Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

45 ఏళ్లనాటి ఈ సినిమాలో ‘సంధ్య థియేటర్ తొక్కిసలాట’ సీన్…!!

January 16, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …… సినిమా వాళ్ళందరూ తాగుబోతులు , తిరుగుబోతులు కాదు అనే సందేశాన్ని జనానికి చెప్పాలనుకుని తీసిన సినిమా ఇది… సందేశాన్ని ఇవ్వాలని కాదు ; చెప్పాలని …

ఏది ఏమయినా దాసరి ఒక సినిమా మేన్యుఫేక్చరర్ . ఒక రోజులో కధను ఫైనలైజ్ చేయగలడు . డైలాగుల్ని ఎలాగూ ఆయన సెట్ల మీద వ్రాసేదే . ఇంక ఆయనకు టైం కావలసింది ప్రొడక్షన్ ప్లానింగుకు , ప్రొడక్షనుకు , పాటలు వ్రాయటానికి , వగైరా . ఈ సినిమాలో పాటల్ని కూడా ఆయనే వ్రాసుకున్నారు .

Ads

1981 లో వచ్చిన ఈ అద్దాలమేడ సినిమా ఓ పిక్నిక్కులాగా తీసి ఉండాలి . ఆల్మోస్ట్ సినిమా అంతా ఔట్ డోరే . ఔట్ డోర్ షూటింగుకు ఒక పల్లెటూరుకు వెళతారు . ఆ పల్లెలో ఓ అమ్మాయిని అప్పటికప్పుడు సినిమాలోకి తీసుకుంటారు . ఒక రాత్రి ఆమె మానభంగానికి గురవుతుంది .

ఆ పాపం చేసింది ఎవరో తెలియదు . సినిమా వాళ్ళల్లో ఎవరో ఒకరు అయి ఉంటారని ఊళ్ళో అందరూ సినిమా వాళ్ళ మీద ఎగబడి , నీరు, కరెంటు, ఆహారం బంద్ చేస్తారు . అందువలన యూనిట్లో ఒక కుర్రాడు చనిపోతాడు కూడా . యూనిట్లోని హీరోయిన్ని బందీని చేసి బలాత్కారం చేయబోతారు .

ఆ హీరోయిన్ మానాన్ని కాపాడటానికి తానే ఆ ఊరమ్మాయిని మానభంగం చేసానని దర్శకుడు దాసరి నెపం తన మీద వేసుకుంటాడు . అతన్ని సున్నంబొట్లు పెట్టి ఊళ్ళో ఊరేగించి కట్టేస్తారు . ఆ సమయంలో అసలు నేరస్థుడిని కనుక్కున్న ఆ ఊరమ్మాయి వాడిని చంపేస్తుంది . తప్పు చేసింది సినిమా వాళ్ళల్లో ఒకరు కాదు ; ఊళ్ళో వాడే అని బయటపడటంతో సినిమా వాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు .

సినిమాల్లో సినిమా షూటింగులు , సినిమా వాళ్ళ గురించి తెలుసుకోవడం ప్రేక్షకులకు సరదాగా ఆసక్తిగా ఉంటుంది . అది దేవత కావచ్చు , శివరంజని కావచ్చు , మరొకటి కావచ్చు . ఈ సినిమాలో జయప్రద , శ్రీదేవి , గుమ్మడి అలాగే తళుక్కుమంటారు .

జయసుధ కూడా దాసరి ప్రేయసిగా , అతన్ని ప్రోత్సహించే మహిళగా నటిస్తుంది . మొన్న హైదరాబాదులో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో ఎలా అయితే రేవతి అనే స్త్రీ చనిపోయిందో , అలాగే ఈ సినిమాలో ఓ థియేటర్ వద్ద తొక్కిసలాటలో జయసుధ పాత్ర చనిపోతుంది .

కధ , స్క్రీన్ ప్లే , డైలాగులు , దర్శకత్వం , ప్రధాన పాత్ర అన్నీ మేన్యుఫేక్చరరే . మురళీమోహన్ , గీత , మోహన్ బాబు , అంబిక , ప్రభాకరరెడ్డి , గోకిన రామారావు , ఎర్ర నారాయణమూర్తి , నిర్మలమ్మ , సంగీత , ఇంకా చాలామంది నటించారు .

ఆస్థాన సంగీత దర్శకులు కాకుండా రాజన్ నాగేంద్ర ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు . ఒక్క నోరు మంచిదయితే ఊరు మంచిది పాటను మాత్రం రాజశ్రీ వ్రాసారు . మిగిలిన పాటలను అన్నీ మేన్యుఫేక్చరరే వ్రాసుకున్నారు .

తొలి చూపు ఒక పరిచయం , నా జీవిత గమనంలో ఒక నాయిక పుట్టింది , ఎదురు చూస్తున్నాను , తారలన్నీ మల్లెలయితే ఆ మల్లెలేమో సొంతమయితే మిగిలిన పాటలు . థియేటర్లో శ్రావ్యంగానే ఉన్నాయి .

తక్కువ బడ్జెటుతో తీయబడిన ఈ సినిమా బాగానే ఆడింది . బాక్సులు పగలకపోయినా , మరీ వెంటనే తిరిగి రాలేదు . సినిమా యూట్యూబులో ఉంది . దాసరి మార్క్ సినిమాల అభిమానులు ట్రై చేయవచ్చు . సినిమా మొదటి అరగంట స్లోగా ఉన్నా , తర్వాత తర్వాత పికప్ అయి సస్పెన్సుతో బాగానే ఉంటుంది .  #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెద్ద దొరవారి ధరణి..! నిఖిల జగమూ నివ్వెరపోయే భారీ భూస్కాం..!!
  • 2 రోజుల్లో నలుగురు ప్రధానులు ఔట్… ఈసారి గ్రహణ బాధితుడు ఎవరు..?
  • శుభమాని ఇల్లు కొనాలంటే… ఈ బ్లూప్రింట్లు తగలేసే గోల ఏమిట్రా…
  • ఓరాకిల్ కాదు, మిరాకిల్..! ఒకే రోజులో 7.3 లక్షల కోట్లు పెరిగిన సంపద..!
  • నటన తెలియనివాళ్ల నుంచీ నటన పిండుకోవడం ఎలాగంటే..?
  • నేపాల్ జనాగ్రహం వెనుక ఇది మరో కోణం… మనకూ డేంజరే…
  • అమృతాంటీ… మరీ అనసూయాంటీ ఆవహించిందా ఏమిటి..?!
  • డాక్టర్ సాబ్… 20 ఏళ్ల క్రితం నా ప్రాణాలు కాపాడారు గుర్తుందా..?
  • నవలా రాక్షసుడు + సినిమా రాక్షసుడు + నట రాక్షసుడు…!!
  • ఐఫోన్-17 సీరీస్… ఈ కొత్త మోడళ్ల అదిరిపోయే కీలక ఫీచర్స్ ఇవే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions