.
ఆ ఫోటో చూస్తే… ఎన్నో ఏళ్లుగా బీజేపీకి పనిచేస్తున్న కేడర్, సానుభూతిపరులు, అభిమానులకు ఎక్కడో ఓ మూల కలుక్కుమంటుంది… ఇది రియాలిటీ… ఆ ఫోటో ఏమిటంటే..? బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు ప్లస్ కిషన్ రెడ్డి తామే పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి మరీ, బాబ్బాబు, మున్సిపల్ ప్రచారానికి రావాలని ఆహ్వానిస్తున్న (అడుగుతున్న) ఫోటో…
చాన్నాళ్లుగా బీజేపీ యాక్టివిస్టు మిత్రుడి మాటల్లో చెప్పాలంటే… ‘‘మొన్నమొన్నటిదాకా మా ప్రసిడెంట్ రాంచందర్రావు మాకెవరి సాయమూ అక్కర్లేదు, పొత్తులూ ఉండవు, మాది సొంత సమరమే అన్నాడు… అలాంటిది ఇప్పుడు పవన్ కల్యాణ్ ప్రచార అవసరం ఎందుకొచ్చింది..?’’
Ads
‘‘తను సంఘ్ మనిషి కాదు… చంచలంగా తరచూ విధానాలు మారుస్తాడు… పైగా తెలంగాణ ద్వేషి… ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 11 రోజులు నిద్రాహారాలు లేవని బాధపడటమే కాదు, చివరకు మొన్న మొన్న కూడా తెలంగాణ దిష్టి అని కువ్యాఖ్యలకు దిగాడు… ఇప్పుడు బీజేపీ నేతలు తనను తీసుకొస్తే జైకొట్టాలా..?’’
‘‘అప్పటి పీపుల్స్వార్తోపాటు మతఛాందసులతోనూ పోరాడాం… ప్రాణాలను లెక్కచేయలేదు… ఇదుగో ఈ స్థితి కోసమా…? ఇది స్టేట్ బీజేపీ దాసోహమా..? బీజేపీ హైకమాండ్ హుకుమా..? పవన్ వస్తున్నాడంటే చంద్రబాబూ వస్తాడు… ఒకే కూటమి… చంద్రబాబూ తెలంగాణ వ్యతిరేకుడే… మరి ఏం చెప్పుకుని అర్బన్ వోటింగ్ ఆశించాలి మేం..?’’

….. అది చాలా మంది బాధ… పవన్ కల్యాణ్ ప్రచారంతో వచ్చే ఫాయిదా ఏమిటి..? తను లేకపోతే ఈ సోకాల్డ్ బీజేపీ లీడర్లకు ఎన్నికల నిర్వహణ చేతకాదానేది ఆ బాధ సారాంశం… (ప్రస్తుత బీజేపీ ఒకప్పటి బీజేపీ కాదు నిజమే… కానీ తెలంగాణలో జనసేన బలం ఎంత..? తన ప్రభావం ఎంత..? ఎందుకీ దేవులాట..?)
కాకపోతే గుడ్డిలో మెల్ల అన్నట్టుగా బాబు, పవన్ కూటమితో కలిసి వెళ్తే వోకే… వాళ్లు తాత్కాలికులు… కానీ బీఆర్ఎస్తో అవగాహనకో, రహస్య పొత్తుకో రాకుండా ఈ పవన్, బాబు కూటమితో దోస్తీ ఉపయోగపడితే బెటర్… ఒకసారి బీఆర్ఎస్ ఫోల్డ్లోకి వెళ్తే ఇక ఏళ్లపాటు బీజేపీకి సొంత ఎదుగుదల ఉండదు, సొంత ప్రభుత్వం అనేదీ కలే అవుతుంది…
ఇంకాస్త వివరంగా చెప్పాలంటే… ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో గ్రూపులు, అంతర్గత కొట్లాటలు ఎక్కువ… పంచాయతీ ఎన్నికల్లో ఇంకా బెటర్ రిజల్ట్ రావల్సి ఉండింది… కానీ నాయకత్వలేమి నష్టపరిచింది… జుబ్లీహిల్స్ ఉపఎన్నిక వైఫల్యం, అక్కడ పనిచేయకుండా బీఆర్ఎస్ గెలుపు కోసం తటస్థంగా మారిపోవడంతో చాలా నష్టం జరిగింది…
సిటీలో ఆ వోటమి నిజంగా తలవంపులే… అంతేకాదు, బీజేపీ- బీఆర్ఎస్ రహస్య దోస్తీ గానీ, స్ట్రెయిట్ దోస్తీ గానీ తెలంగాణ జనం ఏమాత్రం మెచ్చరనడానికి జుబ్లీహిల్స్ ఫలితమే ఉదాహరణ… రాష్ట్రంలో సొంతంగా ఎదగాలనే టెంపర్మెంట్ చూపిస్తున్నది ముఖ్య నేతల్లో బండి సంజయ్ ఒక్కడే కావచ్చు బహుశా…

ఇప్పుడు మున్సిపోల్స్ అంటే పక్కా అర్బన్ వోటింగ్… సరిగ్గా సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు ఉంటాయి… ఉదాహరణకు, కరీంనగర్లో 66 డివిజన్లకు ఏకంగా 369 మంది బీజేపీ నేతలు పోటీపడ్డారు… అది గెలుపు పట్ల కాన్ఫిడెన్స్… నిజామాబాద్, ఇతర కొన్ని ఉత్తర తెలంగాణ మున్సిపాలిటీల్లో అవకాశాలున్నాయి…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే అంటున్నాడు… ‘‘బీఆర్ఎస్ సోదిలో కూడా లేదు… కాంగ్రెస్కు మంచి ఎడ్జ్ ఉంది, కొన్నిచోట్ల బీజేపీ ప్రభావం ఉందని మా సర్వేలు చెబుతున్నాయి’’ అని… తన భావన ఏమిటంటే..? పంచాయతీ ఎన్నికల్లోలాగే బీఆర్ఎస్ మున్సిపోల్స్లో చతికిలపడితే… ఇక మా ప్రత్యర్థి బీజేపీయే అని…
ఇది బీజేపీకి కూడా ఆనందమే… కాకపోతే స్థానిక ఎన్నికలు ఎప్పుడూ అధికార పార్టీకి ఎడ్జ్ ఉంటుంది… ఇంకా మూడేళ్లు ఆ మున్సిపాలకులకు రాష్ట్ర ప్రభుత్వ సహాయసహకారాలు అవసరం… ఎమ్మెల్యేలు, ఎంపీల వోట్లు కూడా ఉపకరిస్తాయి… స్వతంత్రంగా గెలిచినవాళ్లు కూడా అధికార పార్టీ వైపే మొగ్గుజూపిస్తారు సహజంగా…
సరే... కాస్తోకూస్తో బీజేపీ మంచి రిజల్ట్స్ సాధిస్తే, అది రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీకి ఓ బూస్టప్... బీఆర్ఎస్కు గనుక సరైన ఫలితాలు రాకపోతే అది మరింత డీలా... మొన్నటి ఇండియాటుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే చెప్పిందీ అదే... బీఆర్ఎస్ పుంజుకోవడం లేదు అని..!!

Share this Article