.
తెలంగాణ షర్మిల ధర్నా చేసింది… సొంతంగా తండ్రితో సహా, సోదరుడితో సహా, పార్టీతో సహా అందరూ బహిష్కరించినా సరే… అదే తండ్రిని కీర్తిస్తూ… ఫాఫం ఆయనకు నోటీసులు వచ్చాయనే కన్నీళ్లతో ధర్నా…
చాలా విషయాలు చెప్పింది, షర్మిల సభల్లాగే జనం… ఓసారి ఆమె ఏం చెప్పిందో మొత్తం విన్నాక ఆశ్చర్యం, నవ్వు ఒకేసారి ముంచెత్తుతాయి ఏ సగటు తెలంగాణవాసికైనా… ముందుగా ఆమె ఏం చెప్పిందో చదువుదాం ఓసారి… వెంట వెంటనే మన సందేహాలు కూడా అడిగేద్దాం…
Ads
- ‘‘రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ గారికి నోటీసులు జారీ చేశారు… కేసీఆర్ గారు ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చా రు ? కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారంటే… మొత్తం తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్లే…
- — ఇదో నాన్సెన్స్ క్లెయిమ్… తెలంగాణకు ద్రోహం చేశాడని కదా నోటీసులు… తెలంగాణకు నోటీసులు ఇవ్వడం ఏమిటి..? పడికట్టు పదాలు వాడినా కాస్త కామన్ సెన్స్ ఉండాలని ఎవరో పెద్ద చెప్పినట్టు గుర్తు…
తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వడం కేసీఆర్ గారు చేసిన తప్పా ? తెలంగాణను అభివృద్ధిలో నెంబర్ వన్ గా నిలబెట్టడం తప్పా ?
— అంత భారీ ఖర్చు పెట్టి, జనం నెత్తికి అంత ఘనం అప్పులు రుద్ది, అడ్డమైన సొంత ఆలోచనలతో లక్ష కోట్లు తగలేసి కూడా తెలంగాణకు నీళ్లు ఇవ్వలేదనే కదా తెలంగాణ సమాజం ఛీత్కరింపు…
కాళేశ్వరం కమిషన్ కాదు… అది కాంగ్రెస్ కమిషన్, రాజకీయ కమిషన్… కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మూడు బ్యారేజీలే కాదు… ఆ ప్రాజెక్టులో 21 పంప్ హౌజ్ లు, 15 రిజర్వాయర్లు, 200 కిమీ మేర టన్నెల్ ఉంది… కాళేశ్వరం ప్రాజెక్టులో 1500 కిలోమీటర్ల మేర కాలువలు ఉన్నాయి…
అసలు గుండెకాయలే బ్యారేజీలు, అవే దెబ్బతిన్నాక ఈ కాలువలు, పంపు హౌజులు, రిజర్వాయర్లు ఏం చేస్తాయనేది ప్రశ్న, ద్రోహం అక్కడే కదా…
ఎత్తిపోసిన మట్టితో దాదాపు 300 పిరమిడ్లు కట్టవచ్చు… కాళేశ్వరంలో వాడిన స్టీల్ తో 100 ఐఫిల్ టవర్లు కట్టవచ్చు… కాళేశ్వరంలో పోసిన కాంక్రీట్ తో 50 బూర్జు ఖలీఫాలు కట్టవచ్చు…
—- నిజమే, ఫాఫం అవన్నీ బాగానే ఉన్నాయి… ఎటొచ్చీ మేడిగడ్డ కుంగింది, మిగతావాటి పరిస్థితేమిటో జాతిపితకే తెలియాలి…
ప్రాజెక్టు పూర్తయితే 35 శాతం తెలంగాణ భూభాగానికి నీళ్లు అందిస్తుంది… 40 టీఎంసీలతో హైదరాబాద్ కు శాశ్వతంగా నీళ్లు ఇచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం… మన పరిశ్రమలకు 16 టీఎంసీల నీళ్లు అందించే ప్రాజెక్టు కాళేశ్వరం…
—- కొత్త ఆయకట్టు ఏమీ లేదని అందరికీ తెలుసు… పడికట్టు పదాలతో ఇంకా ఇంకా తెలంగాణ సమాజానికి ఈ ద్రోహపు మాటలు దేనికి…?
90 మీటర్ల అడుగున ఉండే నీళ్లను 600 మీటర్లపైకి ఎత్తిపోసే ప్రాజెక్టు… కేసీఆర్ గారిది గట్టి గుండే కాబట్టి అంత పెద్ద ప్రాజెక్టును నిర్మించారు… కాంగ్రెస్ పార్టీ నాయకులకు కలలో కూడా అంతపెద్ద ప్రాజెక్టును కట్టాలన్న ఆలోచన రాదు…
—- అబ్బో… దేవాదుల సంగతేమిటి మరి..? పెట్టిన ఖర్చు ఎంత..? ఒచ్చిన ఫాయిదా ఎంత..?
కేసీఆర్ గారిని బద్నాం చేయడానికి మాత్రమే కాళేశ్వరం కమిషన్ వేశారు…
— తప్పేముంది..? కాలేశ్వరం నీటితో కడిగిన ముత్యంలా బయటికి రావచ్చు కదా.,.
గతంలో కాంగ్రెస్ హయాంలో జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేస్తూ 90 శాతం పనులను మెఘా కృష్ణా రెడ్డి కంపెనీకి ఇచ్చారు…
— దరిద్రపు ఆరోపణ ఎవడు రాసిచ్చాడో గానీ… నవరత్న కంపెనీలకు కదా ఇచ్చింది ప్రాజెక్టులు… అప్పట్లో మేఘా అంటే జస్ట్, నథింగ్… జలయజ్ఞం ఓ పెద్ద సబ్జెక్టు, తెలియక మాట్లాడితే ఇదుగో ఇలాగే ఇజ్జత్ పోతది…
మేడిగడ్డకు చిన్న చిన్న మరమ్మత్తులు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పొలాలను ఎండబెడుతోంది…
—– అదేమైనా వైట్ సిమెంట్ పగుళ్లలో పెట్టేసి, రిపేర్ అయిందనిపించే బాపతా..? మొత్తం ఓ బ్లాక్ కుంగింది, ఇక అక్కరకు రాదు, అసలు మూడు బ్యారేజీలు వేస్ట్ అని కేంద్రం అంటోంది… మరి ఈ పాపం ఎవరిది..? ఇంకా ఎందుకు తెలంగాణ సమాజాన్ని పదే పదే ముంచేసే ఆలోచనలు, మాటలు, వ్యాఖ్యలు…
కాళేశ్వరం ప్రాజెక్టులో 15 పంప్ హౌజ్ పనులు చేసిన మెఘా కృష్ణా రెడ్డిని కమిషన్ ముందుకు పిలిచే ధైర్యం రేవంత్ రెడ్డికి లేకపోవడం సిగ్గుచేటు… కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం మాత్రమే పనిచేస్తోంది…
…. హహహ, ఒక ఫోటో చూడమ్మా… మీ డాడీయే సదరు మేఘాను వేదిక మీద సన్మానించాడు… మీ డాడీ యాంటీ బీజేపీ పార్టీలకు వందల కోట్ల డబ్బు సమకూర్చింది సదరు మేఘా డబ్బేనట కదా…
అదే కృష్ణారెడ్డి, అదే కేసీయార్, అనగా మీ డాడీ… ఇప్పుడు తను శతృవు అయిపోయాడా..? పోనీ, కోర్టులో తెలంగాణ సమాజం తరఫున తన మీద కేసు వేయండి… తెలంగాణ పౌరుషాన్ని చూపించాల్సిన సమయం వచ్చింది, అది నువ్వే…
గోదావరి – పెన్నా అనుసంధానం పేరిట మన జలాల్ని తరలించుకుపోతుంటే ఎవడూ ఎందుకు మాట్లాడటం లేదు..? చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నందున జలదోపిడి చేసినా రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రశ్నించడం లేదు…
— నిజమే,, కానీ అదే బీజేపీతో బీఆర్ఎస్ విలీనం యోచన అని నువ్వే చెబుతున్నావు కదా… మరిక ఎవరేం మాట్లాడతారమ్మా… ఏదో నీమీద లిక్కర్ కేసు, అరెస్టు కాబట్టి నీకు పడటం లేదు గానీ…
బీజేపీలో ఉన్న ఒకే ఒక తెలంగాణ బిడ్డ ఈటల రాజేందర్ కూడా మాట్లడకపోవడం శోచనీయం, బనకచర్ల ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేసే బాధ్యతను ఈటల రాజేందర్ తీసుకోవాలి… కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొచ్చే బాధ్యతను కూడా ఈటల రాజేందర్ తీసుకోవాలి…
—- అబ్బో, ఈటల రాజేందర్ ఇప్పుడు గుర్తొస్తున్నాడా..? మీరే కదా కేసులు పెట్టి, అత్యంత అవమానకరంగా పార్టీ నుంచి పంపించి, అవమానించి, నీచంగా చూసి, పురుగులా తీసిపడేసింది… ఇప్పుడు ఈటల కావల్సి వచ్చాడా..? నువ్వు కూడా ఒక్క మాటా మాట్లాడకపోతివి… అప్పుడు కేసీయార్ ఓ తెలంగాణ జాతికిరణం అనే భ్రమల్లో ఉండేదానివా ఫాఫం….
అవునూ… ఈటల రాజేందర్ మాత్రమే తెలంగాణ బిడ్డా..? అయ్యో ఫాఫం… కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలంగాణవాళ్లు కాదా..? వాళ్లంతా కూడా కేసీయార్లాగే, అనగా మీ డాడీలాగే పాత ఆంధ్రా మూలవాసులా..? ఛ, ఛ, రాజాసింగ్ సహా ఈ బీజేపీ ఆంధ్రులను ఇంకా మనం తెలంగాణవాళ్లే అనుకుంటున్నాం కదా… కవిత చెప్పేదాకా మనకు నిజాలు తెలియకపాయె… ఛఛ, మనమెంత అజ్ఙానులమో కదా..!!
Share this Article