.
26/11 ముంబై దాడుల వెనుక ‘నిశ్శబ్ద’ బతుకు పోరాటం… కంగన సినిమాలో కనిపిస్తున్న ఆ రియల్ లైఫ్ నర్స్ ఎవరు?
ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్కు చాన్నాళ్లుగా సరైన హిట్ సినిమా లేదు… థాకడ్ వంటి సినిమాలైతే మరీ దారుణమైన డిజాస్టర్… ఎమర్జెన్సీ సినిమాతో కాస్త గాడినపడతానని అనుకుంది, కానీ అదీ వమ్మయింది… ఈసారి ఓ తనకు నచ్చిన ఓ రియల్ స్టోరీతో, ఓ పవర్ఫుల్ పాత్రతో ముందుకు రావాలని నిర్ణయించుకుంది ఈ బీజేపీ ఎంపీ…
Ads
ఈ సినిమా పేరు భారత్ భాగ్య విధాత… అందులో 26/11 ముంబై ఉగ్రదాడుల సమయంలో ధైర్యంగా నిలబడి, కొందరిని ప్రమాదం నుంచి కాపాడిన ఓ సాహసి నర్స్ పాత్రను ఆమె పరిచయం చేయబోతోంది… ఆ నర్స్ పేరు అంజలి కుల్తే… ఎవరీమె…?
2008, నవంబర్ 26 రాత్రి… ముంబై నగరం రక్తసిక్తమవుతున్న వేళ, ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, అబూ ఇస్మాయిల్ ఆయుధాలతో ముంబైలోని ‘కామా అండ్ ఆల్ బ్లెస్’ ఆసుపత్రిలోకి చొరబడ్డారు… ఆ సమయంలో అక్కడ స్టాఫ్ నర్సుగా డ్యూటీలో ఉన్నది అంజలి కుల్తే… ఆమె ముందు ఉన్నది సాధారణ రోగులు కాదు… దాదాపు 20 మంది గర్భిణులు…

ఆ రాత్రి జరిగిన వీరోచిత పోరాటం: బయట తుపాకుల మోత వినిపిస్తోంది… ఉగ్రవాదులు ఆసుపత్రి గార్డులను కాల్చి చంపుతూ వార్డుల వైపు వస్తున్నారు… ఆ గందరగోళంలో అంజలి కుల్తే ఏమాత్రం భయపడలేదు…
-
క్షణాల్లో నిర్ణయం…: వార్డు తలుపులకు గడియ పెట్టి, లైట్లు ఆర్పేసి, గర్భిణులందరినీ ఒక చిన్న ప్యాంట్రీ గదిలోకి తరలించింది…
-
నిశ్శబ్దమే రక్షణ…: గర్భిణులు భయంతో కేకలు వేయకుండా, నిశ్శబ్దంగా ఉండేలా వారిని ఓదార్చుతూ ధైర్యం చెప్పింది… మీరు సైలెంటుగా ఉండండి, నేనున్నా, అందరినీ కాపాడతా అని అభయం ఇచ్చింది… బయట ఉగ్రవాదులు వార్డు తలుపులపై గ్రెనేడ్లు విసిరినా, కాల్పులు జరిపినా ఆమె తన స్థానాన్ని, ధైర్యాన్ని వీడలేదు…
-
కసబ్ కళ్లలోకి చూసి..: దాడుల అనంతరం, ఆర్థర్ రోడ్ జైలులో జరిగిన ఐడెంటిఫికేషన్ పరేడ్ సమయంలో, కసబ్ తన వంకర నవ్వుతో ఆమెను భయపెట్టాలని చూసినా, అంజలి కుల్తే ఏమాత్రం చలించకుండా మేజిస్ట్రేట్ ముందు అతడిని వేలెత్తి చూపించింది… వీడే వాడు అని చెప్పింది…
-
ఐక్యరాజ్యసమితి (UNSC) వేదికపై కూడా ఉగ్రవాద బాధితుల తరపున తన గళాన్ని వినిపించి భారత్ గర్వించేలా చేసింది…

సినిమా ఏం చెప్పబోతోంది? దర్శకుడు మనోజ్ తపాడియా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కేవలం ఉగ్రదాడుల గురించి మాత్రమే కాదు, ఆ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి పోరాడిన సామాన్య ఉద్యోగుల (నర్సులు, సెక్యూరిటీ గార్డులు) అసామాన్య గాథ…
“ప్రపంచం హీరోలను వెతుకుతుంది, కానీ ఆ రాత్రి ఆసుపత్రి కారిడార్లలో ఒక సామాన్య నర్సు రూపంలో దేవతగా నడిచింది కొందరిని కాపాడుతూ…! వాళ్ల కడుపుల్లోని పసిప్రాణాలను కూడా…”

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా, అంజలి కుల్తే వంటి ఎందరో అన్-సంగ్ షీరోలు, హీరోల త్యాగాలను వెండితెరపై ఆవిష్కరించనుంది… ఈమధ్య విపరీతంగా ట్రెండయిన మరాఠీ నటి గిరిజా ఓక్ కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నదట… “అంజలి కుల్తే వంటి వ్యక్తుల సమయస్పూర్తి, సాహసం, త్యాగాలు మరుగున పడిపోకూడదు” అనే ఉద్దేశంతోనే ఈ కథను ఎంచుకున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది…
ముచ్చట విశ్లేషణ: అంజలి కుల్తే కథను ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాలి?
సాధారణంగా ముంబై దాడులంటే మనకు హోటల్ తాజ్, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లేదా హేమంత్ కర్కరే వంటి పోలీస్ ఆఫీసర్ల పోరాటాలే గుర్తొస్తాయి. కానీ…
-
సామాన్యుల సాహసం…: ఎటువంటి ఆయుధం చేతిలో లేని ఒక సామాన్య నర్సు, భయంతో పారిపోకుండా… తుపాకులు పట్టుకున్న ఉగ్రవాదుల కళ్లెదుట నిలబడి, 20 ప్రాణాలను కాపాడటం అనేది ఉన్నత స్థాయి మానవత్వానికి నిదర్శనం… సాహసానికి కూడా…
-
లీగల్ ఫైట్…: దాడి జరిగినప్పుడు ప్రాణాలు కాపాడటమే కాదు, ఆ తర్వాత కసబ్కు శిక్ష పడే వరకు కోర్టు మెట్లు ఎక్కి సాక్ష్యం చెప్పడం ఆమె నైతిక ధైర్యానికి ప్రతీక…
-
సినిమాటిక్ టచ్…: కంగనా రనౌత్ తన నటనతో అంజలి కుల్తే పడ్డ మానసిక వేదనను (Trauma), ఆమె చూపిన తెగింపును వెండితెరపై ఆవిష్కరిస్తే, అది ఈ కాలపు మహిళలకు ఒక పెద్ద ఇన్సిపిరేషన్ అవుతుంది….
Share this Article