.
అమరావతి రాజధాని నగరం… కేవలం కొన్ని వేల ఎకరాల విస్తీర్ణం మాత్రమే కాదు, అది కోట్లాది మంది ఆంధ్రుల కల, వేలాది మంది రైతుల త్యాగాల పునాది. అయితే, ఈ కల సాకారం కావడంలో ఎదురవుతున్న జాప్యం, వ్యవస్థలో కనిపిస్తున్న లోపాలు ఇప్పుడు రాజకీయ విశ్లేషణలకు కేంద్రబిందువుగా మారాయి.
అమరావతి: వ్యవస్థాత్మక వైఫల్యం.. అధికారుల నిస్సహాయత… అమరావతికి అసలు విలన్లు ఎవరో వెతకడానికి ప్రతిపక్షాల వైపు చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు నిర్ణయాధికారం చేతిలో ఉన్న ప్రభుత్వమే, తన విధాన నిర్ణయాలతో ఒకప్పుడు ‘విలన్’గా ముద్రపడిన వారిని మళ్లీ ప్రమాదకరమైన శక్తిగా మారుస్తోందన్నది రాజకీయ పరిశీలకుల మాట. దీనికి నిదర్శనంగా ఎస్వీఆర్ శ్రీనివాస్ ఉదంతాన్ని ఒక కీలక మలుపుగా చూడాలి.
Ads
ముంబై మెట్రో, అటల్ సేతు, ధారావి పునర్నిర్మాణం వంటి ప్రపంచ స్థాయి ప్రాజెక్టులను సమర్థవంతంగా నడిపించిన ఎస్వీఆర్ శ్రీనివాస్ వంటి అధికారి, అమరావతికి తన సేవలను అందించాలని ముందుకొచ్చారు. కానీ, వ్యవస్థలో నిర్ణయాధికారం లేకపోవడం, చేతులు కట్టేసే పరిపాలనా తీరు, కనీస సిబ్బంది కొరత… ఆయన వంటి మేధావిని సైతం నిస్సహాయుడిని చేశాయి.
ఫలితంగా, ప్రాజెక్టు మీద ఎంతో ఆశతో వచ్చిన ఆ అధికారి, చేసేదేమీ లేక నిష్క్రమించాల్సి వచ్చింది. ఇది ఒక వ్యక్తి వైఫల్యం కాదు, “నిబద్ధత, నిజాయితీ కలిగిన అధికారులను భరించే ఓపిక ఈ వ్యవస్థకు ఉందా?” అన్న ప్రశ్నను పాలకుల ముందు ఉంచుతోంది.
నాయకత్వ లోపం… ప్రాధాన్యతల గందరగోళం… ఒకప్పుడు సమర్థులైన అధికారులను ఎంచుకుని, ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయించడంలో చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక శైలి ఉండేది. కానీ, ఇప్పుడు అమరావతి విషయంలో ఆ నాయకత్వ పట్టు, ఆ అత్యవసర భావన ఎక్కడో లోపిస్తున్నాయి. రాజధాని నిర్మాణం అనేది ఒక సర్కారుకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం కావాలి. ఆ ఆసక్తి, ఆ పట్టుదల పైస్థాయి నుంచి స్పష్టంగా కనిపించకపోతే, అడుగు కదలడం కష్టమని అమరావతి గతిని చూస్తే అర్థమవుతోంది.
కాంట్రాక్టుల వేగం… పనుల మందగమనం … ఇక్కడ ఉత్పన్నమవుతున్న మరో ప్రధాన అనుమానం – కాంట్రాక్టుల పంపకం. కాంట్రాక్టులు ఇవ్వడంలో చూపే వేగం, క్షేత్ర స్థాయిలో పనులు పూర్తి చేయించడంలో ఎందుకు కనిపించడం లేదు? ఆశించిన ఫలితాలు సాధించని కాంట్రాక్టర్లకే మళ్లీ మళ్లీ ప్రాజెక్టులు ఎందుకు అప్పగిస్తున్నారు? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల మదిలో మెదులుతున్నాయి. కాంట్రాక్టుల వెనుక ఉన్న అసలు ఉద్దేశం నిర్మాణామా లేక మరేదైనా ఆర్థిక ప్రయోజనమా? అన్న సందేహాలు బలంగా వినిపిస్తున్నాయి.
క్రెడిట్ అయినా… బాధ్యత అయినా పాలకులదే … నేడు అమరావతికి ప్రతిపక్షం అడ్డంకి కాదు, పాలకుల నిర్లక్ష్యమే ప్రధాన శత్రువు. ఈ రాజధాని ప్రాజెక్టు జాప్యానికి జగన్ మోహన్ రెడ్డిని బాధ్యుడిని చేయడంలో అర్థం లేదు, ఎందుకంటే అధికారం, నిర్ణయాధికారం చంద్రబాబు ఇప్పుడు చేతుల్లోనే ఉన్నాయి. బాధ్యత కూడా. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు కాంట్రాక్టుల కోసం ఆశపడలేదు, ప్రపంచ స్థాయి రాజధానిని చూద్దామని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.
అమరావతి విజయవంతమైతే దాని క్రెడిట్ ప్రభుత్వానిదే. అదే అమరావతి ప్రాజెక్టు జాప్యానికి గురైనా, ఆ వైఫల్యానికి పూర్తి బాధ్యత కూడా అధికారంలో ఉన్న నాయకత్వానిదే. అభివృద్ధి పట్ల ప్రాధాన్యతను మార్చుకోకపోతే, చరిత్ర ఈ వ్యవస్థను ఎప్పటికీ క్షమించదు.
Share this Article