.
అరవై నాలుగు కళలు అందరికీ తెలుసు… కానీ అరవై నాలుగో కళ… మామిడి పండును చేత్తో నలిపి, మెత్తగా చేసి, తొడిమ తీసి, నేరుగా నోటితో జుర్రుకుంటూ తినడం… అది మధురానుభూతి మాత్రమే కాదు, కళానైపుణ్యం కూడా… మంచి కళాకారుడు మొత్తం జురుకున్నాక, చీకేశాక, మిగిలిపోయిన పిక్క (టెంక) చుక్క మామిడి రసం లేకుండా కనిపించాలి… అణువణువూ పీక్కుతిన్నాక మిగిలే చికెన్ బొక్కలాగా…
పూరీలు, జంతుకలు గట్రా చేసుకున్నప్పుడు… వాటికి ఆధరువుగా మామిడి రసాల్ని ఆస్వాదించడం, అదీ ముక్కలు కోసి కాదు, పైన చెప్పినట్టు జుర్రుకుని తినడం నిజంగా అపూర్వమైన అనుభూతి… అఫ్కోర్స్, ఇప్పుడు మధుమేహులు మొత్తం అవాయిడ్ చేస్తున్నారు… కానీ ఓ చిన్న మామిడిపండుతో పెద్ద సుగర్ స్పైక్ ఏమీ ఉండదు…
Ads
ప్చ్, ప్రజెంట్ జనరేషన్కు ఈ కళ వంటబట్టడం లేదు, పైగా నామోషీ అట… కళకు, రుచికి దూరం కావడం, అవును, ఆమధ్య ఎవరో రీల్ సింగర్ చెప్పినట్టు… ఈ కళ ఇక ఈతరంతోనే అంతమైపోతుందనే భయం కలుగుతోంది… ఎందుకంటే…
ప్రతి రకాన్నీ బంగినపల్లి అని చెప్పేయడం, కాల్షియక కార్బైడ్ అనే ప్రమాదకర రసాయనంతో కృత్రిమంగా మగ్గబెట్టిన మామిడి రకాల్ని కోసేయడం, ముక్కల్ని సుతారంగా, నాజూకుగా, కత్తిత్ కట్ చేస్తూ ‘శానిగా’ తినడం అలవాటైపోయింది అందరికీ… వాటిల్లో మామిడి మార్క్ తియ్యదనం ఉండదు, ఆ యూనిట్ ఫ్లేవరూ ఉండదు… అసలు మామిడి తిన్నట్టే ఉండదు…
మరో అంశం ఏమిటంటే..? సంపూర్ణ ఆస్వాదన అనేది మామిడికే కాదు… వేరుశనగ కాయను కాల్చుకుని, ఒలుచుకుని తింటే వచ్చినంత టేస్ట్, మజా నేరుగా పల్లీ గింజలు వేయించుకుని తింటే రాదు, సేమ్, ఉడకబెట్టుకుని, ఎప్పటికప్పుడు ఒలుచుకుని తినడం… మక్క కంకిని కాల్చుకుని పళ్లతో కొరుక్కుంటూ (కంకడం అంటారు, అందుకే దానికి కంకి అనే పేరు వచ్చిందన్నాడు ఓ మిత్రుడు) తింటేనే మజా… ఇప్పుడంతా స్వీట్ మెయిజ్ (హైబ్రీడ్ మక్కలు) ఉడకబెట్టుకుని తినడమే ఫ్యాషన్…
సీతాఫలాల్ని తినడం కూడా ఓ ఆర్టేనండోయ్… ఇప్పుడు లేదు గానీ, పల్లెల్లో పిల్లలు తుప్పల వెంబడి తిరిగి, సీతాఫలాల్ని తెంపి, అక్కడే కాల్చి (నిజమే, కాల్చి) తినేవాళ్లు… కచ్చా సీతాఫలాల్లోని గుజ్జు మొత్తం ఉడికి అదోరకం టేస్ట్… సరే, మామిడికి వద్దాం…
ఆ కాల్షియం కార్బైడ్ కేన్సర్ కారకం… ఐనా వ్యాపారి ఎవడూ ఆపడం లేదు… అది మరో విషాదం… ఈ రసాయనం తేమతో కలిసినప్పుడు ఎసిటిలిన్ (Acetylene) అనే వాయువును విడుదల చేస్తుంది… ఈ వాయువు పండ్లు త్వరగా పండేలా (రంగు వచ్చేలా) చేస్తుంది… కృత్రిమంగా పండిన పండ్లను ఎలా గుర్తించాలనేది కూడా ఓ కళ… ఓ నైపుణ్యం…
ఏ రసాయనాలూ చల్లకుండా, ఎరువులు వాడకుండా… పూర్తిగా ఆర్గానిక్గా పండించిన మన దేశవాళీ రసాలు దొరకడం ఓ వరమే ఈరోజుల్లో… అసలు ఆ పళ్లల్లోనే ఉంది అసలైన ‘మామిడి మార్క్ యూనిక్ మధురం’…!!
Share this Article