.
మనం పప్పూయాదవ్ అనే ఓ రోతగాడి గురించి చెప్పుకున్నాం కదా… మహిళ రాజకీయ నాయకుల గురించి తన వ్యాఖ్యానాల గురించి… వాడి నేరగాథ గురించీ చదివాం కదా… వీడి లైఫ్లో ఓ ఇంట్రస్టింగ్ స్టోరీ ఉంది… అది తన లవ్ స్టోరీ.,. వన్ సైడ్ లవ్వే… చివరకు దాన్నెలా సాధించాడు, ఇప్పుడెందుకు దూరంగా ఉంటున్నారు..? ఇదీ కథ…
1990… అప్పటికే పప్పూ క్రైమ్ ట్రాక్ స్టార్టయింది… ఒక కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో, పక్కనే ఉన్న గ్రౌండ్లో ఆడుకునేవాళ్లు… అక్కడ ఓ సిక్కు యువకుడితో పరిచయం ఏర్పడింది… ఒక స్పోర్ట్స్ మ్యాగజైన్ తిరగేస్తుండగా ఆయన కళ్లు రంజీత్ రంజన్ ఫోటోపై పడ్డాయి… అప్పట్లో ఆమె సిక్కు కుటుంబానికి చెందిన వర్ధమాన టెన్నిస్ క్రీడాకారిణి… ఆ ఒక్క ఫోటో చూడగానే “ఈమెనే నా భార్య కావాలి” అని పప్పు యాదవ్ ఫిక్స్ అయిపోయారు… ఆ సిక్కు యువకుడు ఆమె నా సోదరి అని చెప్పాడు…
Ads
జైలు నుండి పెరోల్పై బయటకు రాగానే, తను నేరుగా పాట్నా క్లబ్కు వెళ్లడం మొదలుపెట్టాడు… రంజీత్ అక్కడ టెన్నిస్ ప్రాక్టీస్ చేసేది… ఒక పక్క గన్మెన్లు, మరోపక్క భారీ కాన్వాయ్ ఉన్నప్పటికీ, ఆమెను ఆకర్షించడానికి పప్పు యాదవ్ సైకిల్ తొక్కుతూ ఆమె వెనకాల వెళ్లేవాడట… కానీ, రంజీత్ మాత్రం తన వైపు కనీసం కన్నెత్తి కూడా చూసేది కాదు…
రంజీత్ తనను అస్సలు పట్టించుకోవడం లేదని పప్పు యాదవ్కు అర్థమైంది… తన ప్రేమను నిరూపించుకోవడానికి ఒకరోజు ఆమె ఇంటి ముందే భారీగా నిద్రమాత్రలు మింగేసి ఆత్మహత్యాయత్నం చేశాడు… వెంటనే ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది… ఈ సంఘటనతో రంజీత్ కుటుంబం ఒక్కసారిగా ఉలిక్కిపడింది… ఆ మొండి పట్టుదల చూసి రంజీత్ మనసు కూడా నెమ్మదిగా కరిగింది…
వీరి పెళ్లికి రంజీత్ తండ్రి (ఆర్మీ అధికారి) మొదట ససేమిరా అన్నాడు… వారిద్దరి మతాలు వేరైనవే కాకుండా, రంజిత్ తండ్రి ఒక గురుద్వారాకు ప్రధాన పూజారిగా కూడా ఉండేవాడు… ఒక హిందూ కుటుంబంలో తన కూతురు ఎలా ఇమిడిపోతుందోనని అతని తల్లి కూడా ఆందోళన చెందింది… పైగా పప్పూ క్రైమ్ రికార్డు వాళ్లను భయపెట్టింది…
ఇక వేరే దారిలో నరుక్కొచ్చాడు పప్పూ… రాజ్యసభ ఎంపీ ఎస్.ఎస్. అహ్లువాలియాను కలవడానికి ఢిల్లీ వెళ్ళాడు… అహ్లువాలియా కూడా సిక్కు మతస్థుడే, రంజిత్ కుటుంబంలో ఆయనకు గొప్ప గౌరవం ఉండేది… చివరకు అతని పట్టుదల మేరకు, రంజిత్ తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించారు… కానీ సిక్కు మతంలోకి రావాలీ అన్నారు, వస్తానన్నాడు… పాట్నా కాదు, ఢిల్లీలో మకాం పెట్టాలి అన్నారు, ఒప్పుకున్నాడు…
నిజానికి ఇక్కడ మరో ట్రాక్… పప్పుకు లాలూ ప్రసాద్ యాదవ్తో చాలా సన్నిహిత సంబంధం ఉండేది… అతను తరచుగా లాలూ ఇంటికి వెళ్లి, ఆయన కుటుంబాన్ని కలిసేవాడు… ఈ సమావేశాల సమయంలోనే పప్పు, లాలూ పెద్ద కుమార్తె మీసా భారతిని చూసి ప్రేమలో పడ్డాడు… అతను నేరుగా లాలూ యాదవ్ను మీసాను పెళ్లి చేసుకోవడానికి అనుమతి కోరాడు… ఠాట్, కుదరదు అనేసిన లాలూ వెంటనే ఆమెకు వేరే సంబంధం చూసి పెళ్లిచేసేశాడు…
తరువాతే ఈ రంజిత్ ప్రేమకథ… 1994లో జరిగిన వీరి వివాహం ఒక ఉత్సవం… సుమారు 2 లక్షల మందికి పైగా అతిథులు వచ్చారు… అప్పట్లో పూర్ణియా విమానాశ్రయం వివిఐపిల హెలికాప్టర్లతో నిండిపోయింది… రంజీత్ కుటుంబం అమృత్సర్ నుండి చార్టర్డ్ విమానంలో రాగా, ఆ పైలట్ దారి తప్పడంతో పెళ్లి సమయంలో కొంత ఉత్కంఠ నెలకొంది…
ఓ కొడుకు, క్రికెట్ ప్లేయర్… ఓ బిడ్డ, చదువుకుంటోంది… ఆమె కూడా రాజకీయాల్లోకి వచ్చింది, ఓ దశలో ఇద్దరూ లోకసభకు ఎన్నికయ్యారు… తన క్రైమ్ ట్రాక్ కూడా ఎదుగుతోంది… సీన్ కట్ చేస్తే… రెండేళ్లుగా తాము విడిగా ఉంటున్నామనీ, కలిసి ఉండటం లేదనీ రంజీత్ రంజన్ ప్రకటించింది… ఎందుకు… లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పప్పూను టార్గెట్ చేసింది… (మరి మేం విడిగా ఉంటున్నామని ప్రకటించడం వెనుక ఆమె ఆలోచన ఏమిటో స్పష్టంగా తెలియదు గానీ…)
అసలు ఆ గ్యాంగుతో వైరం ఏమిటి..? ముంబైలో బాబా సిద్ధిక్ హత్య తర్వాత పప్పు యాదవ్ చేసిన వ్యాఖ్యల వల్ల లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆయన్ని టార్గెట్ చేసింది… బాబా సిద్ధిక్ హత్య తర్వాత, పప్పు యాదవ్ లారెన్స్ బిష్ణోయ్ను “రెండు పైసల నేరస్థుడు” (two-bit criminal) అని సంబోధించాడు… వెక్కిరించాడు… ప్రభుత్వం అనుమతిస్తే కేవలం 24 గంటల్లో ఈ ముఠా నెట్వర్క్ను అంతం చేస్తానని సోషల్ మీడియాలో సవాలు విసిరాడు…
బిష్ణోయ్ గ్యాంగ్ నుండి బెదిరింపులు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు పప్పు యాదవ్ బహిరంగంగా మద్దతు తెలిపాడు… “నేను ఉన్నాను” (మే హూనా) అంటూ భరోసా ఇచ్చాడు… దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్యాంగ్ సభ్యులు, సల్మాన్ ఖాన్ విషయంలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు… బెదిరింపులు స్టార్టయ్యాయి…
తన ప్రాణానికి ముప్పు ఉందని భావించిన పప్పు యాదవ్, తనకు ‘Z’ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశాడు… కొన్ని పోలీసు విచారణల్లో ఆయన సన్నిహితుడే ఒకరు సెక్యూరిటీ పెంచుకోవడం కోసం ఇలా బెదిరింపు డ్రామా ఆడించారని కూడా వార్తలు వచ్చాయి… ఇందులో భాగంగానే భార్యాభర్తలు విడిగా ఉంటున్నామనే ప్రకటనలు అట..!
Share this Article