.
కేరళ ‘ఎర్ర’కోటలో మునుపెన్నడూ లేని బీటలు: పినరయి ‘కెప్టెన్’ ఇమేజ్ మునిగిపోతోందా?
క్రమశిక్షణకు మారుపేరు, పార్టీ ఆదేశమే వేదవాక్కుగా భావించే కేరళ సీపీఐ(ఎం)లో ఇప్పుడు మునుపెన్నడూ లేని అశాంతి నెలకొంది. ఒకప్పుడు వి.ఎస్. అచ్యుతానందన్ వంటి హేమాహేమీ నేతలపైనే ‘రెనిగేడ్’ ముద్ర వేసిన కఠిన క్రమశిక్షణ అని పేరు తెచ్చుకున్న పార్టీకి, ఇప్పుడు సొంత క్యాడర్, సీనియర్ నేతల తిరుగుబాటు తలనొప్పిగా మారింది… ముఖ్యమంత్రి పినరయి విజయన్ ‘క్లాస్ ద్రోహులు’ అని హెచ్చరించినా సరే, నేతలు వెనక్కి తగ్గకపోవడం కేరళ లెఫ్ట్ పాలిటిక్స్లో వస్తున్న పెను మార్పులకు సంకేతం…
Ads
లెఫ్ట్ కూడా ఇతర పార్టీల్లాగే మారిపోయిన తీరు స్పష్టంగా కనిపిస్తోంది… ప్రత్యేకించి సీఎం కుటుంబ ఆపేక్ష, వ్యవహర శైలి, అవినీతి- అక్రమాల మరకలు… ఇక లెఫ్ట్ ఏవిధంగా భిన్నం..? వివరాల్లోకి వెళ్తే…
80 ఏళ్ల పినరయికి ఒక నీతి.. ఇతరులకు మరో నీతి?
ప్రస్తుతం కేరళ సీపీఎంలో ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ ‘వయస్సు- పదవీకాలం’... కొత్త తరం నాయకత్వాన్ని (Generational Change) ప్రోత్సహించాలనే సాకుతో ‘రెండు సార్లు గెలిచిన వారికి టికెట్ లేదు’ (Two-term rule) అనే నిబంధనను ఈసారి పార్టీ కఠినంగా అమలు చేసింది… దీనివల్ల జి. సుధాకరన్ (అంబలపుజ), పి.కె. శశి (ఒట్టపాలం) వంటి దిగ్గజాలను పక్కన పెట్టారు…
అయితే, అసలు వివాదం ఇక్కడే మొదలైంది:…
-
వయస్సు నిబంధన ఎక్కడ?…: 80 ఏళ్లు దాటిన పినరయి విజయన్ మాత్రం తన సొంత నియోజకవర్గమైన ధర్మడం నుండి మళ్ళీ పోటీ చేస్తున్నాడు…
-
ద్వంద్వ ప్రమాణాలు…: “ఇతరులకు వర్తించే రిటైర్మెంట్ రూల్ పినరయికి ఎందుకు వర్తించదు?” అన్నది ఇప్పుడు పార్టీలో సామాన్య కార్యకర్తను సైతం వేధిస్తున్న ప్రశ్న… తనను ప్రశ్నించే గొంతులను ‘జనరేషన్ గ్యాప్’ పేరుతో తొలగించి, తన ఏకఛత్రాధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికే ఈ ఎత్తుగడ వేస్తున్నారనే విమర్శ బలంగా ఉంది…
కుటుంబ వివాదాలు.. స్కామ్ల నీడ … గత ఎన్నికల్లో ‘కెప్టెన్’గా కీర్తించబడిన పినరయి ఇమేజ్ ఇప్పుడు పలు వివాదాల్లో చిక్కుకుంది:
-
వారసత్వ రాజకీయాలు…: తన అల్లుడు మహమ్మద్ రియాస్కు మంత్రివర్గంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం, కుమార్తె వీణ విజయన్ ఐటీ కంపెనీ లావాదేవీలపై వస్తున్న ఆర్థిక ఆరోపణలు ‘కేడర్ బేస్డ్’ పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి…
-
స్మగ్లింగ్ మరకలు…: గల్ఫ్ నుండి ప్రొటోకాల్ బాక్సుల్లో బంగారం స్మగ్లింగ్, శబరిమలై గోల్డ్ స్కామ్ వంటి అంశాలు ఓటర్లలో ప్రభుత్వంపై విముఖత పెంచాయి… కమ్యూనిస్ట్ పార్టీలో ఎన్నడూ లేని విధంగా “ముఖ్యమంత్రి కుటుంబం” చుట్టూ వివాదాలు తిరగడం ఇదే మొదటిసారి…
సర్వేల అంకెల్లో ప్రతికూల పవనాలు … తాజా ‘పోల్ మంత్రా’, ‘స్పిక్ మీడియా’ సర్వేల ప్రకారం, ఈసారి కేరళలో యూడీఎఫ్ (UDF) వైపు ఓటర్లు మొగ్గు చూపుతున్నారు…
| కూటమి | ఓట్ల శాతం | గెలిచేవి |
| UDF | 38.2% | 71 – 78 |
| LDF | 33.7% | 58 – 64 |
| NDA | 20.4% | 03 – 06 |
2021తో పోలిస్తే ఎల్డీఎఫ్ ఓట్ల శాతం సర్వేలలో దాదాపు 11% పడిపోవడం గమనార్హం… గత స్థానిక సంస్థల ఎన్నికల్లో 6 మున్సిపల్ కార్పొరేషన్లకు గానూ యూడీఎఫ్ 4 చోట్ల జెండా ఎగురవేసి ‘సెమీ ఫైనల్’ విజయాన్ని ముందే చాటింది… (స్థానిక ఎన్నికల్లో విజయాలు అసెంబ్లీ విజయం వైపు తీసుకెళ్తాయి కేరళలో…)
బీజేపీ ఓటు: ఎవరి కొంప ముంచుతుంది? కేరళలో ఈసారి ప్రధాన మలుపు బీజేపీ ఓటు శాతం… ఎన్డీయే ఓటు శాతం 20% మార్కును తాకడం ఇక్కడ అత్యంత కీలకం…
-
విశ్లేషణ…: బీజేపీ సాధించే ప్రతి ఓటు హిందూ ఓట్ల బ్యాంకు నుండి వస్తుంది… ఇది సంప్రదాయబద్ధంగా ఎల్డీఎఫ్కు బలమైన మద్దతుగా ఉండే ఓట్ల శాతం… బీజేపీ పెరిగితే ఆ మేరకు ఎల్డీఎఫ్ ఓట్లు తగ్గి, అది పరోక్షంగా యూడీఎఫ్కు (కాంగ్రెస్ కూటమి) మేలు చేస్తుంది…
-
మరోవైపు, బీజేపీని అడ్డుకోవడానికి మైనారిటీ ఓట్లు (ముస్లిం, క్రైస్తవ) ఈసారి ఏకీకృతంగా యూడీఎఫ్ వైపు మళ్లడం పినరయి విజయన్కు గట్టి దెబ్బ…
చరిత్ర పునరావృతమవుతుందా? కేరళలో ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వం మారుతుందనే సంప్రదాయాన్ని 2021లో విజయన్ బ్రేక్ చేశాడు… కానీ, ఇప్పుడు ‘క్లాస్ ద్రోహులు’ అని సొంత నేతలపైనే యుద్ధం ప్రకటించే స్థాయికి పరిస్థితి చేరింది… సాధారణ రాజకీయ పార్టీలలాగే లెఫ్ట్లో కూడా పదవీ వ్యామోహం, వారసత్వ రాజకీయాలు ప్రవేశించాయని ప్రజలు భావిస్తున్నారు…
ప్రభుత్వ వ్యతిరేకత (Anti-incumbency), సొంత పార్టీలో మునుపెన్నడూ లేని తిరుగుబాటు, దూసుకొస్తున్న బీజేపీ… ఈ మూడు సవాళ్లను దాటుకుని ‘కెప్టెన్’ తన ఎర్రకోటను కాపాడుకోగలడా..? లేదా కేరళ ఓటరు మళ్ళీ తన మార్పు సంప్రదాయాన్ని పాటిస్తాడా…? దేశంలో చివరి ఎర్రకోట కూలుతుందా..? అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది…
Share this Article