.
Prasen Bellamkonda …. నా జీవితంలో పెద్ది… పెద్ది కొంచెం పెద్దగా ఉంది. ల్యాగ్ ఎక్కువైంది. కానీ నావైన కొన్ని కారణాలుండడం చేత కొంత డిస్కవుంట్ ఇవ్వాలనిపించింది. ఆట కూలీ అనే మాట విన్నపుడు మాత్రం కోహ్లీలు రోహిత్ ల్లాంటి ఐపిఎల్ వేలం సరుకులు ఎలా చిన్నబుచ్చుకుంటారోనని బెంగట్టుకుంది.
డివిలియర్స్, పంత్, స్కై, ముగ్గురూ మూకుమ్మడిగా కలిసి కొట్టినట్టున్న ఆ స్విచ్ షాట్ ను వైభవ్ సూర్యవంశీ ఎక్కడ ట్రై చేస్తాడో అని భయమేసింది.
పోనీలే బాలయ్య తొడకొడితే రైలు వెనక్కెళ్లడం చూసినవాళ్ళం.
ఆ గేమ్ చేంజర్ ఆట ఎడాపెడా మార్వడాన్ని చూడలేమా అని కూడా అనిపించింది.
Ads
చిరంజీవి నాగలితో హెలికాప్టర్ ను పడగొడితే కేరింతలు పెట్టినవాళ్ళం
వందమందిని పంపు షేర్ ఖాన్ అనికాక కేవలం ఇద్దరు వస్తాదులను కుమ్మేస్తే సహించలేమా అనిపించింది.
గోచి పాత లగాన్లు ఇంగ్లిష్ క్రికెటర్లను ఓడించడం భరించినవాళ్ళం
కాలు నరికేసుకున్న వాళ్ళను
దివ్యాంగ పోటీలలో అనుమతించరని తెలిసినా
చరణ్ 400 మీటర్ల గెలుపును
అంగీకరించలేమా అనిపించింది.
ఏ పెద్ద హీరో సినిమాలోనైనా హీరోయిన్ అంటే నాభి ప్లస్ నాభి పై భాగమే కదా, శ్రీదేవి కూతురైతే మాత్రం ఏం మినహాయింపా, జానేదేవ్ అనిపించింది.
జగపతి బాబుతో సహా చాలా మంది ఇతర భాషా పెద్ద నటులను ప్రేక్షకులు రవ్వంతైనా పోల్చుకోకుండా
చేసిన మేకప్ మాన్ ఘనతను కూడా క్షమించేద్దాంలే అనిపించింది.
చివరాఖరికి పర్లేదు సాన పెడితే రాం చరణ్ కూడా నటించగలడు అనిపించింది.
ఈ డిస్కవుంట్ అంతా ఎందుకంటే నా రిపోర్టింగ్ జీవితంలోనూ ఒక పెద్ది ఉన్నందువల్ల.
పదిహేనేళ్ల క్రితం ఒక రోజు మావోయిస్టు స్టోరీ చేసుకుని ఒరిస్సా సరిహద్దు నుంచి భద్రాచలం వస్తూ నేనూ మా భద్రాచలం విలేకరి సైదాబాబు మధ్యలో ఓ 250 గుడిసెలు ఉన్న ఊర్లో ఆగాం. అది ఊరు కాదని తరవాత తెలిసింది.
టీ తాగే క్రమంలో ఆ ఊర్లో 800 మంది ఉన్నారనీ, వాళ్లకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు లాంటివేవీ లేవన్న సమాచారం తెలిసింది. కారణం కనుక్కుంటే వాళ్ళంతా పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి పనులు చేసుకుంటూ పొట్టపోసుకునే వాళ్ళు. అక్కడ గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. అసలు ఆ 250 గుడిసెలు ఉన్న ప్రాంతానికి ఒక పేరు కూడా లేదు. కరంట్ లేదు. ప్రభుత్వం కల్పించే ఏ సౌకర్యమూ లేదు.
మరుసటి రోజు ఆ 800 మంది మీద tv 5 కు ఒక కథనం చేసాం. చాలా బాగా ప్లే అయింది. చాలాసార్లు కూడా ప్లే అయింది. కొంత వేచి చూసాం. ఎవ్వరిలోనూ చలనం లేదు. నేను కలెక్టర్ తో మాట్లాడాను. మాట్లాడడమే కాదు. పోట్లాడాను. సైదా బాబు rdo తో drda పీడీ తో మాట్లాడాడు.
అందరిదీ ఒకే వాదన. వాళ్ళు ఇక్కడి వాళ్ళు కాదు. వస్తూ వుంటారు. పోతూ ఉంటారు. కనుక గుర్తింపు ఇవ్వడం కుదరదు అని.
Off the record అందరూ అనేదేంటంటే వాళ్ళు మావోలకు సపోర్ట్ చేస్తారు అని.
అయినా మేం వదిలిపెట్టలేదు. వాళ్ళు కూలీలే అని నిరూపించే కథనాలు చేసాం. మావోయిస్టులతో వాళ్లకు సంబంధాలు లేవని రుజువు చేసే కథనాలు చేసాం. మా కథనాలు చూసి ‘ వార్త ‘ కూడా ఫాలో అయింది. వార్త విలేకరి ఆనంద్ నా దగ్గర నుంచే సమాచారం తీసుకుని వరుస కథనాలు రాసాడు. తనకూ అధికారులతో అనుబంధం ఉండడం వల్ల తనూ పోరాడాడు. Tv 5 దాదాపుగా వెంటాడింది. కలెక్టర్ ఒక దశలో ‘ప్రసేన్ చోడ్ దేవ్ నా’ అని కూడా అన్నాడు. మొత్తం మీద అధికారులను కదిలించాం.
రికార్డులలో రిఫరెన్స్ కోసం ఆ ప్రాంతానికి జానకీ రామచంద్రాపురం అని పేరు పెట్టారు. పేరు ఖరారు చేయాలంటే చాలా రెవెన్యూ తతంగం ఉంటుంది. తాత్కాలికంగా పేరు పెట్టి, రేషన్ కార్డులు ,ఆధార్ కార్డులు ఇచ్చారు. కరంట్ లైన్ వచ్చింది. ఆ తరవాత పేరు మార్చినట్టున్నారు.
మేం దాన్ని tv 5 విజయంగానే గర్వపడ్డాం.
నాకు అప్పటి కలెక్టర్ తో చనువుండడం సైదా బాబు drda పీడీకి దగ్గరగా ఉండడం వల్ల మాకు వాళ్ళతో కొట్లాట సాధ్యమైంది.
నిజానికి ఆ ప్రాసస్ అంతా యమ యాతన. ఒక దశలో వదిలేద్దాం అని కూడా చేతులెత్తేసాం. కానీ ఎందుకో మనసొప్పలేదు. ఆ స్టోరీ మీద తిరిగినన్ని రోజులు వాళ్ళతో అనుబంధం ఏర్పడింది.
అందుకే పెద్దికి డిస్కవుంట్.
పెద్ది గురించి ఎవరో మాట్లాడుతూ 1800 ఓట్లు ఉన్నాయంటే, mla ఎగేసుకుని వచ్చి అన్ని పనులు చేస్తాడు, ఇంత సినిమా అనవసరం అన్నారు. అది తప్పు. మేం స్వయంగా అప్పటి ఎమ్మెల్యేని రంగంలోకి దింపుదాం అని చూసినా అటునుంచి చలనం లేకుండే. ఇక్కడ లాజిక్ ఏంటంటే అవతలి పార్టీకి కూడా పడవు కనుక ఆ ఓట్ల పట్ల నాయకులకు బెంగ ఉండదు.
ఓటు హక్కు ఇప్పిస్తే మనకు మాత్రమే వేస్తారనే గ్యారెంటీ లేదు. అసలు వాళ్లకు ఓటే లేకపోతే నాయకుడు సేఫ్. 1800 అయినా 800 అయినా అంతే.
ఇంకో అనుబంధం ఏంటంటే ఇంద్రాణి నలుగురు చెల్లెళ్ళ పిల్లలందరూ నన్ను గత ముప్పయి ఏళ్లుగా పెద్దీ అని పిలుస్తున్నారు. వాళ్లకు నేను పెదనాన్నను కదా. ఈ సినిమా టైటిల్ అనవున్స్ చేసినపుడు మా నవ్య నాకు ఫోన్ చేసీ పెద్దీ నీ మీద సినిమా తీస్తున్నారు అంటే నాకు వెంటనే అర్ధం కాలేదు.
ఇదో చిన్న ఫీల్.
అంచేత కాబట్టి కనుక నాకైతే పెద్ది పర్లేదనిపించింది.
అచ్చంగా వ్యక్తిగతం సుమా…
Share this Article