.
రాయల్ ఛాలెంజర్ ఐపీఎల్ జట్టును కనీవినీ ఎరుగని రీతిలో బిర్లా వ్యాపార కూటమి కొనుగోలు చేసిందనే వార్త నిజానికి పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు… ఐపీఎల్ అంటేనే ఓ కార్పొరేట్ దందా… బ్రాండ్ వాల్యూ… యాడ్ రెవెన్యూ… ఫ్రాంచైజీ మార్కెట్… ఇవే అసలు ఆటను నడిపించే అంశాలు…
16,705 కోట్లకు ఆర్సీబీ జట్టును బిర్లా కన్సార్షియం కొన్నదనేది ఓ వార్త… నిజానికి ఇది మొదట్లో విజయ్ మాల్యా ఏర్పాటు చేసిన జట్టు… తరువాత మాల్యా మునిగిపోయాక యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ నుంచి ఈ జట్టు ఓనర్షిప్ Diageo (UK కంపెనీ) చేతుల్లోకి వెళ్లింది…
Ads
దీన్ని ఇప్పుడు ఆదిత్య బిర్లా గ్రూపు, Satyan Gajwani- TOI Group, Blackstone – (World’s biggest private equity firm), American sports investor David Blitzer కన్సార్షియం కొనుగోలు చేసింది… 2008లో ఆర్సీబీ విలువ 446 కోట్లు… ఇప్పుడు 16,705 కోట్లు… గత సీజన్ విజేత కావడంతో దాని విలువ బాగా పెరిగింది, సహజం కూడా…
కానీ ఆర్సీబీకే సంబంధించిన మరో వార్త దగ్గర చూపులు నిలిచిపోయాయి… బెంగుళూరు, చిన్నస్వామి స్టేడియం సాక్షిగా గతేడాది జూన్ 4న జరిగిన ఆ విషాదం ఇంకా కళ్లముందే కదలాడుతోంది… 11 మంది అమాయక అభిమానుల ప్రాణాలు గాల్లో కలిసిన ఆ తొక్కిసలాట ఘటనకు సంబంధించి బాధ్యులను శిక్షిస్తామని కర్నాటక ప్రభుత్వం ఏదేదో చెప్పింది… అన్నీ సద్దుమణిగాయి…

నిన్న ఆర్సీబీ సీఈవో ఎక్కడో మాట్లాడుతూ కొన్ని అంశాలు చెప్పాడు… 1. తొక్కిసలాట మృతుల సంస్మరణకు ప్రతి మ్యాచులోనూ 11 సీట్లు ఖాళీగా ఉంచుతారట… పైకి వినడానికి, చదవడానికి ఎమోషనల్ అనిపించినా… లోతుగా ఆలోచిస్తే అబ్సర్డ్ అనిపిస్తుంది… కాస్మెటిక్ సింపథీ… పదే పదే ఆ ఖాళీలు కనిపించి, ఆ పాత తొక్కిసలాటను గుర్తుచేసి మళ్లీ మళ్లీ కలిచివేయడానికా..? మరణించిన ఆ అభిమానుల ఆత్మల కోసమా ఆ ఖాళీ సీట్లు..?
2. అసలు చిన్నస్వామి స్టేడియం ఆర్సీబీ సొంత స్టేడియం కాదు… ఇది కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) ఆధీనంలో ఉంటుంది… ఆర్సీబీ కేవలం ఐపీఎల్ సమయంలో అద్దెకు తీసుకునే ఒక ఫ్రాంచైజీ మాత్రమే… అలాంటప్పుడు, అన్ని దేశీయ, అంతర్జాతీయ మ్యాచ్ల్లో కూడా 11 సీట్లను ఖాళీగా ఉంచుతామని ఆర్సీబీ సీఈఓ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉంది…
3. తొక్కిసలాట జరిగింది స్టేడియం బయట… అది ముమ్మాటికీ పోలీసుల క్రౌడ్ మేనేజ్మెంట్ వైఫల్యం… నిర్లక్ష్యంతో, సరైన భద్రత చర్యలు లేకుండా భారీ విజయోత్సవాలకు పూనుకున్న ఆర్సీబీ యాజమాన్యం తప్పు… ఈ వైఫల్యానికి బాధ్యులైన వారిని శిక్షించకుండా, కేవలం 11 సీట్లు ఖాళీగా ఉంచడం అనేది ఒక రకమైన ‘కార్పొరేట్ గిల్ట్ ట్రిప్పింగ్’... అంటే, వ్యవస్థాగత లోపాలను సరిదిద్దకుండా, కేవలం ప్రజల్లో ఒక భావోద్వేగాన్ని నింపి తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నంగా ఇది కనిపిస్తోంది… బాధితులకు, ప్రేక్షకులకు కావాల్సింది న్యాయం, భద్రత, కేవలం ఖాళీ సీట్లు కాదు…
4. ప్రాక్టీస్ సమయంలో ప్లేయర్స్ అందరూ 11 నంబర్ జెర్సీలు ధరిస్తారని, నల్లని ఆర్మ్బ్యాండ్లు కట్టుకుంటారని యాజమాన్యం చెబుతోంది… అసలు ప్రాక్టీస్ సెషన్లను ఎవరు చూస్తారు..? స్టేడియం నిండా జనం లేని సమయంలో ఈ ప్రదర్శన ఎవరి కోసం..? ఇదంతా కేవలం సోషల్ మీడియాలో ఫోటోల కోసం చేసే ‘పీఆర్ స్టంట్లు’ (PR Stunts) లాగా ఉంది…
5. తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారాలు ఏమిచ్చారో ఎవరూ చెప్పరు… గాయపడినవారిని ఎలా ఆదుకున్నారో చెప్పరు… హైదరాబాద్లో సంధ్య థియేటర్ తొక్కిసలాట, తమిళనాడులో టీవీకే తొక్కిసలాట అన్నీ అంతే, నాలుగు రోజులు మీడియా కన్నీళ్లు… గగ్గోలు…
ఆ చేదు జ్ఞాపకాన్ని పదే పదే గుర్తు చేసేలా సీట్లు ఖాళీగా ఉంచడం వల్ల బాధితుల కుటుంబాలకు అది ఓదార్పునిస్తుందా లేక వారి గాయాన్ని ఇంకా రేపుతుందా…? సెంటిమెంట్ పేరుతో సమస్యను పక్కదారి పట్టించడం ఆపి, జవాబుదారీతనం (Accountability) పెంచినప్పుడే ఆ 11 మంది ఆత్మలకు నిజమైన శాంతి కలుగుతుంది… దురదృష్టవశాత్తూ కార్పొరేట్ క్రికెట్ దందాలో అదే ఎవరూ పట్టించుకోరు..!!
Share this Article