.
చిరంజీవి సినిమా… ఓరాత్రి కమెడియన్ వేణుమాధవ్తోపాటు తను మందుకొడుతుంటాడు… ఈ తాగుడు ఆరోగ్యానికి చాలా హానికరం, భయంకరమైన అలవాటు, అస్సలు ఎంకరేజ్ చేయకూడదు, మరీ చిన్నపిల్లలు, లేడీస్ కూడా కొట్టేస్తున్నారు… తాగితే చంపేస్తామని రూల్ పెట్టడమే పరిష్కారం… ఇలా వాళ్ల సంభాషణ సాగుతూ ఉంటుంది… అదొక ఫన్ సీన్… కానీ..?
కాకతాళీయం… రాత్రి రీల్స్లో ఇది కనిపించింది… పొద్దున్నే ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ రాసిన కొత్త పలుకులో ఈ మీడియాకు ఏమైంది అనే ప్రశ్న, ఆవేదన చదువుతుంటే ఆ రీల్ గుర్తొచ్చింది… నిన్న ఆ ఫన్ సీన్ చూస్తుంటే కొద్దిగా నవ్వొచ్చింది… రాధాకృష్ణ బాధ చదువుతుంటే ఇంకా ఎక్కువ నవ్వొచ్చింది… ప్చ్, ఈ మీడియా ఎప్పుడు బాగుపడుతుందో ఏమిటో…
Ads
తన వ్యాసంలో రాధాకృష్ణ ఎలా బాధపడ్డాడంటే… ‘‘ఈ మీడియాకు ఏమైంది..? జాతీయ మీడియా అని మనం పిలుచుకొనే హిందీ– ఇంగ్లిషు వార్తా చానళ్ల ప్రతినిధులను జంతర్ మంతర్ వద్ద ఆందోళనకారులు ఎద్దేవా చేశారు. ‘గోదీ మీడియా గో బ్యాక్’ అని నినాదాలు చేశారు. మీడియాపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు అనడానికి ఇదొక సంకేతం. ఈ విషయంలో ప్రధాన బాధ్యత మీడియాదే…
ప్రభుత్వాలకు భయపడి సమస్యలను ప్రధాన మీడియా తొక్కి పెడుతోంది అన్న భావన ఇప్పుడు ప్రజల్లో విస్తృతంగా ఉంది. కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన మీడియా తన స్వతంత్రతను కోల్పోయిందన్న భావన ప్రజల్లో ఏర్పడింది. ప్రముఖ మీడియా సంస్థలు అదానీ, అంబానీల చేతుల్లోకి వెళ్లిపోవడం కూడా ఇందుకు ఒక కారణం..’’
భయమో, ఒత్తిళ్లో, రాగద్వేషాలో, విధేయతో… కారణాలు ఎన్ని చెప్పుకున్నా సరే… స్వతంత్రంగా పనిచేసే నిష్పాక్షిక మీడియా ఏదైనా ఉందా దేశంలో? ఉండగలదా? మనగలదా? ఈ ప్రశ్నకు రాధాకృష్ణకే కాదు, మీడియా వ్యవహారాలు తెలిసిన ప్రతి ఒక్కరికీ సమాధానం తెలుసు… ఐనా ఏవో బుకాయింపులు, కవరింగులు, నలుపును దాచుకునే ప్రయత్నాలే నవ్వు తెప్పించేవి…

ఎక్కడిదాకో దేనికి? తెలుగు మీడియా సంగతే తీసుకుందాం… నిష్పాక్షికత జీరో కదా… సాక్షి, నమస్తే ఆయా పార్టీల సొంతం కదా… పేరుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా న్యూస్, ఏబీఎన్, ఈటీవీ ఎట్సెట్రా మొత్తం తెలుగుదేశం సొంత చానెళ్లుగా పేరు తెచ్చుకున్న పక్షపాత మీడియాయే కదా… అదేదో జనసేన భజన చానెల్ కూడా ఉన్నట్టు గుర్తు… మిగతా పెద్ద సంస్థలు కార్పొరేట్ కంపెనీలే కదా… ఎవరో ఒకరి పాదసేవ చేస్తున్నవే కదా…
మరిక నిష్పాక్షికతను, స్వతంత్రతను ఎలా ఆశించేది… పార్టీలు కోట్లకుకోట్ల సాయం చేస్తున్నా సరే, కొన్ని సంస్థలు నెల తిరిగేసరికల్లా జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్నాయి… అది రియాలిటీ… కొన్ని మాత్రం విపరీతమైన నెట్వర్త్ పెంచుకుంటున్నాయి… ఆంధ్రజ్యోతి కొత్త భవనం ప్రారంభమయ్యాక అదీ చెప్పుకుందాం…

కాషాయ చొక్కాలు వేసుకున్న జర్నలిస్టులు, మీడియా ఓనర్ల గురించి చెప్పుకునే ముందు మన పచ్చ, గులాబీ చొక్కాల వైపూ ఓసారి చూసుకోవాలి కదా… ఆత్మవిమర్శ, సమీక్ష, మథనం పేరేదైనా గానీ, ముందు మన ఇంటి నుంచే ప్రారంభం కావాలి కదా… ఈరోజు జంతర్ మంతర్ కావచ్చు… రేపు మన ధర్నా చౌక్ కావచ్చు… ఫీల్డ్ రిపోర్టర్, కెమెరామెన్ భయంభయంగా కవర్ చేసే రోజులు వస్తే, అది ఖచ్చితంగా మీడియా ఓనర్ల తప్పే… నిజమే, రాధాకృష్ణ అన్నట్టుగా మీడియా ఆత్మసమీక్ష అవసరం… అది ఆంధ్రజ్యోతి నుంచే ప్రారంభం కావడం అత్యవసరం!!
Share this Article