Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పుడితే ఒక్కటి, చస్తే రెండు… అసలు ఆ మాటలో అర్థమేమిటో తెలుసా..?!

June 21, 2025 by M S R

.

Kandukuri Ramesh Babu ……… #కవి_సమయం #మరోసారి #వర్ధంతి ... గూడ అంజన్న పాట

“పుడితొక్కటి సత్తెరెండు రాజిగ ఓరి రాజిగ’
‘పుడితొక్కటి సత్తెరెండు రాజిగ ఓరి రాజిగ… ఎత్తుర తెలంగాణ జెండ రాజిగ ఓరి రాజిగ’… అంటూ మలిదశ ఉద్యమంలో పాటకు పౌరుషాన్ని అద్దిన గూడ అంజన్న తన పాట రహస్యాన్ని మరింత వివరంగా చెబుతున్నడు.

Ads

***
ఎంత ఎదిగినా చెప్పులకు ‘గూడ’ ఎంత ముఖ్యమో అన్నట్టు గూడ అంజయ్య దగ్గరకు వెళ్లంగనే తెలంగాణకు పట్టు అయిన ఊరు తగులుతున్నది. మళ్లీ ‘ఊరు మనదిరా’ అన్న పాట శ్రీకాకుళం, జగిత్యాల, సిరిసిల్ల పోరాటాల నుంచి అడవి ఉప్పొంగేలా, మైదానం గజగజా వణికేలా వినవస్తున్నది. అరక బట్టె మనం, ఆ సెలుక దున్నె మనం,ఈ కంచె కాడ మనం,ఆ మంచె కాడ మనం, మట్టికాడ మనం, ఆ యెట్టికాడ మనం, సావుకాడ మనమే.. సన్నాయి కాడ మనమే..మరి ఈ దోపిడేందిరో..దొర పీకుడేందిరో… అన్న పాట మళ్లీ అంజన్న నోట వినవస్తూ ఉన్నది.

పాడుతుంటే పక్షవాతం వచ్చి విశ్రాంతి తీసుకుంటున్న గూడ అంజన్నవలే లేడాయన, ఉద్యమ సింహం వలె ఉన్నడు. తెలంగాణ వచ్చినంక ఈ కుడి చేయి లేవకపోయినా గని, కాలైనా లేస్తే అట్ల తిరిగొస్తా అని అంటున్నడు.

ఆ పాట విన్పించినంక ఆయన కొద్దిగా నిమ్మళించిండు. ఇక మాటలు షురువైనవి. మల్ల, మలి తెలంగాణకు వచ్చి తను రాసిన గేయాల గురించి చెప్పవట్టిండు. తెలంగాణ ఉద్యమం అంత ఉధృతం కాలేదు. అప్పుడే, ఆ టైంల (1996) రాసిన పాటల్లనే నేను తెలంగాణ అన్న పదాన్ని ఉపయోగించిన. అబ్బ ఎంత బాగున్నది, చెవులకు ఇంపుగా లేదా అనుకునేది. తెలంగాణ అనంగనే ఒక ఆభరణం అనిపించేది.

ఈ మట్టి, వాసన, ప్రకృతి, సౌందర్యం – అంతా ఆ పదంలో కనవడేది. అందుకే తెలంగాణ ఇష్టమైన పదం అయింది నాకు. ఆ ఇష్టమే నా చేత తెలంగాణ…తెలంగాణ.. అంటూ పాట ఎత్తుకునేదాకా నడిపించింది. అప్పటిదాకా నాకే తెలియని అందం – ఆనందం తెలంగాణ అని పాడుతుంటే కలగవట్టింది అంటూ చెప్పడానికి ఉపక్రమించిండు అంజన్న.

హైదరాబాద్‌లోని రాంనగర్. ఒక చిన్న ఇల్లు. ఫార్మసిస్టుగా ఉద్యోగ విరమణ చేసిన అంజన్న ఆ డ్రాయింగ్ కమ్ రీడింగ్ కమ్ రైటింగ్ రూంలోనే ఉన్న బెడ్‌పై నుంచి, పక్కన తన పాటల పుస్తకాలు తోడుగా మాటలాడిండు. పై పాటలోని తొలిచరణం ఆనందమైతే, మలి చరణం విషాదం అంటూ అంత సంతోషంగా తెలంగాణ అని రాసుకున్నాక వెంటనే నిలువెల్ల గాయాల వీణ అని రాసిన వైనాన్నీ చెప్పిండు.

దీనర్థం ఇక్కడి మనుషుల్లోని అమాయకత్వం, దుఃఖం, అన్నీ అయిపోయినంక బాంచెన్ దొర కాల్మొక్త అని ప్రాధేయ పడటం. భూమి కోసం- భుక్తి కోసం- విముక్తికోసం తరతరాలుగా తండ్లాట. అందుల నుంచే తీవ్రమైన మథనం, ఆ క్రమంలోనే నా తెలంగాణ…నిలువెల్లా గాయాల వీణ అన్న పాటను పూర్తి చేసిన. అయితే, ఇదొక దశ అని వివరించిండు.

ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం మళ్లీ ఉధతం అవుతున్నదో అప్పుడు ధూంధాం పేరిట కళాకారులం గ్రామలను చుట్టి రావడం మొదలైంది. మొదటి సభ కామారెడ్డిల జరిగింది.

అప్పుడే నాకు తట్టింది. అందరం దైన్యమే ఆలపిస్తున్నం గదా అని! ఏడ్చి ఏడ్చే గదా మన తండ్రులు, తాతలు ఆయుధాలు పట్టి సాయుధ పోరాటం చేసింది. ఇంకా ఇప్పుడుగూడ మనం ఏడ్సుడేంది? అనిపించింది.

మళ్లీ మళ్లీ పాటల్ని విన్న. ఒక్క పాటనిగాదు. పల్లె పల్లెనా పల్లేర్లు మొలిచే తెలంగాణలోన అన్నసొంటి పాటలే వస్తున్నయి. నా వరకు నాకు దైన్యస్థితిని పాడటం ఒక లోపంగానే ఫీలైన. ఇట్లయితే లాభం లేదనిపించింది. ఆ లోపం నుంచి పాటను పదును పెట్టవలసిందే అని నిర్ణయించుకున్న. అప్పుడు పుడితొక్కటి సత్తెరెండు… రాజిగ ఓరి రాజిగ అన్న పాట రాసిన.

ఈ పాటనే కాదు, నిజం చెప్పాలంటే మలిదశ ఉద్యమంలో చైతన్య స్ఫోరకమైన పాటల్ని రాయాలని నన్ను నేను మలుపు తిప్పుకున్న. అదంతా ఒక సాధన. ఎవరిది వారికే ఒక పాఠం అన్నట్టు ఆయన చెప్పసాగిండు. నక్సలైట్ ఉద్యమంలో పాట తుపాకీని పట్టించింది. తెలంగాణ ఉద్యమంలో జెండా కర్రనైనా చేత పట్టించాల్నా వద్దా? ఈ ఆలోచనే నాచేత ఊపు, చైతన్యం, ఆలోచన పెంచే పాటల్ని రాయించేలా తర్ఫీదు ఇచ్చింది.

ఇక గప్పుడు మొదలైనయి సిసలైన తెలంగాణ ఉద్యమ పాటలు… అయ్యోనివా నువ్వు అవ్వోనివా అన్న పాట రాసిన. అంతకుముందే పుడితొక్కటి సస్తె రెండు అన్న పాట రాసేశిన అని తెలియజెప్పిండు అంజన్న.
రాజిగ ఓరి రాజిగ అన్న పాట గురించి ఇంకో మాట చెప్పాలి.

ఈ పుడితొక్కటి సస్తెరెండు ఏమిటో కూడా చెప్పాలె. మనం ఒకసారే పుడుతం. సస్తె కూడా ఒక్కరమే పోతం. కానీ, యుద్ధంలో ఉన్నామూ అంటే సస్తె ఇద్దరం సావాలె. అంతేగానీ, శత్రువు బతక్కూడదు. చంపైనా వాడితో చావాలి. అంతేగానీ ఒటమి, లొంగుబాటు అస్సలు కూడదు. ఈ చైతన్యం పెంచాలనుకున్న. ఈ భావంతోనే ఆ పాట రాసిన.

గ్రామాల్లో పొలం గట్ల మీద కొట్లాటలు మామూలుగ జరగయి. అన్నదమ్ములు, పాలోళ్లు ఒకరిమీద ఒకరు ఎంత దాకా పోతరంటే గడిసేర్లు విరిచి మరీ మీదవడతరు. పుడితొక్కటి సస్తె రెండు… ఎయ్‌ర… ఎయ్ అని బర్సె ఎత్తి పొడుసుకునేదాకా పోతరు. ఉద్యమంలో చావో రేవో తేల్చుకునే సమయం ఆసన్నమైనప్పుడు ఇట్లాంటి పాటలు అవసరం. అందుకే ఇటువంటి పాటలు గట్టిన అని ఈ పాట పుట్టుక గురించి వివరించిండు అంజన్న.

మరో విశేషం, ఈ పాటలో ఉద్యమంలోకి దూకని రాజకీయ పక్షాలన్నిటినీ అంజన్న ఆనాడు గట్టిగానే ఎండగట్టిండు. ఒక రకంగా ఈ పాట అప్పటి తెలంగాణ ఉద్యమంలో రాజకీయ పక్షాల వెనుకబాటుతనాన్నీ పట్టిస్తుంది. ఒక కాలంలో ఎవరెటు ఉన్నారో సరిగ్గా చూపిస్తుంది. ఆ లెక్కన ఈ పాట ఒక చరిత్ర ఖండిక కూడా.

రాజిగ ఓరి రాజిగ అనడంలో అంజన్న ఇంకొక అడుగును తెలిపిండు. పాట నేరుగా ప్రజల్లోకి వెళ్లడంలోని ఒకానొక రహస్యం అది: పాటలో ఐలపురం రాజిగ అని ఓరుగల్లు రాజిగ అనీ పాడుతూ చివర్లో తెలంగాణ రాజిగ అంటాను. ఇట్లా ఏ ఊర్లో పాడుకుంటే ఆ ఊర్లోని వ్యక్తిని ఆపాదిస్తూ పుడితొక్కటి సస్తె రెండు అంటూ గొప్ప పౌరుషాన్ని రగిల్చే పాటగా మలిచానని అంజన్న అభిమానంగా చెప్పిండు.

అయితే, ప్రజలకు ఉన్న స్పష్టత పాటకు రావాలని, జనం నాడిని పట్టుకునేలా ఉంటూనే పాటకు అదనంగా ఒక ఊపునివ్వాలని, మొత్తంగా ఈ పాట ఎందుకన్న ఆలోచన చేయిస్తూ, ఎత్తుర తెలంగాణ జెండ అని విశదీకరించే ప్రయత్నమంతా ఆ పాటలో ఉంటుందని చెప్పిండు. ఇట్లా ఒక పాటగాడిగా నా వంతు ప్రయత్నం చేసిన అని కూడా అంజన్న వినమ్రంగా చెప్పిండు.

పట్టు పట్టు ఉడుం పట్టు….పల్లె పల్లె లొల్లి వెట్టు అంటూ తెలంగాణ రాకపోతే ఒట్టు అని చివర్లో పలకడం అంటే ఆ ఊపుతో తెలంగాణ సాకారం కావడం ఖాయం అన్న విశ్వాసం కలిగించడం. ఇట్లా ఒక నమ్మికను కలిగిస్తూ పాటను ముగింపుకు తీసుకెళ్లడం కూడా ఈ పాట ప్రత్యేకత.

ఈ లింక్ ద్వారా ఆ పాట వినవచ్చు…. https://www.youtube.com/watch?v=dNDRQd3nT-o

***
కాగా, ఇక్కడో విషయం చెప్పాలి. నాదీ స్వయాన ప్రశ్నించే స్వభావం. దళిత కుటుంబం నుంచి వచ్చిన వాడిని. స్వభావసిద్ధంగానే చిన్ననాటినుంచే అన్యాయాలంటే ద్వేషం ఏర్పడింది. కనుక నేను ఏది రాసినా సూటిగా ఉంటుంది. అందువల్లే ఇసుంట రమ్మంటే ఇల్లంత నాదంటివి? అని సీమాంధ్రులను తప్పు పడుతూ, అయ్యోనివా నువ్వు అవ్వోనివా? అని ముక్కుమీద గుద్దినట్టు పాట రాసిన.

పుడితొక్కటి సస్తె రెండు అని పోరుబిడ్డల రోషాన్ని ప్రకటించిన. అయితే, తెలంగాణ సందర్భం కనుక పౌరుషాన్ని రగిలిస్తూనే, అది ఉజ్వలంగా మండాలంటే దానికి ఇరుసుగా అంతకు ముందరి మనవైన ఉద్యమ చైతన్యాన్ని మళ్లీ పాటల్లో జొప్పించిన అనీ వివరించిండు. ఆ రెండు పాటలే గాదు, నిన్న మొన్నటి మాట. హైద్రాబాద్ కూడా మాకు గావాలె అంటుంటే, కౌన్ కిస్కో సమైక్యాంధ్ర…బస్‌కరో తేరే తమాషా…చోడ్‌దే తెలంగాణ…లేలేవురో తలఖ్‌నామా అంటూ, విడాకులు తీసుకొని పొండిరా అని హెచ్చరించిన.

***
ఒక పరిశీలకుడిగా చెబితే, అంజన్నలో ఇంకో సత్యమూ ఉన్నది. విప్లవోద్యమంలో వర్గకసిని పెంచే పాటలు ఉన్నట్టే తెలంగాణ ఉద్యమంలో అంతటి కసిని పెంచే పాటల్ని అంజన్న రాసిండనే అనాలి. ఒక రకంగా దోపిడీకి వ్యతిరేకంగా తాను రాసిన పాటల్ని ప్రతీకార పాటలనీ చెబితే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.

లేకపోతే పుడితొక్కటి సస్తె రెండు వంటి అల్టిమేట్ పాట కట్టే దమ్ము అంత తేలిగ్గా రాదు. బహుశా ఇది ఉద్యమ ఫలమే. ఆ ఉద్యమం కూడా ఇయ్యాళ్టిది కాదనే చెప్పాలి. స్వయంగా ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లిన అంజన్న అంతకుముందు నుంచే బతుకులు మారాలంటే వర్గ పోరాటం అవసరం అని నమ్మిండు.

తెలంగాణకు వచ్చేటప్పటికి సీమాంధ్రుల పీడననీ అంతే సీరియస్‌గా తీసుకున్నడు. నాటి ఊరు మనదిరా గానీ నేటి పుడితొక్కటి అన్న పాటగానీ, బహుశా తెలంగాణ విప్లవ పాటను నాడూ నేడూ రాసిన తొలి బలమైన కవిగానూ అంజన్నకు గౌరవం దక్కాలేమో కూడా!

***
ఈ పాట విషయానికి వస్తే ఇందులోని పల్లవి కాకుండా చరణాలుగా వాడిన గజ్జెలు గజ్జాలు రెండు గజ్జలో రాజన్న గురించి తప్పక చెప్పుకోవాలి. ఇది మొత్తం పాటను లయాత్మకం చేస్తున్నది. విశేషం ఏమిటంటే తాను ఒక జానపద కవి కట్టిన పొడుపు కథ నుంచి ఈ చరణాలను స్వీకరించడం. అవునట.

నిజానికి, ముడ్డి చుట్టు గజ్జెలున్న దాని పేరేమందురు? అని ఆ పొడుపు కథ. తానె తందానాన తమిదిమి రాజ వందనానా అంటూ అడుగుతరు. ఆ పొడుపు కథ నుంచి నేను గజ్జల్ని తీసుకుని గజ్జెలు గజ్జాలు రెండు అని మార్చుకున్న. అంటే దానర్థం అది తాటి చెట్టని, దానికి కట్టిన లొట్లనీ అర్థం! ఆ లొట్లనే తాను ఈ పాటకు చరణాలను చేసుకున్న అని నవ్వి చెప్పిండు అంజన్న.

మొత్తం ఒక దీర్ఘ కవిత వంటి ఈ పాటను వింటూ ఉంటే, గజ్జెలు గజ్జాలు రెండు గజ్జెలో రాజన్న అన్న చరణాలతో సాగుతూ ఉంటే…విన్న ఏ మనిషైనా తెలంగాణ ఎట్లా దోపిడీకి గురైందో తెలుసుకుంటడు. తెలంగాణ జెండ ఎత్తక తప్పదన్న చైతన్యాన్ని పొందుతడు.

***
మళ్ల్లీ నిర్ధిష్టంగా పుడితొక్కడు సస్తె రెండు అన్న పాట గురించి మాట్లాడుకుంటూ ఉండగనే ఆయన అమాంతం మలి తెలంగాణ నుంచి తొలి తెలంగాణ, అటు పిమ్మటి దశ -1969కు వెళ్లిండు. తెలంగాణ ఉద్యమం వెనక్కు పోవడాన్ని ప్రస్తావిస్తూ మలి తెలంగాణలో ఆ చైతన్యం మళ్లీ పురుడు పోసుకోవడం, అది నిలబడటం, తెలంగాణ సాధించుకోవడం ఇదంతా ఒక సుదీర్ఘ పోరాట ఫలం, అమరుల త్యాగ ఫలితం అని చెప్పిండు.

వచ్చిన తెలంగాణ గురించి భిన్నాభిపాయాలు ఉండవచ్చు. అది టీఆర్‌ఎస్‌ గానీ కాంగ్రెస్‌ గానీ ఎవరు తెచ్చారని చెప్పుకోవడం కాదు, ఇప్పటి తెలంగాణ ఒక రూపాంతరమేగానీ ఇదే మొదలు ఇదే ఆఖరూ కాదనీ ఆయన సుస్పష్టం చేస్తున్నడు.

***
ఒకనాడు (1969) పొద్దంత తెలంగాణ, రాత్రయితే విప్లవం లాగా సాగిన కాలంలో మేం యువకులం అంటూ ఆనాటి కాలం గురించి కూడా ఈ సందర్భంగా అంజన్న యాది చేసుకున్నడు. పదో తరగతి చదవంగనే పట్నం వచ్చిన. చంచల్‌గూడ ఇంటర్ కాలేజీల చదువుతూ అరుణోదయ స్థాపించడంలో ఉన్న అంటూ, అప్పుడు అంటే 1971లో తాను అమ్మ నవల చదివిండట.

అందులో పావెల్ పాత్ర తనకు స్ఫూర్తి నిచ్చిందట. అంతే. తానూ పావెల్ అయ్యిండట. ఉద్యమంలో ఉన్నడు. జైళ్లో పడ్డడు. అట్లట్ల తాను జనం పాటయిండు. ఊరు మనదిరో అన్న పాట అదే ఏడు రాసిండు. అదీ అంజన్న. పాటంటే కాల మహిమ. ఇప్పుడు ఆ పాట ఎందుకో మళ్లీ పాడుకోబుద్ది అవుతున్నది అనీ అంటున్నడు అంజన్న.

ఆ పాట చివర్లో, గీ దొర యేందిరో...దొరతనమెందుకురో అని ప్రశ్న ఉంటది. నిజంగా ఆ పాట గొప్పది. స్వాతంత్య్రానంతరం ఇంతటి పాట మళ్లీ ఇప్పటిదాకా రాలేదని పరిశీలకులు అంటరు. అంతేకాదు, తెలుగు సాహిత్యంలో ఈ పాట మాదిరి ఒకే బాణిలో అవే చరణాలతో భారతీయ భాషలన్నిటిలోకి వెళ్లిన పాట గానీ, దేశంలోని నలుమూలలకీ చేరుకున్న గీతం గానీ మరోటి చరిత్రలో లేదు.

ఆ లెక్కన కూడా ఈ పాట విశిష్టత ఉంది. అయితే, చరిత్ర పునర్నిర్మాణం అవుతున్న సమయంలో తెలంగాణ తొలిసారిగా స్వతంత్రం పొందుతున్న ఈ తరుణంలో ఈ పాట మరోసారి అవశ్యమైన పాత్ర పోషించినా ఆశ్చర్యం లేదు. ఇప్పటి వేదికల మీద ఈ పాట పాడితే ఇక వేరే ఎజెండా, మ్యానిఫెస్టోల అవసరం ఉండదనడం అతిశయోక్తి కాదు.

ఆ లెక్కన కూడా ఈ పాట వర్తమానం పాట. తెలంగాణ సమాజానికి ఈ పాట రాసి మహోపకారం చేసిండు అంజన్న. బహుశా కవితా న్యాయం అంటే ఇదేనేమో! తిరిగి తిరిగి అక్కరకు వచ్చే పాట అందివ్వడం.
~ కందుకూరి రమేష్ బాబు (13 ఏప్రిల్ 2014)

.

.
*’కవి సమయం’ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పని చేసి సకల జనులను ఉత్తేజితం చేసిన పాటలు, ఆ కవి గాయకులపై రాసిన వ్యాస పరంపర. నమస్తే తెలంగాణ ‘బతుకమ్మ’ అనుబంధంలో వరసగా మొత్తం పందొమ్మిది మందిపై రాసినవి. ఇవన్నీ సరిగ్గా 11 years back రాసినవి. ఇందులో మీరు చదివిన గూడ అంజయ్య గారితో సహా దేవరకొండ భిక్షపతి, నిసార్, గద్దర్ లు ఇప్పుడు లేరు. అంజన్న 21 జూన్ 2016లో కాలం చేశారు…

.

(చివరగా..... తెలంగాణ కోసం పరితపించినవాడు మరణశయ్య మీద ఉంది కేసీయార్‌ను చూడాలని ఉంది అంటే... చూడటానికి మనసు రాలేదు ఆధునిక దొరకు... అర్థమైంది కదా... నిస్వార్థ పోరుగీతానికీ, స్వార్థ ప్రయోజన వాడకానికీ నడుమ తేడా...)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒక అంబానీ ఎదుగుదల..! కుబేర చూస్తుంటే ఏమీ గుర్తుకురాలేదా..?
  • పుడితే ఒక్కటి, చస్తే రెండు… అసలు ఆ మాటలో అర్థమేమిటో తెలుసా..?!
  • హీరో భారీ ఫోటోలతో హీరోయిన్ రొమాన్స్… విజయశాంతి ఆరబోత…
  • నగరం వదిలేశాడు… సొంతూరు చేరాడు… ఆ పల్లెకు మళ్లీ జీవకళ తెచ్చాడు…
  • మరీ సిల్క్ స్మిత మీద ప్రతీకారం, అదీ పునర్జన్మతో… నచ్చలేదు..!!
  • బనకచర్ల సినిమా కథలో మరో పెద్ద ట్విస్టు…! బస్తర్ టు బనకచర్ల..!!
  • జూన్ 20… నిజంగానే ఈ దినానికి ఇండియన్ క్రికెట్‌లో పవిత్రత ఉందా..?!
  • భార్యా చైతన్యవతీ శత్రు..! నిజమేనా..? స్త్రీలు అంత ప్రమాదకారులా..?!
  • ఓ మేనత్త కథ… ఓ కుటుంబ కథ… సొంత బిడ్డలూ కానని దుఖపు కథ…
  • వాడెప్పుడూ పాకిస్తానీ స్నేహితుడే… మనమెందుకు సాగిలబడుతున్నాం…!?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions