.
జస్ట్, 22 వేలు కట్టి రిజిష్టర్ చేసుకొండి, ఇంకేం? రోజుకు 85 వేల సంపాదన, నెలకు 2.18 లక్షలు… ఇలా ఎవడైనా ప్రచారం చేస్తే..? పక్కా ఫేక్, ఫ్రాడ్ అని ఓ అంచనాకు వస్తారు కదా… కానీ సోషల్ మీడియాలో ఈ ప్రచారం జోరుగా సాగుతోంది… నమ్మేవాళ్లు, మోసపోయేవాళ్లు సమాజంలో ఎప్పుడూ ఉంటారు కదా… మరీ ఈ సైబర్ క్రైమ్ కాలంలో..!
సైబర్ క్రైమ్ జాగ్రత్తల మీద ఫోన్ కాలర్ టోన్ల నుంచి పెద్ద ఎత్తున వ్యాసాలు, ఇంటర్వ్యూల దాకా ప్రభుత్వం ప్రచారం చేస్తోంది… గుడ్, మంచిదే… కానీ మరి పైన చెప్పిన సోషల్ మీడియా ప్రచారాల మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..? ఎందుకు చేతకావడం లేదు..?
Ads
ఎంత ఘోరం అంటే… ఈ పోస్టుల్లో ఎక్కువగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎఐ వీడియోలను వాడుతున్నారు… ఆమె కేంద్ర ప్రభుత్వం తరఫున ఎండార్స్ చేస్తున్నట్టుగా వీడియోలు… అచ్చం ఆమె గొంతుతోనే…! దాదాపు సంవత్సరకాలంగా నేను గమనిస్తున్నాను ఈ పోస్టులను…

నిర్మలమ్మే కాదు… ఇక ఎంతకు తెగించారంటే వీళ్లు… మోదీ, రాజనాథ్సింగ్, అంబానీ, సుధామూర్తి తదితరుల ఫోటోలను, ఎఐ వీడియోలను కూడా వాడేస్తున్నారు… ఇండియన్ గవర్నమెంట్ అని లోగోలు కూడా..! అంటే బలంగా నమ్మేందుకు ప్లాన్…
నీట్ పరీక్ష సజావుగా సాగడం కోసం ఏకంగా టెలిగ్రామ్ యాప్ ఆపేస్తున్నారు కదా… మరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద నిరాటంకంగా, నిర్భయంగా సాగుతున్న ఈ ‘22 వేల స్కీమ్ కమ్ స్కామ్’ మీద చర్యలు లేవేమిటి..? ప్రతి రాష్ట్రానికీ సొంతంగా సైబర్ సెల్స్ ఉన్నాయి, కేంద్రానికీ పకడ్బందీ విభాగం ఉంది…
వాళ్లెవరికీ ఈ పోస్టులు కనిపించడం లేదా..? సోషల్ మీడియా ప్లాట్ఫారాల మీద చర్యలకు భయపడుతోందా..? టెలిగ్రామ్ మీద యాక్షన్ తీసుకున్నప్పుడు, కొన్ని కేసుల్లో సోషల్ మీడియా ప్లాట్ఫారాలకు నోటీసులు జారీ చేయబడుతున్నప్పుడు, అల్లర్లు జరిగే సందర్భాల్లో మొత్తం సోషల్ మీడియా ప్లాట్ఫారాల్ని ఆపేస్తున్నప్పుడు, చైనా బాపతు యాప్స్ను నిషేధిస్తున్నప్పుడు… మరి ఈ స్కామ్ ప్రచారాలను ఎందుకు ఉపేక్షిస్తున్నట్టు..?
Share this Article