.
ముందుగా ఓ వార్త చదవండి… ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు రాయడమే కదా ప్రజెంట్ జర్నలిజం… ‘‘కామాఖ్య ఆలయం అంబుబాచి మహాయోగ్కు సర్వం సిద్ధమైంది. శక్తి ఆరాధన, స్త్రీత్వ మహిమ, తాంత్రిక సంప్రదాయాల మహాసంగమంగా అసోం పండుగ మారనుంది.
ప్రసిద్ధ శక్తి పీఠమైన కామాఖ్య దేవాలయంలో జరిగే వార్షిక అంబుబాచి మహాయోగ్ ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ ప్రధాన పూజారి హిమాద్రి శర్మ వెల్లడించారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు, సాధువులు, తాంత్రిక సాధకులు, యాత్రికులు పాల్గొనే ఈ మహోత్సవం సోమవారం రాత్రి ప్రారంభం కానుంది.
Ads
కామాఖ్య ఆలయం ముఖ్యమైన ఉత్సవాల్లో అంబుబాచి మహాయోగ్ ఒకటి. జూన్ 23, 24, 25 తేదీల్లో మూడు రోజుల కాలాన్ని దేవి ‘రజస్వల దశ’గా భావిస్తారు. జూన్ 26 ఉదయం సూర్యోదయ సమయంలో ‘నివృత్తి’ ఆచారంతో ఆలయం తిరిగి తెరవబడుతుంది.
అనంతరం శుద్ది క్రతువులు, నిత్య పూజలు నిర్వహించి భక్తులకు దర్శనాలు కల్పిస్తారు. ఈ సందర్భంగా అత్యంత పవిత్రంగా భావించే ‘రక్త బస్త్ర’ (రక్తవస్త్ర, ఎర్రటి బట్టముక్క) ప్రసాదం భక్తులకు పంపిణీ చేయబడుతుంది….’’
….. ఇదీ వార్త. రజస్వల వేరు- రుతుస్రావం వేరు. చాలా మంది ఈ రెండింటి మధ్య తేడా తెలియక, అలాగే కామాఖ్య ఆలయ సాంప్రదాయాన్ని సరిగ్గా అర్థం చేసుకోక గందరగోళానికి గురవుతుంటారు. ఈ విషయాలను,, ఈ వార్తను మరికాస్త స్పష్టంగా చూస్తే…
1. రజస్వల వేరు.. రుతుస్రావం వేరు ….
-
రజస్వల (Menarche)…: ఒక అమ్మాయి తన జీవితంలో మొదటిసారి రుతుక్రమాన్ని (పీరియడ్) పొందడాన్ని ‘రజస్వల కావడం’ అంటారు. ఇది ఒక అమ్మాయి శారీరకంగా పరిణతి చెంది, స్త్రీత్వంలోకి అడుగుపెట్టడానికి సూచన. ఇది జీవితంలో ఒక్కసారే జరుగుతుంది.
-
రుతుస్రావం (Menstruation / Periods)…: రజస్వల అయినప్పటి నుంచి స్త్రీ శరీరంలో ప్రతి నెల జరిగే సహజమైన జీవక్రియ ఇది. గర్భాశయ పొరలు విడివడి ప్రతి నెలా 3 నుండి 5 రోజుల పాటు జరిగే రక్తస్రావాన్ని రుతుస్రావం లేదా ముట్టు అంటారు.
2. కామాఖ్య దేవి ఆలయ విశిష్టత …
దేవీ భాగవతం, స్థానిక సాంప్రదాయాల ప్రకారం, అస్సాంలోని కామాఖ్య దేవి ఆలయంలో ప్రతి ఏటా జరిగే అంబుబాచి మేళా (Ambubachi Mela) సమయానికి సంబంధించిన ఒక వాస్తవం…
-
దేవి ప్రతి ఏటా రజస్వల కాదు (ఎందుకంటే రజస్వల అనేది జీవితంలో ఒక్కసారే వచ్చేది).
-
ఇక్కడ భూమి సృజనాత్మక శక్తిని, స్త్రీత్వాన్ని పూజిస్తారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో దేవి ఏడాదికి ఒకసారి, మూడు రోజుల పాటు రుతుస్రావంలో (ముట్టులో) ఉంటుందని నమ్ముతారు.
-
ఆ మూడు రోజులు ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తారు. నాలుగో రోజున దేవికి ప్రత్యేక పూజలు, శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు.
మరి ఆ ఆలయ ప్రధాన పూజారి హిమాద్ర శర్మ ఏమన్నాడో, రిపోర్టర్లకు ఏం అర్థం అయ్యిందో, ఏం రాశాడో అంతా గందరగోళం..!!
Share this Article