.
ఈ తెలంగాణ జనానికి కనీస కృతజ్ఞత లేదు… కేటీయార్కు అస్సలు లేదు… 2034 వరకు నేనే సీఎం అన్నాడు రేవంత్ రెడ్డి… సరే, తనకు విజయ్ వ్యక్తిగత జ్యోతిష్కుడు రాధన్ పండిట్ వంటి ఆస్ట్రాలజర్ లేడు, వేణుస్వామి అసలే లేడు… కనీసం శృంగేరీ స్పాన్సర్డ్ ఆయుత చండీ యాగాలు చేయడు, అదేదే విశాఖ శారదా పీఠం స్వామి రుషీకేష్ పూజలు కూడా చేయించడు… కనీసం రాజశ్యామల, చండీ హోమాలు కూడా తెలియదు తనకు…
కానీ మరో ఐదేళ్లూ నేనే నేనే అన్నాడు… గుడ్, సంకల్పానికి దరిద్రం ఉండొద్దు, గుడ్… కనీసం 2034 తరువాతనైనా మాకు చాన్స్ వస్తుంది అని హరీష్ సంబురం లేదు, కేటీయార్ సంతోషం అసలే లేదు… సరే, కిషన్ రెడ్డి ఎట్సెట్రా నేతల్ని కాసేపు పక్కన పెట్టండి…
Ads
అంతర్గతంగా కాంగ్రెస్లో సీనియర్ల మాటేమిటి మరి..? బీసీ సీఎం అనే నినాదం ఏం కావాలి..? కాచుక్కూర్చున్న మరో ఇద్దరుముగ్గురు మహాగ్ర వర్ణ నేతల మాటేమిటి..? ఏదీ, అస్సలు మీడియాలో డిబేటే లేదు… అంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని నవ్వుకుని లైట్ తీసుకుంటోందా మీడియా..? అఫ్కోర్స్, తెలుగు మీడియా ఇంకా కేసీయార్ ప్రభావంలో ఉందనేది నిజమే కానీ… మరీ కనీస విశ్లేషణలు కూడా లేవు…
చివరకు ఏదో ఒకటి చెబుతూ తెర మీదకు వచ్చే ఎర్ర నాగేశ్వర్ కూడా మాట్లాడటం లేదు, ఎంత దురన్యాయం..? విచిత్రం ఏమిటంటే..? తెల్లారిలేస్తే ఏదో ఒకటి వాగే బీఆర్ఎస్ పెయిడ్ మీడియా కూడా పెద్దగా పట్టించుకోలేదు… ప్చ్, రేవంత్ రెడ్డికే అవమానం పాపం…
51 ఏళ్ల విజయ్ మరో 50 ఏళ్లు పాలిస్తాడని అంటున్నాడు జ్యోతిష్కుడు రాధన్ పండిట్… అంటే 101 ఏళ్ల దాకా… అంటే మరణించేదాకా… గ్లోబల్ సమస్యల్ని పరిష్కరిస్తున్నా సరే తమిళనాడు వీడడు అంటున్నాడు… మరి 56 ఏళ్ల రేవంత్ ఓన్లీ 2034 వరకేనా..? తరువాత తెలంగాణ వదిలేస్తానంటున్నాడు… తెలంగాణకు అవమానం కాదా..? అన్యాయం కాదా… సో, మంచి రాధన్ పండిట్ వంటి జ్యోతిష్కుడు ఇప్పుడు అత్యవసరం రేవంత్ రెడ్డికి… తనకేమో అర్థం కాదు…
ఎంతసేపూ నా రాహుల్, నా సోనియా, నా ప్రియాంక… వీరవిధేయత అంటాడు… ప్చ్, మోడీ స్వయంగా రావయ్యా, కలిసి నడుద్దాం అన్నా సరే… అబ్బే, నా గురువు, నా దైవం, నా నాయకుడు గతంలో చంద్రబాబు, ఇప్పుడు రాహుల్ గాంధీ అంటాడు గానీ… సర్లెండి సర్, టైమ్ వచ్చినప్పుడు చూద్దాంలే అన్నాడా..? అదీ లేదు…
మోడీ నిజానికి ఒక హిమంత విశ్వ శర్మకు, ఒక సువేందు అధికారికి కూడాా ఇంత ఓపెన్ ఆఫర్ ఇవ్వలేదు.,. పెద్దాయన మన మంచి కోరి ఏదో చెబుతున్నాడు అనీ ఆలోచించకపోతే ఎలా నాయకా..? పేరుకు సీఎం, కొన్ని శాఖల్లో వేలు పెట్టే వీలు లేదు… సీనియర్లలో ముగ్గురు నలుగురు ముఖ్యమంత్రులు… మరెప్పుడు కొరడా ఝళిపించడం..!
ఇదుగో ఇన్ని ఉన్నాయి, నిన్న ఏదో షార్ట్ న్యూస్ సర్వీస్ నిర్వహించిన కాంక్లేవ్లో రేవంత్ రెడ్డి వెల్లడించిన ‘2034 వరకూ నేనే’ అనే వ్యాఖ్యకు సమీకరణాలు…!!
Share this Article