నిలిపివేయాలని పిటిషనర్లు కోరారు.
-
సుప్రీంకోర్టు జోక్యం…: హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ చిత్ర నిర్మాత ‘ఎలే యానిమేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ (Ele Animations Pvt. Ltd) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జూలై 16 నుంచి జూలై 27 వరకు పూరీ రథయాత్ర కొనసాగుతున్నందున, ఆ సమయంలో సినిమా విడుదలను తాత్కాలికంగా నిలిపివేసిన సుప్రీంకోర్టు.. రథయాత్ర ముగిసిన జూలై 28 తర్వాత సినిమా విడుదల చేసుకోవచ్చని అనుమతించింది. తాజాగా ఆ ఉత్తర్వులను సవరించడానికి నిరాకరిస్తూ తుది నిర్ణయం వెలువరించింది…
ఇది ఒకరకంగా హొంబళె ప్రొడక్షన్స్ వారికి కూడా ఓ పెద్ద ఊరట… ఆమధ్య నరసింహస్వామి మీద యానిమేషన్ సినిమా తీస్తే సూపర్ హిట్టు… ఫ్యామిలీలు పిల్లలతో వెళ్లి మరీ చూశాయి, అలాగే అన్ని అవతారాల మీద యానిమేషన్లు తీస్తామని ప్రకటించారు కదా… సో, ఈ సుప్రీం తీర్పుతో వాళ్లకూ నిశ్చింత!!
Share this Article