.
ఇటీవల విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA)కి చెందిన ఒక ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. భారతీయ పాస్పోర్ట్ అనేది కేవలం ఒక “ప్రయాణ పత్రం” (Travel Document) మాత్రమేనని, అది “పౌరసత్వ పత్రం” (Citizenship Document) కాదని ఆయన పేర్కొన్నారు. 14వ పాస్పోర్ట్ సేవా దివస్ సందర్భంగా దేశంలో పాస్పోర్ట్ సేవల విస్తరణపై జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో ప్రజలు, ప్రతిపక్ష నాయకులు ఒకే ప్రశ్న వేస్తున్నారు: “పాస్పోర్ట్ కేవలం ప్రయాణ పత్రం మాత్రమే అయితే, దాని కోసం అంత కఠినమైన తనిఖీలు (Vetting) ఎందుకు? మరి భారతదేశంలో పౌరసత్వానికి అసలైన రుజువు ఏది?”
Ads
ఈ వివాదానికి సంబంధించిన 5 కీలక ప్రశ్నలు
1. విదేశీ పౌరసత్వం పొందిన తర్వాత భారతీయ పాస్పోర్ట్ను ఎందుకు అప్పగించాలి?
భారతదేశ పౌరసత్వ చట్టం, 1955 ప్రకారం మన దేశంలో ద్వంద్వ పౌరసత్వానికి (Dual Citizenship) అవకాశం లేదు. ఒక భారతీయ పౌరుడు స్వచ్ఛందంగా మరొక దేశ పౌరసత్వాన్ని పొందితే, అతని భారత పౌరసత్వం ఆటోమేటిక్గా రద్దవుతుంది. ఆ తర్వాత కూడా భారతీయ పాస్పోర్ట్ను కలిగి ఉండటం లేదా ఉపయోగించడం చట్టవిరుద్ధం.
అయితే, ఇక్కడే ఒక విరుద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. పాస్పోర్ట్ అనేది పౌరసత్వానికి నిశ్చయాత్మకమైన రుజువు కానప్పుడు, దానిని తిరిగి తీసుకోవడానికి ప్రభుత్వం ఎందుకు అంత పట్టుబడుతుంది? అది కేవలం ప్రయాణ పత్రం మాత్రమే అయితే, ప్రభుత్వం దేనిని వెనక్కి తీసుకుంటున్నట్టు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
2. పాస్పోర్ట్ జారీ చేయడానికి ముందు పోలీస్ వెరిఫికేషన్ ఎందుకు చేస్తారు?
దరఖాస్తుదారుడి గుర్తింపు, చిరునామా, నేర చరిత్రను తనిఖీ చేయడానికి పోలీస్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. నకిలీ దరఖాస్తులను అడ్డుకోవడానికి, జాతీయ భద్రతకు ముప్పు కలిగించే వారికి పాస్పోర్ట్లు వెళ్లకుండా చూడటానికి ఇది అవసరమని అధికారులు చెబుతారు.
కానీ, ఇంత కఠినమైన, సుదీర్ఘమైన పోలీస్ తనిఖీల తర్వాత పౌరుడికి దక్కేది కేవలం ఒక “ప్రయాణ పత్రం” మాత్రమేనా అని శివసేన (UBT) నాయకుడు ఆదిత్య థాకరే వంటి నేతలు ప్రశ్నిస్తున్నారు.
3. ప్రభుత్వం భారతీయులు కానివారికి కూడా పాస్పోర్ట్లు జారీ చేస్తుందా?
అవును, అసాధారణ పరిస్థితుల్లో జారీ చేస్తుంది. పాస్పోర్ట్ చట్టం, 1967 లోని సెక్షన్ 20 ప్రకారం… ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అవసరమని భావిస్తే, భారత పౌరుడు కాని వ్యక్తికి కూడా కేంద్ర ప్రభుత్వం పాస్పోర్ట్ లేదా ప్రయాణ పత్రాన్ని జారీ చేయవచ్చు. అయితే ఇటువంటి కేసులు చాలా అరుదుగా ఉంటాయి. అలా పత్రం పొందినంత మాత్రాన వారు భారత పౌరులు అయిపోరు.
దీనిని బట్టి పాస్పోర్ట్ అనేది అంతర్జాతీయ ప్రయాణాలను సులభతరం చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందని, పౌరసత్వాన్ని తేల్చడానికి కాదని స్పష్టమవుతోంది.
4. పాస్పోర్ట్ తన ఆస్తి అని ప్రభుత్వం ఎందుకు చెబుతుంది?
ఆధార్ లేదా పాన్ కార్డ్ లాగా కాకుండా, పాస్పోర్ట్ అనేది ఒక సార్వభౌమ పత్రం (Sovereign Document). పాస్పోర్ట్ చట్టం, 1967 లోని సెక్షన్ 17 ప్రకారం, జారీ చేయబడిన ప్రతి పాస్పోర్ట్ ఎల్లప్పుడూ కేంద్ర ప్రభుత్వ ఆస్తిగానే ఉంటుంది.
పాస్పోర్ట్ అంతర్జాతీయంగా భారత దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి, దానిని రద్దు చేసే లేదా జప్తు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఒకవైపు ఇది కేవలం ప్రయాణ పత్రం అంటూనే, మరోవైపు ఇది ప్రభుత్వ సార్వభౌమ ఆస్తి అని చెప్పడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
5. భారతదేశంలో అసలు పౌరసత్వానికి రుజువు ఏది?
ఇది అందరినీ వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న. భారతదేశంలో అన్ని సందర్భాల్లోనూ పౌరసత్వాన్ని నిరూపించే ఏకైక, విశ్వజనీనమైన (Universal) పత్రం అంటూ ఏదీ లేదు.
భారతదేశంలో పౌరసత్వాన్ని పౌరసత్వ చట్టం, 1955 ప్రకారం పుట్టుక, వంశపారంపర్యం, రిజిస్ట్రేషన్, సహజీకరణ (Naturalisation) ఆధారంగా నిర్ణయిస్తారు. సాధారణంగా నిత్య జీవితంలో ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్, రేషన్ కార్డ్ , పాస్పోర్ట్ల కలయికను పౌరసత్వ ఆధారాలుగా వాడుతుంటారు. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో పౌరసత్వానికి ఒకే ఒక నిర్దిష్ట పత్రం లేకపోవడం గమనార్హం.
మాజీ విదేశాంగ కార్యదర్శి నిరుపమ రావు వివరణ …. “ఒక వ్యక్తి భారత పౌరుడేనని ప్రభుత్వం నిర్ధారించుకున్న తర్వాతే పాస్పోర్ట్ జారీ చేయబడుతుంది. కాబట్టి, సాధారణ జీవితంలో, అంతర్జాతీయ ప్రయాణాల్లో భారతీయ జాతీయతకు పాస్పోర్ట్ అత్యంత నమ్మకమైన, బలమైన ఆధారం. అయితే, పౌరసత్వానికి సంబంధించిన ఏదైనా చట్టపరమైన వివాదం (Legal Dispute) తలెత్తినప్పుడు మాత్రం పౌరసత్వ చట్టమే సర్వోన్నతమైనది. అటువంటప్పుడు పాస్పోర్ట్ అనేది మిగతా అన్ని ఆధారాలను తోసిరాజనే అంతిమ నిశ్చయాత్మక రుజువు కాజాలదు…” ( క్రెడిట్స్ :: ఇండియాటుడే )
Share this Article