.
Subramanyam Dogiparthi ….. ఎవరు నయం ? ఆడపిల్లలా మగపిల్లలా ! వాళ్ళ వాళ్ళ ఖర్మలను/కర్మలను బట్టి ఉంటుంది . నిన్ననే టెన్త్ క్లాస్ చదివే ఓ అమ్మాయి ప్రియుడితో కలిసి తల్లిని చంపేసింది .
లేచింది నిద్ర లేచింది మహిళాలోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం అని అరవై ఏళ్ళ కిందే పాడారు . అప్పట్లో ప్రారంభమయిన ఆడవారి జైత్రయాత్ర దినదిన ప్రవర్ధమానమై మగవారికి ఏమీ తీసిపోము అన్నట్లుగా ఆడపిల్లలు కూడా మగపిల్లలు చేసే అన్యాయాలను , మోసాలను చేసేస్తున్నారు . ఇదంతా నేను చెప్పేది తల్లిదండ్రులను హింసించే పిల్లల గురించి .
Ads
గత జన్మలో మనం బాకీ ఉన్నా , మన మీద శత్రుశేషం ఉన్నా బిడ్డలుగా పుట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతారు . Of course . ఈ ఖర్మ గోలంతా పిల్లలకూ వర్తిస్తుంది . పిల్లల ఖర్మ బాగుండకపోతే పిల్లల్ని చంపించే తల్లిదండ్రులూ పుడతారు . సరే ! ఈ వేదాంతం ఓ పట్టాన తెగదు . 1985 లో వచ్చిన ఈ ఆడపిల్లలే నయం సినిమాలోకి వెళదాం .
చక్కని సందేశాత్మక కుటుంబ కధాచిత్రం . ఎక్కడా అసభ్యత , అశ్లీలత వంటివి లేకుండా చాలా పరిశుభ్రంగా తీయబడ్డ వేజెళ్ళ సత్యనారాయణ సినిమా . కధ , స్క్రీన్ ప్లే , దర్శకత్వం వేజెళ్ళవే . మాటల్ని పాటల్ని డా నెల్లుట్ల వ్రాసారు . పదునైన డైలాగులు , శ్రావ్యమైన పాటలు ఉన్నాయి . హీరోహీరోయిన్లకు ఒక్క డ్యూయెట్ కూడా లేని సినిమా . కనీసం కలలో కూడా డ్యూయెట్ లేదు .
ఓ ఊళ్ళో రెండు కుటుంబాలు ఉంటాయి . డబ్బింగ్ జానకి కుటుంబం . ఆమెకు ఒక కూతురు , ఒక కొడుకు . మరో కుటుంబం రావి కొండలరావుది . ఆయనకు ఇద్దరు కొడుకులు తర్వాత కూతురు . అతనేమో మగపిల్లలు అంటే ప్లస్ , ఆడపిల్లలు అంటే మైనస్ అని నమ్మే వ్యక్తి . ఎవరయినా పిల్లలే అని నమ్మే వ్యక్తి డబ్బింగ్ జానకి .
ఆ ఇద్దరు కొడుకులు భార్యావిధేయులయి శుంఠలు అవుతారు . ఆడపిల్లగా పుట్టిన అమ్మాయి తండ్రి మరణానంతరం దిక్కు లేక కష్టాలపాలు అవుతుంది . డబ్బింగ్ జానకి కూతురు అన్నీ తానే అయి తల్లిని , తమ్ముడిని బాధ్యతగా సాకుతుంది . ఈ కాంట్రాస్టుని వేజెళ్ళ చాలా బాగా చూపుకుంటూ వస్తారు .
ముఖ్యంగా చెప్పుకొవలసింది జయసుధ గురించే . ఆవిడే షీరో ఈ సినిమాకు . ఇలాంటి సినిమాలు అప్పటికే చాలా చేసింది ఆమె . కొట్టిన పిండే . జయసుధ తమ్ముడిగా నటించిన యువకుడి పేరు మురళీకృష్ణ అనుకుంటాను . Subject to correction . అతనూ బాగా నటించాడు . సినిమా ఎక్కువ భాగం వీరిద్దరి చుట్టే తిరుగుతుంది .
ఇద్దరు కొడుకులుగా సుత్తి వేలు , రాజేంద్రప్రసాద్ నటించారు . వారి భార్యలుగా తాతినేని రాజేశ్వరి , శ్రీలక్ష్మిలు నటించారు . ఆసక్తికరంగా సుత్తి వేలుకు , రాజేశ్వరికి డ్యూయెట్ ఉంటుంది . రాజేశ్వరి నిజ జీవితంలో డైరెక్టర్ గారి భార్య అనుకోండి . ఆ మాత్రం ప్రాధాన్యత ఇవ్వాలి కదా…
ఇతర పాత్రల్లో చంద్రమోహన్ , సాక్షి రంగారావు , పి యల్ నారాయణ , రాజ్యలక్ష్మి , ప్రభృతులు నటించారు . అన్ని సినిమాల్లో మానభంగాలు , రౌడీయిజం చేసే భీమరాజుకు ఉదాత్తమైన పాత్ర లభించింది .
చాలా శ్రావ్యమైన సంగీతాన్ని చక్రవర్తి అందించారు . Background score చాలా బాగుంటుంది . ఎక్కడా ఢాంఢాంలు ఉండవు . డా నెల్లుట్ల మంచి పాటలను వ్రాసారు . శరణం శరణం శ్రీ సిధ్ధి వినాయక శరణం నీవయ్యా అంటూ సాగే పాట వినాయక చవితి నాడు జయసుధ కుటుంబం మీద తీసారు . చక్కగా ఉంటుంది .
అక్కాతమ్ముళ్ళ అనుబంధాన్ని వేజెళ్ళ అద్భుతంగా ఆవిష్కరించారు . ఒకరి కొరకు ఒకరు పడే తపన బాగా చూపారు . అమ్మంటే ఆది దేవతా అమ్మంటే ప్రేమా మమత అంటూ అమ్మ మీద అలిగిన తమ్ముడిని సముదాయించే పాట శ్రావ్యంగా ఉంటుంది . అలాగే ఆత్మహత్య చేసుకోబోయే తమ్ముడిని నివారించి జయసుధ పాడే దేవుడే దీవిస్తాడు జాలితో లాలిస్తాడు పాట హృద్యంగా ఉంటుంది .
సినిమా ముగింపులో అక్కయ్య జయసుధ పెళ్ళిలో తమ్ముడు పాడే అక్కయ్య పెళ్ళికి పాటలో… ఆ కుర్రాడు చాలా బాగా నటించాడు . పిల్లలు లేని ఇళ్ళు చూపులు లేని కళ్ళు అంటూ సాగుతుంది సుత్తి వేలు , రాజేశ్వరిల కామిక్ డ్యూయెట్ .
It’s a sentiment and emotion filled family entertainer . A feel good movie . సినిమాలో కధానాయిక ఏడుపులు పెడబొబ్బలు పెట్టే బలహీనురాలు కాదు . ఒంటరయినా ధైర్యంగా జీవితం ఇచ్చే సవాళ్ళను ఎదుర్కొనే పాత్ర . ఆడపిల్ల అంటే ఇలాగే ఉండాలి , ఉండవచ్చు అని చక్కటి సందేశాన్ని ఇచ్చిన సినిమా .
ఈ సినిమా వచ్చిన పదేళ్ళకు దాసరి నారాయణరావు కంటే కూతుర్నే కను అని ఓ విప్లవాత్మక సినిమాను తీసారు . ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకునే సినిమా అది . ఇప్పుడు ఈ ఆడపిల్లలే నయం అనే సినిమా చూస్తుంటే దాసరి వారి సినిమా , రమ్యకృష్ణ నటన గుర్తుకు రాక తప్పదు .
రెండింటిలోనూ జయసుధ నటించింది . ఈ ఆడపిల్లలే నయం సినిమా యూట్యూబులో ఉంది . చూడతగ్గ సినిమా . ముఖ్యంగా జయసుధ అభిమానులు తప్పక చూడవలసిన సినిమా . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగుసినిమాలు
Share this Article