.
డెస్టినీ..! అన్నీ అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది? విధి రాసిన స్క్రిప్టు ప్రకారం జరుగుతుంది… అశ్విని… మంచి నటి, ప్రతిభ ఉంది, అందం ఉంది, మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి, స్టార్లతో కలిసి నటిస్తోంది…
డబ్బులు, ఆకర్షణ, పాపులారిటీ, రంగుల లోకం… నడిచినన్ని రోజులూ స్వర్గమే కానీ..? విధి వక్రిస్తే..? దూసుకుపోతున్న జీవితానికి యాక్సిడెంటే… అశ్విని జీవితం కూడా అంతే… కేవలం 36 ఏళ్లకే విధి ఒడిలో ఒదిగిపోయిన విషాద తార ఆమె…
Ads
నెల్లూరుకు చెందిన అశ్విని అసలు పేరు వాణి. నిజానికి ఆమె ఆశయం వైద్యురాలు కావాలని. కానీ డెస్టినీ ఆమెను మరో మార్గంలోకి నడిపించింది. చెన్నైలో ఒక బట్టల షాపులో ఉన్నప్పుడు నిర్మాత వాకాడ అప్పారావు కంటపడటంతో ఆమె సినీ ప్రయాణం మొదలైంది.
కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘మా ఇంటికి రండి’ అవకాశం దక్కినా అది పట్టాలెక్కలేదు. చివరకు ధవళ సత్యం గారి ‘గుడిగంటలు మోగాయి’తో సినీరంగ ప్రవేశం చేసింది. వాణి కాస్త ‘అశ్విని’గా పేరు మార్చుకోవాల్సి వచ్చింది. ‘గుడిగంటలు మోగాయి’ విడుదల ఆలస్యం కావడంతో, తమిళ చిత్రం ‘ఆనంద కుమ్మి’ ఆమెను మొదట తెరపై చూపింది. ఆ తర్వాత ‘భారతంలో శంఖారావం’తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.
కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, నాగార్జున, వెంకటేష్, రాజశేఖర్ వంటి అగ్ర నటుల సరసన సుమారు 150 చిత్రాల్లో నటించి అశ్విని అద్భుతమైన గుర్తింపు పొందింది. కెరీర్ పీక్స్లో ఉండగా, 1991లో వీడియో స్టూడియో నిర్వహించే రవీంద్రనాథన్ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. సాంప్రదాయ పద్ధతులకు దూరంగా, దండలు మార్చుకుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదైన వారి వివాహం, కార్తీక్ అనే కొడుకు పుట్టడంతో పరిపూర్ణమైంది. అంతా బాగుందనుకుంటున్న తరుణంలోనే విధి తన పాచికలను తిరగేసింది.
భర్త దూరం కావడం, సినీ అవకాశాలు తగ్గిపోవడం అశ్విని జీవితంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆమెకు ఊపిరితిత్తుల క్యాన్సర్ రూపంలో మృత్యువు శాపంలా ఎదురైంది. తన ఆస్తిపాస్తులన్నీ చికిత్సకే కరిగిపోయాయి. రోజు గడవడమే కష్టమైన స్థితికి చేరుకున్నా, తన ఆత్మగౌరవాన్ని వదులుకోలేదు.
అశ్విని కష్టాలు చివరికి నటుడు పార్థిబన్ వరకు చేరాయి. ఆమె కుమారుడు కార్తీక్, పార్థిబన్ కుమారుడు రాధాకృష్ణన్ క్లాస్మేట్స్ కావడం, స్నేహితుడికి తన ఇంటి దుస్థితిని కార్తీక్ చెప్పుకోవడం విధి రాసిన ఒక చిన్న కరుణాత్మక మలుపు. ఆ విషయం తెలిసిన పార్థిబన్ అప్పుడప్పుడు ఆర్థిక సహాయం చేసేవారు.
2012 సెప్టెంబర్ 24న 36 ఏళ్లకే అశ్విని కన్నుమూసింది. మరణం తర్వాత తన అంత్యక్రియలు సొంతూరు నెల్లూరులోనే జరగాలని ఆమె కోరుకున్నారు. అయితే, ఆ చివరి కోరిక తీర్చడానికి కూడా ఆమె కుటుంబం దగ్గర డబ్బులు లేని దుర్భర పరిస్థితి. అప్పుడు కూడా పార్థిబన్ మానవత్వం చాటుకుని, సొంత ఖర్చులతో ఆమె పార్థివ దేహాన్ని నెల్లూరుకు పంపించాడు. అంతేకాకుండా, కార్తీక్ భవిష్యత్తు బాధ్యతను కూడా ఆయన స్వీకరించాడు.
సో, ఈ రోజు వెలుగు రేపు ఉండకపోవచ్చు. ఏదో చీకటి బాకీ ఉండవచ్చు… అశ్విని కథ చెబుతున్నదిదే…
Share this Article