.
ఏదో సెర్చుతుంటే సౌందర్య సినిమా అమ్మోరు వివరాలు కనిపించాయి… ఆమెను జనంలోకి బాగా తీసుకుపోయిన సినిమా అది… ఇప్పుడంటే శ్యాంప్రసాద్రెడ్డి టేస్టు మరీ జబర్దస్త్ స్థాయికి దిగజారింది గానీ ఒక అమ్మోరు, ఒక అరుంధతి రేంజ్ తనది ఒకప్పుడు… తను అనుకున్నట్టు ఔట్ పుట్ రాకపోతే ఎంత ఖర్చుకైనా, ఎంత రిస్క్కైనా సిద్ధపడేవాడు… అలాంటి ధోరణి ఇండస్ట్రీలో మరీ అరుదు…
శ్యాంప్రసాద్ రెడ్డి దాదాపు మూడున్నరేళ్ల పాటు ఈ ప్రాజెక్ట్పై శ్రమించాడు… ఈ సినిమా నిర్మాణానికి ముందు ఆయన తలంబ్రాలును 18 రోజుల్లో, ఆహుతిని 27 రోజుల్లో, అంకుశంను 110 రోజుల్లో పూర్తి చేశాడు. పర్ఫెక్ట్ ప్లానింగ్ – ఎగ్జిక్యూషన్… కానీ అమ్మోరు చిత్రం 400 రోజులకు పైగా షూటింగ్ జరుపుకుంది. దీనికి ప్రధాన కారణం చిత్రాన్ని రెండుసార్లు, ఇద్దరు దర్శకులతో రూపొందించడమే…
Ads
పల్నాటి సింహం చిత్రానికి కో-డైరెక్టర్గా పనిచేసిన వై. రామారావును దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు మొదట్లో… తూర్పుగోదావరి జిల్లాలోని ముక్తేశ్వరం తాలూకా, అయినవిల్లి గ్రామంలో, తరువాతహైదరాబాద్లో 70 రోజుల పాటు జరిగిన షూటింగ్ తర్వాత… ఒక జాతర, ఆ జాతరలో పాట మినహా మిగతా చిత్రం పూర్తయింది.,..
సురేష్, సౌందర్య ముఖ్య జంటగా, చిన్నా విలన్గా, నాగమణి లేడీ విలన్గా నటించారు. ఆ తర్వాత స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం శ్యాంప్రసాద్ రెడ్డి లండన్ వెళ్లాడు. స్పెషల్ ఎఫెక్ట్స్ పని పూర్తయిన తర్వాత రషెస్ చూసుకున్న శ్యాంప్రసాద్ రెడ్డికి సంతృప్తి కలగలేదు. తాను అనుకున్న విధంగా సినిమా రాలేదనిపించింది. దాంతో, అప్పటి వరకు తీసినదంతా పక్కన పెట్టేసి, మళ్లీ మొదటి నుంచి అమ్మోరు సినిమా షూటింగ్ను తిరిగి ప్రారంభించాడు. అంటే ఖర్చు రెట్టింపు…
అందరి కాల్షీట్లు, మళ్లీ ప్లానింగ్, మరో సినిమా తీసినట్టే… ఐనా రెడీ అన్నాడు… ఈసారి ప్రధాన మార్పు దర్శకుడి విషయంలో జరిగింది. వై. రామారావు స్థానంలో కోడి రామకృష్ణ వచ్చాడు. అలాగే చిన్నా ప్లేస్లోకి రామిరెడ్డి విలన్గా వచ్చాడు, ఈసారి లండన్ నుంచి క్రిస్ స్టాన్లీ హోమ్స్ను పిలిపించారు, ఆయన హైదరాబాద్ వచ్చి ఏడాదిపాటు శ్యాంప్రసాద్ రెడ్డి ఇంట్లోనే ఉండి గ్రాఫిక్స్ డిజైన్ చేశాడు. వృథా పోలేదు…
1995 లో విడుదలైన అమ్మోరు ప్రేక్షకులకే కాదు, బాక్సాఫీస్కు కూడా పూనకం తెప్పించింది. హిందీ, తమిళ్, మలయాళ, ఒరియా, బెంగాలీ, భోజ్ పూరి వంటి అనేక భాషల్లోకి అనువాదమై ఘన విజయాన్ని సాధించి, ప్రజాదరణ పొందింది… అమ్మోరు తెలుగు సినిమాల్లో గ్రాఫిక్స్ జర్నీకి బీజం వేసింది…
కాకపోతే ఇదే శ్యాంప్రసాద్ రెడ్డి అంజి సినిమా విషయంలో చేతులు కాల్చుకున్నాడు… ఆ కథ వేరు… సౌందర్య మూడో సినిమాగా మొదలైన ఈ సినిమా చివరకు 27 వ సినిమాగా రిలీజైంది… అంటే ఆ గ్యాపులోనే సౌందర్య ఎన్ని సినిమాలు చేసేసిందో అర్థం చేసుకోవచ్చు… కానీ అమ్మోరుతో ఆమె ఇమేజ్ బాగా పెరిగిపోయింది… ప్రత్యేకించి మహిళా ప్రేక్షకుల్లో!
ఆమె నిర్మాతలకు ఎంత సహకరిస్తుందీ అంటే… 180 రోజులు పనిచేసింది… మొదట్లో అంగీకరించిన 40 వేల రూపాయలే తీసుకుంది తప్ప అదనంగా డిమాండ్ చేయలేదు, సతాయించలేదు… ఒక్కసారి ఇప్పటి తారలతో పోల్చండి… శ్యాంప్రసాద్ రెడ్డికీ ఆ కృతజ్ఞత ఉంది… అందుకే సినిమాను మరణించిన సౌందర్య తండ్రి సత్యనారాయణకు అంకితం ఇచ్చాడు… అమ్మోరిగా రమ్యకృష్ణకూ ఈ సినిమా ఓ డిఫరెంట్ ఇమేజ్ ఇచ్చింది..!!
Share this Article