.
ఒక వార్త… నిన్న ఆంధ్రజ్యోతిలో కనిపించింది… అదీ ఆంధ్రా ఎడిషన్లో… ఖచ్చితంగా ఏపీకి చెందిన తెలుగు ప్రజలు మాత్రమే చదవాల్సిన వార్త అని రాధాకృష్ణకు ఎందుకు అనిపించిందో తెలియదు… ఈ వేషాలు వేసేవాళ్లు ఆంధ్రా నుంచి వెళ్లినవాళ్లే అని ఫిక్సయినట్టున్నాడు…
నిజానికి హైదరాబాద్, తెలంగాణ ఎడిషన్లలోనూ ఇది వాడి ఉండాలి… మూర్ఖాభిమానుల తిక్క చేష్టలు రెండు రాష్ట్రాల తెలుగువాళ్లలోనూ ప్రబలింది… మరీ డాలస్నలో కనిపిస్తున్న వెర్రితనం గురించి ‘ముచ్చట’ ఇంతకుముందు పలుసార్లు కథనాలు ప్రచురించింది… స్థానిక అమెరికన్లకు చిర్రెత్తిస్తున్నది మనవాళ్ల పోకడ…
Ads
సరే, డాలస్లో జరిగిన ఓ ప్రవాస భారతీయ అవగాహన సదస్సు వార్త ఇది… దాన్నోసారి యథాతథంగా చదివేయండి… మిగతా తెలుగు ప్రజలకూ చదవదగిన వార్తే… అమెరికాలోె ఉన్నవాళ్లు కాదు, ఇక్కడ ఉండిపోయిన పేరెంట్స్ తప్పక చదవాలి… మన పిల్లకాయలు ఎక్కడికి పోయినా మన పాత రోతను మోసుకుపోతూ, వ్యాప్తి చేస్తున్నారు కాబట్టి..!
భారతీయులకు చెడ్డపేరొస్తోంది!
వీధుల్లో ఉత్సవాలు, బాణసంచా కాల్చడం, లౌడ్ స్పీకర్ల వాడకం ప్రమాదకరం
థియేటర్ల వద్ద పాలతో అభిషేకాలు, ఈలలు, డ్యాన్సులతో అమెరికన్ల చిన్నచూపు… డాలస్ సదస్సులో వక్తలు
(డాలస్ నుంచి కిలారు గోకుల కృష్ణ) ….. “అమెరికాలో నివసిస్తున్న భారతీయులు, మరీ ముఖ్యంగా కొందరు ప్రవాస తెలుగువారి ప్రవర్తనతో భారతీయులకు చెడ్డపేరు వస్తోంది. కొందరు అవగాహనా రాహిత్యంతో వ్యవహరిస్తుండడంతో ప్రవాస భార తీయుల గౌరవానికి భంగం వాటిల్లుతోంది” అని డాలస్ లో వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
కొందరి విపరీత పోకడల వల్ల భారతీయులందరూ అపఖ్యాతిని మూటగట్టుకోవాల్సి వస్తోందని చెప్పారు. తోటకూర ప్రసాద్ ఆధ్వర్యంలో డాలస్లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు’ నిర్వహించారు. ఈ సదస్సులో స్థానిక చట్టాలు, నియమనిబంధనలు, సాంస్కృతిక విలువలను గౌరవిస్తూ బాధ్యతాయుతంగా ఎలా జీవించా లన్న అంశంపై చర్చించారు.
విభిన్న సంస్కృతులు, భాషలు, మతాల ప్రజలు నివసించే అమెరికాలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ప్రవాస భారతీయుల ప్రతిష్ఠను దిగజార్చేలా ఉన్నాయని వక్తలు వాపోయారు. అమెరికా చట్టాల ప్రకారం అనుమతులు లేకుండా వీధుల్లో ఉత్సవాలు జరుపుకోవడం, బాణసంచా కాల్చడం, లౌడ్ స్పీకర్లు వినియోగించడం ప్రమాదకరమని చెప్పారు.
రోడ్లు మూసివేసి జరిపిన ఉత్సవాల వల్ల ఒక అమెరికన్ డ్రైవర్ తుపాకీతో బెదిరించిన ఘటనను ఉదహరించారు. ఇలాంటి వేడుకలు ఆలయ ప్రాంగణాలు లేదా ఖాళీ స్థలాల్లోనే చేసుకోవాలని కోరారు. సినిమా థియేటర్ల వద్ద పాలతో అభిషేకాలు, ఈలలు, డ్యాన్సులు వంటి విపరీత చేష్టల వల్ల అమెరికన్లు మనల్ని చిన్నచూపు చూస్తారని… ఇలాంటి ఘటనలు ప్రవాస భారతీయులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని తెలిపారు.
రాజకీయ నాయకుల అమెరికా పర్యటనల సందర్భంగా కార్ల ర్యాలీలు, నినాదాలు, హోటళ్ల వద్ద గోల చేయడం సరికాదన్నారు. అమెరికన్లతో స్నేహపూర్వక సంబంధాలు మెరుగుపర్చుకోవాలని చెప్పారు. డాలస్ ను డల్లాస్ పురమని, గంటర్ను గుంటూరు అని, క్యారల్టన్నపు కేరళటౌన్ అని పేర్కొనడం వల్ల చులకన భావం ఏర్పడే ప్రమాదం ఉందన్నారు.
దుకాణాల్లో దొంగతనాలు, మద్యం సేవించి వాహనాలు నడపడం, బహిరంగ స్థలాల్లో బిగ్గరగా మాట్లాడడం వంటి పనులతో చెడ్డపేరు వస్తుందని చెప్పారు. సోషల్ మీడియా ద్వారా రాజకీయ విమర్శలు, అనుచిత పోస్టులు అమెరికన్ అధికారుల దృష్టికి వస్తాయని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు….
Share this Article