.
గ్లోబరీనా! ఇది పాతపేరు… అనేక అక్రమాల నేపథ్యంలో పేరు మార్చుకుంది… కోఎంప్ట్ ఎడ్యుటెక్ కొత్త పేరు… దాంతో లింక్స్ పెట్టుకున్నవాళ్లెవరూ బాగుపడలేదు… 1) తెలుగు రాష్ట్రాలు 2) కేంద్ర ప్రభుత్వం… ఏం సంస్థరా నాయనా..?
2019లో 20+ ఇంటర్మీడియెట్ పిల్లల మరణాలకు కారణమైన ఈ సంస్థను కేటీయార్ వెనకేసుకొచ్చాడని రాజకీయ విమర్శలు… నో, నోె, అది తన బినామీయేనని ఈరోజుకూ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తుంటాడు… ఠాట్, దానికీ నాకూ ఏం లింక్ అని ఖండిస్తాడు కేటీయార్…
Ads
కానీ… ఉసురు మాత్రం తగిలింది… ఈ ఒక్కటే ప్రధాన కారణం కాకపోవచ్చు, కానీ పిల్లల మరణాలూ బీఆర్ఎస్కు శాపమే… బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది… అది కూడా గ్లోబరీనాను విధిలేక తప్పించి, ఇంటర్ పరీక్షపత్రాల మూల్యాంకనం వంటి పనుల్ని సీజీజీకి అప్పగించినా సరే ఫలితం లేకుండా పోయింది… జేఎన్టీయూలు కూడా గ్లోబరీనాను తిరస్కరించాయి…
సరే, ఈరోజుకూ ఆ గ్లోబరీనా నీడ కేటీయార్ను వెంటాడుతూనే ఉంది… ఆ కథను వదిలేస్తే… అది పేరు మార్చుకుని ఢిల్లీలో తేలింది… పాత బ్లండర్స్, ఫెయిల్యూర్స్ కప్పబడిపోయాయి… ఏకంగా కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దగ్గర చేరింది… అవును, నిన్న రాజీనామా చేసిన సదరు మంత్రి గారే…
పాపం, ఒకప్పుడు ఏబీవీపీ నేతగా, ఏ లీకేజీల మీద పోరాడి నాయకుడయ్యాడో, అవే లీకేజీల బాగోతానికి పొలిటికల్ బాధ్యుడిగా తప్పుకోవాల్సి రావడం డెస్టినీయే… కానీ సదరు కోఎంప్ట్ ఎడ్యుటెక్ను దగ్గరకు రానివ్వకుండా ఉండాల్సింది… ఈ సంస్థ నిర్వాకం, సీబీఎస్ఈ మూల్యాంకనాల వైఫల్యాలను ప్రభుత్వమే అంగీకరించింది…
నీట్ అక్రమాలకూ ఈ సంస్థకూ సంబంధం లేకపోవచ్చుగాక… కానీ ధర్మేంద్ర ప్రధాన్ పని తీరును పట్టిచూపే ఉదాహరణ… చివరకు తనే బలయ్యాడు… అప్పట్లో చాలా ఆరోపణలొచ్చాయి… ధర్మేంద్ర ప్రధాన్ ఆ సంస్థను ఎంకరేజ్ చేయడం వెనుక ఏవో ఆర్థిక మతలబులున్నాయని! జైరాం రమేష్, రాహుల్ గాంధీ తదితరులు కూడా ఏవో ఆరోపణలు చేశారు…
ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తె అమెరికాలో చదువు… ఆయన భార్యకు సంబంధించిన Vikas Foundation Trust కు అమెరికాలో ఆస్తులు ఎట్సెట్రా… నేనిక్కడ వాటిని ఎండార్స్ చేయడం లేదు, పైగా అవి నిరూపణకు నిలబడలేదు… కానీ అప్పుడే మంత్రి మీద మచ్చ పడింది…
సరే, అవి రాజకీయ విమర్శలే అనుకుందాం… అక్రమాల నిర్ధారణ ఏమీ లేదనే అనుకుందాం… కానీ మచ్చ పడినప్పుడు మోదీ సదరు మంత్రిని వేరే శాఖకు తప్పించి ఉండాల్సింది… ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ధర్మేంద్ర ప్రధాన్ వైఫల్యాల మీద కోపం, అసంతృప్తి పెరుగుతూ ఉంటే, మోదీ వెనకేసుకొచ్చాడు తప్ప… సరైన టైమ్లో సరైన యాక్షన్ తీసుకోలేకపోయాడు…
నిజానికి బొద్దింకల్ని మరింత రెచ్చగొట్టి, మరింత పట్టుదలగా జంతర్ మంతర్లో తిష్ట వేయించిన కారణం ఇదే… ఒక్కసారి ధర్మేంద్ర ప్రధాన్ను తప్పించిన వెంటనే అంతా సద్దుమణిగింది… ఇక్కడ ఫెయిల్యూర్ తనను సకాలంలో తప్పించలేని మోదీదే!!
పోనీలే… ఝలక్ మంచిదే… ఇజ్జత్ పోయినా సరే, ఓసారి ఆత్మసమీక్షకు ఓ పాఠంలా పనికొస్తుంది… దిద్దుబాటుకు ఉపయోగపడుతుంది, దారి చూపిస్తుంది… అవునూ, మోదీ భాయ్, నితిన్ గడ్కరీ ఇథనాల్ 20 తాలూకు వివాదం మరో మంట పెట్టే ప్రమాదం ఉన్నట్టు ఏమైనా అనిపిస్తోందా… ఆర్ఎస్ఎస్ ప్రాయోజిత గడ్కరీ జోలికి వెళ్లగలవా..?!
Share this Article