.
జగన్- భారతి ‘స్కెచ్’కు విజయమ్మ బ్రేకులు..? ఆస్తి వివాదంలో సంచలన మలుపు!….. ఇదీ నిన్నటి నుంచీ ఏపీ పాలిటిక్స్లో, ప్రత్యేకించి వైసీపీ సర్కిళ్లలో బాగా చర్చనీయాంశమవుతున్న వార్త… టీడీపీ క్యాంపుకి ఆనందం కలిగించే ఆ ప్రచారాల సారాంశం ఓసారి చూద్దాం…
వైఎస్సార్ కుటుంబంలో గత కొంతకాలంగా రగులుతున్న ఆస్తుల సెగ ఇప్పుడు ‘క్లైమాక్స్’ సీన్కు చేరుకుంది… ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న రాజమాత వైఎస్ విజయమ్మ… తన కుమారుడు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వేస్తున్న ఎత్తుగడలను చిత్తు చేస్తూ నేరుగా రంగంలోకి దిగింది… NCLAT (నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్) చెన్నై బెంచ్కు విజయమ్మ సమర్పించిన కౌంటర్ అఫిడవిట్ ఇప్పుడు రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది…
Ads
విజయమ్మ స్ట్రెయిట్ అటాక్… విజయమ్మ తన నివేదికలో కుమారుడు జగన్, కోడలు భారతి తీరును నిశితంగా విమర్శించింది… ప్రధానంగా ‘సరస్వతి పవర్’ వాటాల విషయంలో జగన్ దంపతులు ప్రదర్శిస్తున్న ద్వంద్వ వైఖరిని ఆమె ఎండగట్టింది…
2019 ఒప్పందం ప్రకారం ఈ వాటాలన్నీ షర్మిలకు చెందాల్సి ఉండగా, సాంకేతిక కారణాల దృష్ట్యా వాటిని తొలుత విజయమ్మ పేరుకు బదిలీ చేసేందుకు జగన్ అంగీకరించాడు… అయితే, ఇప్పుడు ఈడీ (ED) జప్తును సాకుగా చూపి ఆ బదిలీని అడ్డుకోవాలని చూడటం వెనుక పెద్ద ‘కుట్ర’ దాగి ఉందని విజయమ్మ కుండబద్ధలు కొడుతోంది…
జగన్కు విజయమ్మ సూటి ప్రశ్నలు … ఈ వివాదంలో జగన్ వాదనలోని డొల్లతనాన్ని విజయమ్మ కొన్ని సూటి ప్రశ్నలతో ప్రశ్నించింది… సండూర్, క్లాసిక్ రియాల్టీ కంపెనీల్లోని వాటాల బదలాయింపును ప్రశ్నించని జగన్, కేవలం సరస్వతి పవర్ విషయంలోనే ఈడీ జప్తును ఎందుకు తెరపైకి తెస్తున్నాడు… వాటా సర్టిఫికెట్లు, బదిలీ పత్రాలను స్వయంగా అందజేసిన తర్వాత, ఇప్పుడు మాట తప్పడం ‘మడమ తిప్పడం’ కాదా అని ఆమె ప్రశ్న…
బినామీని కాదు.. స్వతంత్రురాలిని! తనపై వస్తున్న ఆరోపణలకు విజయమ్మ ఘాటుగానే సమాధానమిచ్చింది… “నేను ఎవరికీ బినామీని కాదు.. షర్మిల ప్రతినిధిని అంతకంటే కాదు. నా నిర్ణయాలు నేను స్వతంత్రంగా తీసుకుంటున్నాను” అని స్పష్టం చేసింది… క్లాసిక్ రియాల్టీలో తాను తగిన ప్రతిఫలం చెల్లించే వాటాలు కొనుగోలు చేశానని, ఆ ఒప్పందాలను ఎవరూ కాదనలేరని ఆమె తేల్చి చెబుతోంది.. జగన్కు తనపై ఉన్న ప్రేమను తాను గౌరవిస్తానని చెప్తూనే, చట్టపరంగా తనకున్న హక్కులను మాత్రం వదులుకోబోనని స్పష్టమైన సంకేతాలిస్తోంది…
(AI ఫోటో)…
షర్మిల ఆవేదన.. రాజకీయ రంగుపై విమర్శలు … మరోవైపు వైఎస్ షర్మిల కూడా తన కౌంటర్లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది… తండ్రి వైఎస్సార్ ఆశయాలను, కుటుంబ సభ్యుల మధ్య జరిగిన అంతర్గత అవగాహనను జగన్ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించింది… కేవలం రాజకీయ కక్షలు తీర్చుకోవడానికే తన పేరును ఈ వివాదంలోకి లాగి, ఊహాజనిత ఆరోపణలతో ఇబ్బంది పెడుతున్నారని ఆమె పేర్కొంటోంది…
ఏప్రిల్ 29న ఏం జరగబోతోంది? విజయమ్మ, షర్మిల దాఖలు చేసిన ఈ కౌంటర్లు జగన్ వాదనలకు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు… గిఫ్ట్ డీడ్లు, వాటా కొనుగోలు ఒప్పందాలు అన్నీ చట్టబద్ధమేనని, ఇందులో జగన్ పాత్ర ఎప్పుడో ముగిసిపోయిందని విజయమ్మ వాదిస్తున్నది… ఈ నేపథ్యంలో, ఏప్రిల్ 29న జరగబోయే విచారణలో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది… వైఎస్సార్ వారసత్వ పోరులో ఇదొక కీలక మలుపు కానుంది…
Share this Article