.
Bharadwaja Rangavajhala ….. క్లయిమాక్స్ గొడవలు… సినిమాకు క్లయిమాక్స్ అనేది కీలకం. ఈ విషయంలో రచయితలకీ దర్శకులకి నిర్మాతలకి మధ్య పెద్ద పెద్ద గొడవలు అవుతూ ఉంటాయి .
అలా క్లయిమాక్స్ కష్టాలు ఎదుర్కొన్న డైరక్టర్లలో విశ్వనాథ్ కూడా ఒకరు. శారద సినిమా క్లైమాక్స్ లో శారదకు తన భర్త చనిపోయాడని తెల్సి విధవగా ఊరొస్తుంది … ఊరొచ్చింది లేవమ్మా అని పడవలో చెల్లెల్ని కదిపిన సత్యనారాయణ ఒళ్లో వాలిపోతుంది. కన్నుమూస్తుంది.
Ads
ఇది విశ్వనాథ్ గారు అనుకుని తీసిన క్లైమాక్సు. అయితే నిర్మాత క్రాంతికుమార్ ఆలోచన మరో విధంగా ఉంది.
ఆమె బ్రతికే ఉంటే బాగుంటుంది. అలాగే … ఆమె విధవ అని తెలిసీ ఊళ్లో వాళ్లందరూ ఆమెను తమ పుణ్యకార్యాలకు పిలవడం చేస్తూండగా ముగిస్తే బాగుంటుందనేది క్రాంతి గారి అభిప్రాయం.
ఈ అభిప్రాయానికి ఆయన రావడానికి కారణం కె.ఎస్ ప్రకాశరావు. ఆయనకి సినిమా చూపించి క్లైమాక్స్ ఎలా ఉంటే బాగుంటుందని సలహా అడిగారు క్రాంతి గారు. ప్రకాశరావు గారేమన్నారంటే … శోభన్ సమాధి దగ్గర అలా కూర్చుని ఉంటుంది శారద … మూగమనసులులో జమునలా … అన్జెప్పారు.
దాన్నించి క్రాంతి గారికి వచ్చిన ఎక్స్ టెన్షన్… ఊళ్లో అన్ని పుణ్యకార్యాలూ ఆమె పేరుతో జరగడం ఇలాంటివన్నీ … రెండూ తీసారు కూడా… బోలెడు చర్చల అనంతరం విశ్వనాథ్ అనుకున్నక్లైమాక్స్ తోనే సినిమా విడుదలయ్యింది. హిట్టయ్యింది. అలాగే సీతామాలక్ష్మి విషయంలోనూ జరిగింది.
క్లైమాక్స్ విషాదాంతం చేయాలనేది విశ్వనాథ్ గారి అభిప్రాయం. సుఖాంతం చేయాలనేది నిర్మాత మురారి గారి ఆలోచన. విశ్వనాధ్ గారు కన్విన్స్ కాలేదు… అయితే మురారి తన ఇష్టప్రకారమే క్లైమాక్సు తీసి సినిమా విడుదల చేసి విజయం సాధించారు.
అలాగే సిరిసిరిమువ్వ సినిమా ఎక్స్ పర్ట్ ఒనీనియన్ కోసం పి.పుల్లయ్య గారికి చూపించారు. ఆయన జయప్రదకు మాటొస్తే బాగుంటుందని సలహా చెప్పారు. విశ్వనాథ్ కన్విన్స్ కాలేదు … ఆయన అనుకున్న విధంగా సినిమా విడుదల అయ్యింది. హిట్ అయ్యింది.
జ్యోతి సినిమా క్లైమాక్స్ విషయంలోనూ దర్శకుడు రాఘవేంద్రరావుకీ నిర్మాత క్రాంతికుమార్ గారికీ విబేధాలు వచ్చాయి. సినిమాను ఫ్లాష్ బ్యాక్ లో చెప్పాలా … స్ట్రెయిట్ నేరేషన్ లో చెప్పాలా అని ప్రశ్న …
స్ట్రెయిట్ నేరేషన్ బాగుంటుందని క్రాంతి గారి అభిప్రాయం … ఫ్లాష్ బ్యాక్ లో చెప్పాలనేది రాఘవేంద్రరావు ఆలోచన . కొంత మంది పెద్దల మధ్యవర్తిత్వంతో ఫ్లాష్ బ్యాక్ లో చెప్పడమే మంచిదని క్రాంతి గారిని కన్విన్స్ చేసి సినిమా విడుదల చేసి హిట్టయ్యారు ….
ఇలా చాలా సినిమాల్లో జరుగుతూంటుంది. బాపుగారి కృష్ణావతారం సినిమాలో విజయశాంతిని శ్రీధర్ అత్యాచారం చేశాడనే విషయం ముందే చెప్పేశారు బాపు గారు. మార్నింగ్ షో అదే ఉంది. వెంటనే ఏమనుకున్నారో … ఆ సీన్ కట్ చేసి సెకండాఫ్ లో పెట్టారు…
ఈ మార్పుకు కారణం ఓ థియేటర్ మేనేజర్. విజయవాడ శాంతి థియేటర్ అప్పటి మేనేజర్ మ్యాట్నీకి ఇలా మార్చారు. ఆడియన్స్ రియాక్షన్ బావుండడంతో అన్ని ఏరియాల్లో ఆ సీన్ సెకండ్ హాఫ్ కు మార్చి సినిమాకు కొంత జీవం పోసారు. ఇలా అనేకం ఉన్నాయ్ కమలూ అని చెప్తున్నట్టు లేదూ ఈ ఫోటో. ..
Share this Article