.
John Kora …. సంపదను సృష్టించడం అంటే ఇదీ. షేన్ వార్న్ గుర్తున్నాడా? మెలికలు తిరిగే బంతులతో హేమాహేమీ బ్యాటర్లను సైతం గజగజ వణికించిన లెజండరీ స్పిన్నర్. అత్యంత అనుమానాస్పద స్థితిలో థాయ్లాండ్లో మరణించాడు.
అప్పుడు అతని క్యారెక్టర్పై ఎన్నో రకాల కథనాలు మీడియాలో పుంఖాను పుంఖాలుగా వచ్చాయి. సరే, అతని వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నా.. 2008లో అతను తీసుకున్న ఒక తెలివైన నిర్ణయం.. ఇప్పుడు ఆ కుటుంబానికి అతి పెద్ద భరోసాను ఇచ్చింది.
Ads
2008లో ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు రాజస్థాన్ రాయల్స్ జట్టు షేన్ వార్న్ను కొనుగోలు చేసింది. దాదాపు రూ.9 కోట్లకు పైగానే వెచ్చించి కొనుగోలు చేసి.. రాయల్స్ పగ్గాలు అతనికే అప్పగించింది. ఆస్ట్రేలియా తరపున ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడని వార్న్కు రాయల్స్ కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది.

కానీ తొలి సీజన్లోనే రాయల్స్.. ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఇప్పటికి 18 ఏళ్లు గడిచినా రాజస్థాన్ మరో కప్పు కొట్టలేదు. సరే, అది పక్కకు పెడితే..
2008లో రాయల్స్ తరపున బరిలోకి దిగిన షేన్ వార్న్ తనకు శాలరీ బదులు ప్రతీ సీజన్కు 0.75% ఈక్విటీ అడిగాడు. అందుకు అప్పటి యజమానులు ఓకే చెప్పారు. రాజస్థాన్ రాయల్స్ తరపున 4 సీజన్లు ఆడటంతో ఆ జట్టులో షేన్ వార్న్కు 3% వాటా లభించింది.
వార్న్ చనిపోయే వరకు ఆ ఈక్విటీని అసలు అమ్మలేదు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ను వాల్మార్ట్, ఫోర్డ్ కన్సార్టియం సుమారు రూ.15 వేల కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. దీంతో షేన్ వార్న్ వాటాగా సుమారు రూ.450 కోట్లు వచ్చాయి. ఇప్పుడు ఆ సంపదంతా వార్న్ కుటుంబానికే చెందుతుంది.
వార్న్ ముందు చూపు ఇప్పుడు ఆ కుటుంబానికి పెద్ద భరోసాగా నిలిచింది. ఐపీఎల్లో కేవలం నాలుగు సీజన్లు ఆడి రూ.450 తీసుకున్నాడంటే మాటలా. ఒక్కో సీజన్కు 112 కోట్లకు పైగానే ముట్టినట్లు. ఇది కదా సంపద సృష్టించడం అంటే. ఏమంటారు తమ్ముళ్లూ. #భాయ్జాన్

ఇక్కడే మరో విశేషాన్ని చెప్పుకోవాలి… ఇదీ ఐపీఎల్ బాపతే… ఇతని పేరు ఆర్యమాన్ బిర్లా. మధ్యప్రదేశ్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. ఒకప్పుడు రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇతడిని రూ.30 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది. కానీ పెద్దగా రాణించలేకపోయాడు. మానసిక ఒత్తిడి కారణంగా క్రికెట్ వదిలేశారు.
కట్ చేస్తే..
ఆర్యామాన్ బిర్లా ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కో-ఓనర్. తాజాగా ఆర్సీబీని ఆదిత్య బిర్లా గ్రూప్ కన్సార్టియం రూ.16,660 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఈ సీజన్ తర్వాత ఆర్సీబీ బిర్లాల చేతిలోకి వెళ్తుంది. కుమార మంగళం బిర్లా కొడుకైన ఆర్యమాన్ బిర్లా.. ఆర్సీబీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఒకప్పుడు ప్లేయర్.. ఇప్పుడు ఏకంగా ఓనర్ అయ్యాడు….. షేన్ వార్న్కు పూర్తిగా విరుద్దంగా ఉంది కదా..
Share this Article