.
మొన్న ముగ్గురు యువకుల్ని ఏపీలో పోలీసులు బహిరంగంగా కర్రలతో బాదుతూ ‘శిక్షించిన క్రౌర్యం’ చూశాం కదా… అదిప్పుడు రాజకీయం చేయబడింది… ఎప్పుడైతే జగన్ వారి దగ్గరకు వెళ్లి ‘ఓదార్చాలని’ నిర్ణయం తీసుకున్నాడో… శిక్షించబడాల్సిన పోలీసులకు హఠాత్తుగా ‘అధికారం మద్దతు’ దొరికింది…
బాధితులు (?) దళితులు, ముస్లిం కాబట్టి రాజకీయ లబ్ది కోసం జగన్ వాళ్ల గత చరిత్ర తెలుసుకోకుండా ‘ఓదార్పు యాత్ర’కు పూనుకున్నాడనీ, వాళ్లపై బోలెడు నేరచరిత్ర ఉందని పలు కథనాలు, వ్యాఖ్యానాలు మొదలయ్యాయి… ఇక్కడ ఓ అంశం గమనించాలి…
Ads
వోకే, వాళ్లు రౌడీ షీటర్లు, వాళ్లపై నేరచరిత్ర ఉన్నమాట నిజమే కావచ్చుగాక… వాళ్లు గంజాయ్ బ్యాచే కావచ్చుగాక… కానీ ఓ పోలీసుతో వాళ్లు వ్యవహరించిన తీరు బాగాలేదు కాబట్టి ఈ పోలీసుల అతి స్పందన… అలా బజారులో బహిరంగంగా ‘శిక్షించడం’ ఏ పద్థతి..?
సరే, పోలీసులు అసలు క్రౌర్యం ఇంకెంత తీవ్రంంగా ఉంటుందో లాకప్పు రూములు, విచారణ గదుల గోడలకు తెలుసు… మొన్న బజారులో చూపించింది తక్కువే… కానీ బహిరంగంగా, ప్రజలందరి ముందు, బజారులో వారిని అంత ఘోరంగా బాదిన వీడియో వైరల్ అయ్యింది… ఒకవేళ వాళ్లు తప్పు చేస్తే చట్టం, న్యాయం అనుమతించిన పద్ధతిలో పోలీసులు వ్యవహరించాలి… అధికారంలో ఉన్న పార్టీ కూడా అదే కోరుకోవాలి…
కానీ ఇక్కడ జగన్ వ్యతిరేక కోణంలో పోలీసుల పట్ల సానుకూలత చూపడం సొసైటీకి మంచిది కాదు… సరే, ఇదంతా ఒక కోణం… మరి జగన్ వాళ్లను ఓదార్చడం దేనికి..? వైసీపీ వర్గాల్లో కూడా ఈ నిర్ణయం పట్ల సదభిప్రాయం పెద్దగా ఏమీ లేదు… వాళ్లు దళితులు, ముస్లిం కాబట్టి పరామర్శకు వెళ్లడం ఏమిటి..? నేరంలో కులం చూడటం ఏమిటని హోం మంత్రి అడుగుతోంది… ఒకింత నిజమే…
వేరే కులస్థులు ఆ ప్లేసులో ఉంటే జగన్ వెళ్లేవాడా అనే ప్రశ్న ఏపీ సర్కిళ్లలో వినిపిస్తోంది… మరెలా..? పోలీసుల చర్యను ఖండించాలి కదా, ప్రతిపక్ష నేతగా అది తన బాధ్యత కాదా అని అడిగేవాళ్లూ ఉన్నారు… ఖండించాలి, కానీ సదరు పోలీసుల చర్యను ఖండించడానికి వాళ్ల దగ్గరకు ఓదార్పు యాత్ర నిర్వహించాల్సిన పనిలేదు… రాజకీయ మద్దతు నేరచరితులకు ఓ బలంగా మారకూడదు… ఆ తెనాలిలో ఓ భారీ ర్యాలీ కూడా చేస్తారట…
మరి నేను కూడా దళిత మహిళనే, ఆ రౌడీలు నా భర్తను చంపబోయారు, వాళ్లకు మద్దతు ఇవ్వడం ఏమిటి అని దాడికి గురైన కానిస్టేబుల్ భార్యతో వీడియో విడుదల చేయించారు… మేం ఆల్రెడీ పోలీసులపై దర్యాప్తు చేయిస్తున్నాం, కానీ ఈ సంఘటనకు కులం రంగుపూయడం ఏమిటని గుంటూరు ఎస్పీ అంటున్నాడు… గతంలో పీఎస్ఆర్ ఆంజనేయులు రౌడీలకు ఇలాగే బజారులో ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు జగన్ ఎందుకు మాట్లాడలేదని ఆంధ్రజ్యోతి ప్రశ్నిస్తోంది…
స్థానిక వైసీపీ నేతలే కోర్టు దాకా తీసుకువెళ్తే సరిపోయేది అనే భావన కూడా ఉంది… ఈ బహిరంగ ప్రతీకారాలు, శిక్షలపై న్యాయవ్యవస్థ ఫోకస్ చేస్తే, సదరు పోలీసులకు వ్యతిరేక తీర్పులు గనుక వస్తే అది సొసైటీకి మంచిది, పోలీసుల క్రౌర్యానికి ఎంతోకొంత చెక్ పెట్టినట్టయ్యేది… సో, రెండు వైపులా రాజకీయమే…
తమ అదుపులో ఉన్నప్పుడు ఓ ఎంపీనే కొట్టలేదా జగన్ హయాంలో అని మరో ప్రశ్న… అదీ తప్పే, ఇదీ తప్పే… కానీ ఒకదాని వెనుక పొలిటికల్ ప్రేరణ ఉండవచ్చు గానీ, ఈ తెనాలి పోలీసులు ఓపెన్ ప్రతీకార ట్రీట్మెంట్ వెనుక పొలిటికల్ ప్రేరణ ఏదీ లేదు… ఏపీ రాజకీయ పరిస్థితుల్లో ఏదీ సజావుగా ఉండదు కదా…! ఆ పోలీసులకు అధికారం మద్దతూ సరికాదు, జగన్ ఓదార్పు యాత్ర కూడా అంతే…!!
Share this Article