.
“లెనిన్ సినిమాలో రష్మిక మందన్నా లేదా పూజా హెగ్డేతో ఓ భారీ ఐటెం సాంగ్ ప్లాన్ చేశాం… మాస్ ట్యూన్ కూడా రెడీ… చివరికి కథకు ఈ సాంగ్ స్పీడ్ బ్రేకర్ అవుతుందని తీసేశాం” అని సంగీత దర్శకుడు తమన్ చెప్పాడు… ఏదేదో చెబుతుంటాడు కూడా… ఇదీ వినడానికి ఇంట్రస్టింగ్గానే ఉంది… కానీ ఈ కథ విన్న వెంటనే చాలామందికి వచ్చిన మొదటి సందేహం…
అసలు రష్మిక కేవలం ఒక స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకునేదా? ప్రస్తుతం ఆమె పాన్ ఇండియా స్టార్. పుష్ప తర్వాత ఆమె మార్కెట్, ఇమేజ్ మరో స్థాయికి వెళ్లాయి. హీరోయిన్గా వరుసగా పెద్ద సినిమాలు చేస్తున్న ఆమె, కేవలం మూడు నాలుగు నిమిషాల పాట కోసం డేట్లు కేటాయించడం, అదీ ఓ ఐటమ్ సాంగ్ కోసం అంత సులభమైన విషయం కాదు. పైగా ఇప్పటివరకు రష్మిక అలాంటి స్పెషల్ సాంగ్ చేయలేదు కూడా. ప్రస్తుతం ఆమె లెక్కలు వేరు.
Ads
సరే… పూజా హెగ్డే పేరు కూడా వినిపించింది… ఆమెకు ఇటీవల హీరోయిన్గా అవకాశాలు తగ్గిన మాట నిజమే. కానీ అందుకే ఐటెం సాంగ్ చేస్తుందని ఫిక్స్ అయిపోవడం కూడా కరెక్ట్ కాదు. స్టార్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్ చేయాలంటే అది కేవలం డబ్బు విషయం కాదు. ఇమేజ్, ప్రెజెంటేషన్, సినిమా రేంజ్… ఇలా చాలా లెక్కలు ఉంటాయి.
అయితే తమన్ చెప్పిన మాటల్లో ఇంకో ఆసక్తికరమైన అంశం ఉంది. “మాస్ ట్యూన్ కూడా కంపోజ్ చేశా” అని ఆయన చెప్పడం. అక్కడే ఇంకో డౌట్ వస్తుంది. మాస్ ఐటెం సాంగ్స్ అనగానే తెలుగు ప్రేక్షకులకు వెంటనే గుర్తొచ్చేది చాలాసార్లు Devi Sri Prasad. “ఊ అంటావా…”, “ఆ ఆంటే అమలాపురం”, “రింగ రింగా” లాంటి పాటలతో థియేటర్లను ఊపేసిన ట్రాక్ రికార్డు ఆయనది. తమన్ కూడా మాస్ బీట్స్ ఇచ్చాడు, బ్లాక్బస్టర్ ఆల్బమ్స్ చేశాడు. కానీ ఐటెం సాంగ్ అంటే థియేటర్లో కుర్చీలు కదిలించే స్థాయి బ్రాండ్ మాత్రం డీఎస్పీకి బలంగా ఉంది.
అందుకే ఈ “మేం ఓ మాస్ ట్యూన్ రెడీ చేశాం… రష్మిక- పూజా పేర్లు అనుకున్నాం…” అనే కథ వింటే కాస్త సినిమాకంటే సినిమా తర్వాత చెప్పే కథ ఎక్కువ ఎంటర్టైనింగ్గా అనిపిస్తోంది.
ఐనా చివరికి తీసుకున్న నిర్ణయం మాత్రం తప్పు కాదు. ఈ మధ్య ప్రేక్షకులు కూడా మారిపోయారు. కథ దూసుకుపోతున్న సమయంలో మధ్యలో ఓ స్పెషల్ సాంగ్ వచ్చి ఐదు నిమిషాలు బ్రేక్ వేస్తే, ఒకప్పుడు విజిల్స్ వేసిన వాళ్లే ఇప్పుడు “ఎందుకురా ఇది?” అని అడుగుతున్నారు. కేవలం కమర్షియల్ ఫార్ములా కోసం పాటను ఇరికించడం కంటే, కథకు ఉపయోగపడకపోతే తీసేయడమే మంచిది.
కానీ… ఈ మొత్తం ఎపిసోడ్లో అసలు హైలైట్ మాత్రం ఒకటే. సినిమా విడుదలైన తర్వాత “ఇలా కూడా అనుకున్నాం… అలా కూడా ప్లాన్ చేశాం…” అనే కథలు బయటకు రావడం ఇప్పుడు కొత్త ట్రెండ్ అయిపోయింది.
ఏది ఏమైనా… రష్మిక, పూజా హెగ్డే, మాస్ ట్యూన్… ఈ మూడు పేర్లు ఒకే వాక్యంలో వినిపిస్తే వార్త మాత్రం వైరల్ అవుతుంది. అదే అసలు ప్లానా? లేక నిజంగానే చివరి నిమిషంలో ఐటెం సాంగ్ ఎడిటింగ్ టేబుల్ మీదే ఆగిపోయిందా? ఆ సమాధానం మాత్రం చిత్రబృందానికే తెలుసు! వాళ్లు చెప్పరు కదా..!!
Share this Article