.
( దోగిపర్తి సుబ్రహ్మణ్యం )…. మరో నట వారసుడు నాగార్జున హీరోగా మొదటి సినిమా 1986 మే నెలలో వచ్చిన ఈ విక్రం సినిమా . యన్టీఆర్ , అక్కినేని , కాంతారావుల తరం తర్వాత చిరంజీవి , బాలకృష్ణ తరం ప్రారంభం అయింది . వీరి తరంలో నాగార్జున , వెంకటేష్ ఉంటారు . వెంకటేష్ ఇంకా రావలసి ఉంది . నాగార్జున వచ్చేసాడు ఈ సినిమాతో . హీరోయిన్ శోభనకు కూడా ఇదే మొదటి తెలుగు సినిమా . పద్మిని రాగిణి లలితల మేనకోడలు అయిన శోభన అప్పటికే తమిళంలో అరంగేట్రం చేసి ఉంది .
హిందీలో సూపర్ హిట్ సినిమా హీరోకి రీమేక్ మన విక్రం సినిమా . తన ఇరవై సినిమాలకు దర్శకత్వం వహించిన రీమేక్స్ బాద్షా వి మధుసూదనరావుకే అప్పచెప్పారు అక్కినేని ఈ విక్రం సినిమాను కూడా . హిందీ సినిమాలో హీరోగా నటించిన జాకీ షెరీఫుకి కూడా అది మొదటి సినిమాయే . కుర్రాళ్ళకి బాగా నచ్చాడు జాకీ షెరీఫ్ నాతో సహా . మీనాక్షి శేషాద్రి హీరోయిన్గా , ఆమె తండ్రిగా షమ్మీకపూర్ నటించారు . మీనాక్షి శేషాద్రి తన అందంతో కుర్రోళ్ళ మనసుల్ని దోచేసింది . సినిమా విజయానికి ఆమె అందం , అభినయం బాగా ఉపకరించాయి .
Ads
అక్కినేని అభిమానులు , వారి అభిమాన సంఘాలు నాగార్జున మొదటి సినిమా అయిన ఈ విక్రంను బాగా స్వాగతించారు . యన్టీఆర్ vs ఏయన్నార్ గొడవలు అప్పట్లో భీభత్సంగా ఉండేవి . ఇప్పుడు తెదేపా vs వైసీపీ లాగా భీకర యుధ్ధాలు జరిగేవి . యన్టీఆర్ వారసుడు బాలకృష్ణ వచ్చాక అక్కినేని అభిమానులు నాగార్జున ఎంట్రీ కొరకు చకోరాల్లాగా ఎదురు చూసారు . విక్రం రానే వచ్చింది . వాళ్ళ ఎదురు చూపులు ఫలించాయి . ఇదీ నాగార్జున ఎంట్రీ కధ .
దారి తప్పిన యువకుడిని తన స్వఛ్ఛమైన ప్రేమతో ఒక యువతి మంచివాడిగా మార్చి జన జీవన స్రవంతి లోకి తెస్తుంది . పోలీసులకు లొంగిపోయేలా చేస్తుంది . హీరోయిన్ తండ్రి సత్యనారాయణ రిటైర్డ్ ఐజీ . డ్యూటీ మైండెడ్ . ఓ క్రిమినలుతో తన కూతురి పెళ్ళి చేయటం ఇష్టం ఉండదు . విలన్ కన్నడ ప్రభాకర్ నుండి సత్యనారాయణ , శోభనలను రక్షించి గుడ్ బాయిగా గుర్తించబడి సత్యనారాయణ చేతనే తన కుమార్తెను పెళ్లి చేసుకోమని హీరో అడిగించుకోవటంతో సినిమా ముగుస్తుంది .
సుడిగుండాలు వంటి సినిమాలలో బాల నటుడిగా నటించిన నాగార్జునకు హీరోగా మొదటి సినిమానే అయినా అనుభవం ఉన్న నటుడి లాగా బాగానే నటించాడు . శోభన మేనత్తల్లాగా మంచి శాస్త్రీయ నృత్యకారిణి . ఆమె నృత్య కౌశల్యాన్ని దర్శకుడు మధుసూధన రావు గారు బాగానే ఉపయోగించుకున్నారు . ఈ రెండు పాత్రల తర్వాత ప్రధాన పాత్రలు సత్యనారాయణ , చంద్రమోహన్లవే . ఇద్దరూ బాగా నటించారు . ఇద్దరిలో పెద్ద తాంబూలం సత్యనారాయణదే .
వి మధుసూధన రావు గారి మధు ఫిలిం ట్రైనింగ్ సంస్థలో తర్ఫీదు అవుతున్న కుర్రాళ్ళని నాగార్జున స్నేహితులుగా తీసుకున్నారు . ప్రముఖ రంగస్థల నటుడు , రచయిత చాట్ల శ్రీరాములు ఒక ప్రధాన పాత్రలో నటించారు . ఇతర ప్రధాన పాత్రల్లో కన్నడ ప్రభాకర్ , పుష్పలత , రమాప్రభ , రాజ్యలక్ష్మి , అన్నపూర్ణ , కాంతారావు , ప్రభృతులు నటించారు . వీళ్ళల్లో రమాప్రభ పాత్ర , ఆ పాత్రలో ఆమె నటన చెప్పుకోవలసినవే .
చక్రవర్తి సంగీత దర్శకత్వంలో సలీం నృత్య దర్శకత్వంలో వేటూరి వారి పాటలు శ్రావ్యంగా , అందంగా ఉంటాయి . ఔట్ డోర్ లొకేషన్లు అందంగా ఉండటంతో పాటల చిత్రీకరణ బాగా వచ్చింది . శోభన నృత్య కౌశల్యం ఏడ్ అయింది . కొండ కోనల్లో వెండి వెన్నెల్లో పాట చిత్రీకరణ , శోభన పెర్ఫార్మన్స్ బాగుంటుంది . నీవేలే నా ప్రాణం నీవేలే నా సర్వం డ్యూయెట్ రొమాంటిగ్గా , కాస్త హాటుగా కుర్రాళ్ళకు బాగా నచ్చింది .
మరో డ్యూయెట్ నీవే రాగం నేనే గీతం కూడా బాగుంటుంది . జేసుదాస్ పాడిన ఓ కాలమా పాట శ్రావ్యంగా ఉంటుంది . మిగిలిన పాటల్ని బాలసుబ్రమణ్యం , సుశీలమ్మలు పాడారు . సత్యానంద్ సంభాషణలు బాగానే ఉంటాయి . ప్రముఖ నటుడు ఆహుతి ప్రసాద్ ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టరుగా పనిచేసారు .
సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూడని నాగార్జున అభిమానులు తప్పక చూడవచ్చు . నాగార్జున అభిమానులు మన్మధుడి మొదటి సినిమా చూడకపోతే ఎలా !? It’s a romantic , action entertainer .
#తెలుగు_సినిమాల_సింహావలోకనం #తెలుగు_సినిమాలు #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్
Share this Article