Subramanyam Dogiparthi …. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని సమాజాన్ని, అగ్గి తోటి కడుగు ఈ సమాజ జీవఛ్ఛవాన్ని, మారదు లోకం మారదు కాలం . సాధారణంగా పాట ఒకరు వ్రాస్తారు . మరొకరు పాడతారు . ఇంకొకరు నటిస్తారు . కానీ ఈ పాట ప్రత్యేకత ఏమిటంటే పాటను వ్రాసిన సిరివెన్నెల వారే పాడి సినిమాలో నటించారు కూడా .
1993 ఏప్రిల్లో వచ్చిన ఈ గాయం సినిమాలోని ఈ పాటకు ఇన్ని విశేషాలు ఉన్నాయి . ఈ పాట వ్రాసినందుకు ఉత్తమ సాహిత్యంగా ఆయనకు నంది అవార్డు కూడా వచ్చింది .
- మరో విశేషం ఏమిటంటే ఈ పాట 1990 లో వచ్చిన అభిసారిక సినిమాలో భానుమతి పాడుతుంది . కానీ అప్పుడు రాని అవార్డు ఈ సినిమా సందర్భంగా రావటం .
ఈ గాయం సినిమా రాంగోపాల్ వర్మ కెరీర్లో మరో శివ అని కూడా చెప్పవచ్చు . ఎలా అయితే శివ నాగార్జునకు మంచి బ్రేక్ ఇచ్చిందో జగపతిబాబుకు అలాంటి బ్రేకే ఇచ్చింది . బహుశా ఈ సినిమాలోనే జగపతిబాబు మొదటిసారిగా తన డబ్బింగ్ తానే చెప్పుకున్నాడు . అతనికి కూడా ఉత్తమ నటుడిగా నంది అవార్డు వచ్చింది.
Ads
1990s లో రాజకీయాలు , అంతర్గత కుమ్ములాటలు , అసమ్మతి రాగాలు , శాంతిభద్రతలను అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చేందుకు కుయుక్తులు పన్నటం వంటి సన్నివేశాలతో కధను నేసాడు రాంగోపాల్ వర్మ . మణిరత్నం కూడా ఓ చేయి వేసాడు కధను నేయటంలో .
రాజకీయ నాయకులు , రౌడీ ముఠాలు , వారి ఆధిపత్య పోరు , పోలీసుల ప్రచ్ఛన్న హస్తం వంటి అంశాల చుట్టూ నడుస్తుంది . ఆ రోజుల్లో చాలా సినిమాల్లోలాగా కోట శ్రీనివాసరావు తెలంగాణా యాసతో అదరగొట్టేసారు . ఆయనకు కూడా ఉత్తమ ప్రతినాయకుడిగా నంది అవార్డు వచ్చింది .
- మరో విశేషం ఆయన స్వంత కుమారుడు ఆంజనేయ ప్రసాద్ సినిమాలో కూడా కుమారునిగా నటించటం .
కొంత షూటింగ్ బాంకాక్ లో జరిగింది . ఇండియాలో గేంగ్ వార్ని వదిలించుకుని బాంకాక్ చేరిన జగపతిబాబుని ఇండియా నుండి వెళ్ళిన విలన్లు కోట కుమారుడు , వాళ్ళ లాయర్ తనికెళ్ళ భరణి గెలుక్కుంటారు . తప్పక మరలా జగపతిబాబు ఇండియాకు వచ్చి గేంగ్ వార్ కొనసాగించి అందరినీ లేపేస్తాడు .
గేంగ్ లీడర్ గా కొనసాగటంతో సినిమా ముగుస్తుంది . 2010 లో గాయం-2 వచ్చినా సక్సెస్ కాలేదు .
చక్రవర్తి కుమారుడు శ్రీ సంగీత దర్శకత్వాన్ని నిర్వహించాడు . పాటలన్నీ సిరివెన్నెల వారే వ్రాసారు . నిగ్గదీసి అడుగు పాట లాంటిదే మరో సందేశాత్మక పాట కూడా ఉంది . సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని, సుఖాన మనలేని వికాసమెందుకని అడుగుతుంది అదిగో ఎగిరే భరత పతాకం .
రేవతి , జగపతిబాబు మీద డ్యూయెట్లు నా కోసమే చినుకై కరిగి ఆకాశమే దిగదా ఇలకు , అలుపన్నది ఉందా ఎగిరే అలకు చాలా రొమాంటిగ్గా చిత్రీకరించబడ్డాయి . ఊర్మిళ , ఉత్తేజ్ , తదితరుల మీద నైజాం పోరీ హుషారుగా సాగుతుంది . పోసాని మురళీకృష్ణ డైలాగులు బాగుంటాయి . యార్లగడ్డ సురేంద్ర నిర్మాత .
ప్రధాన పాత్రల్లో తనికెళ్ల భరణి , బెనర్జీ , జీవా , బాలయ్య , రామిరెడ్డి , శివకృష్ణ , గుమ్మడి తదితరులు నటించారు . ఒక విశేషం ఏమిటంటే పోకిరి , విక్రమార్క వంటి సినిమాల ద్వారా పాపులరయిన అజయ్ 1993 లోనే వచ్చిన ఈ సినిమాలో కనిపిస్తాడు .
బెస్ట్ సపోర్టింగ్ రోల్ నంది అవార్డు ఊర్మిళకు , ఉత్తమ ఛాయాగ్రాహకుడు నంది అవార్డు రసూల్ కు , ఉత్తమ ఎడిటర్ నంది అవార్డు శంకర్ కు వచ్చాయి . ఈ సినిమా తమిళంలోకి డబ్ అయింది . రాంగోపాల్ వర్మకు పేరు వచ్చిన సినిమాలలో ఒకటయిన ఈ సినిమా యూట్యూబులో ఉంది . ఆసక్తి కలవారు ట్రై చేయవచ్చు .
Share this Article