.
Mohan Goteti ….. ‘పెదరాయుడు’ సినిమా.. ఓ జ్ఞాపకం! .
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు మంచి స్నేహితులు కదా!
ఒకరోజున మోహన్ బాబు గారికి ఆయన నుంచి ఫోన్ వచ్చింది.. వెంటనే రమ్మనమని.
దాంతో చెన్నై వెళ్లి రజనీని కలిశారు మోహన్ బాబు.
“నాట్టామై అని ఒక సినిమా వచ్చింది. బాగుందంటున్నారు. వెళ్లి చూడు. బాగుంటే రీమేక్ చేయచ్చు” అన్నారు రజనీ.
మోహన్ బాబు ఆ సినిమా చూడడం.. ఆయనకది బాగా నచ్చేయడం జరిగిపోయాయి.
వెంటనే రజనీ వద్దకు వచ్చి, “సినిమా బాగుంది. నేను తెలుగులో రీమేక్ చేస్తాను” అన్నారు మోహన్ బాబు.
“నీకు నచ్చుతుందని నాకు తెలుసు. అందుకే నిర్మాత ఆర్బీ చౌదరి గారికి ఆల్రెడీ చెప్పేశాను. నువ్వెళ్లి అన్నీ ఫైనల్ చేసుకో” అన్నారు రజనీ.
ఈయన వెళ్లగానే ఆర్బీ చౌదరి “రజనీకాంత్ గారు చెప్పారు. ఇక ఆయన చెప్పాక మాట్లాడేదేముంది.. రైట్స్ మీరే తీసుకోండి” అన్నారు ఆర్బీ.
ఒక రేటు మాట్లాడుకుని రైట్స్ తీసేసుకున్నారు మోహన్ బాబు.
అదే ‘పెదరాయుడు’ సినిమా!
Ads
దర్శకుడిగా రవిరాజా పినిశెట్టిని ఫైనల్ చేసుకున్నారు.
పెదరాయుడికి జంటగా భానుప్రియని ఎంపిక చేశారు.
పెదరాయుడి సోదరుడు రాజా (మోహన్ బాబు ద్విపాత్రాభినయం) భార్య భారతి పాత్రకు సౌందర్యను సెలెక్ట్ చేశారు.
ఇక కీలకమైన పెదరాయుడు తండ్రి అయిన పాపారాయుడు పాత్రకే ఎవరిని ఎంచుకోవాలా? అని మల్లగుల్లాలు పడుతున్నారు.
తమిళంలో ఆ పాత్రని ప్రముఖ నటుడు విజయకుమార్ పోషించారు.
ఆ పాత్ర అతిథి పాత్రే అయినా పవర్ ఫుల్ రోల్!
అందుకే, వీరికి ఒక పట్టాన ఎవరూ నచ్చడం లేదు.
మోహన్ బాబు గారు ఇదే విషయాన్ని రజనీకాంత్ కి చెప్పారు.
దాంతో ఆయన పకపకా నవ్వి ..”ఆ క్యారెక్టర్ నేనే చేస్తున్నాను” అన్నారు.
ఆ మాటలకి మోహన్ బాబు షాక్!
“నువ్వేమిటి? గెస్ట్ రోల్ వేయడం ఏమిటి?” అన్నారు మోహన్ బాబు ఏమీ అర్థం కాక.
“ఆ పాత్ర నేను చేయాలని ముందే డిసైడ్ అయ్యాను.. నేను చేస్తున్నానంతే” అనేశారు సింపుల్ గా రజనీ.
గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ కావడంతో, ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా రాజమండ్రి పరిసర ప్రాంతాలలో చేశారు.

ఈ సినిమా సమయంలోనే మరో సంఘటన కూడా జరిగింది.
ఒకరోజు రజనీకాంత్ హోటల్ రూంలో మిత్రుడు మోహన్ బాబుకి ఓ పెద్ద కవర్ ఇచ్చారు.
విప్పి చూస్తే అందులో నలభై ఐదు లక్షలు..
మోహన్ బాబు మళ్లీ షాక్..
“ఏమిట్రా ఇది?” అన్నారు మోహన్ బాబు ఆశ్చర్యపోతూ.
“నువ్వు ఇప్పుడు కొంచం ఇబ్బందుల్లో వున్నావని తెలుసురా.. తీసుకో.. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది.. అప్పుడు ఈ డబ్బు తిరిగి ఇచ్చేద్దువుగానిలే” అన్నారు రజనీ చిర్నవ్వు నవ్వుతూ.
మిత్రుడి గొప్ప మనసుకి ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియలేదు మోహన్ బాబుగారికి.
మిత్రుడిని ఆలింగనం చేసుకుని కాసేపు అలాగే వుండిపోయారు.
1995 జూన్ 15న ‘పెదరాయుడు’ సినిమా రిలీజ్ అయింది..
మోహన్ బాబు అభినయం సుపర్బ్..
ఆ పాత్రకి ఆ పర్సనాలిటీ అద్భుతంగా సూట్ అయింది..
ఇక డైలాగ్ కింగ్ కదా.. ఆయన నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
ఇక పాపారాయుడు పాత్ర మరో పెద్ద ఎస్సెట్!
అతిథి పాత్రే అయినా.. తెరపై రజనీ కనిపించేది కాసేపే అయినా.. ఆ మేనరిజంకి.. ఆ పెర్ఫార్మెన్స్ కి థియేటర్ అదిరిపోయేలా క్లాప్స్..
భానుప్రియ, సౌందర్య.. అందరూ ఎవరి పాత్రకు వారు న్యాయం చేశారు.
రవిరాజా పినిశెట్టి టేకింగ్ అదిరిపోయింది..
కోటి అద్భుతమైన మ్యూజిక్ సినిమాని ఎక్కడికో తీసుకుపోయింది..
బొమ్మ సూపర్ హిట్..
బాక్సాఫీస్ రికార్డులు!
ఈ సినిమా అలా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో మా జర్నలిస్టుల సంఘమైన ‘ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్’ (FCA) తరఫున మోహన్ బాబు గారితో పంజాగుట్టలోని ఓ హోటల్ లో ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం.
ఉత్తమ కథా చిత్రాలు వచ్చినప్పుడు, సూపర్ హిట్ సినిమాలు వచ్చినప్పుడు దశాబ్దాల చరిత్ర వున్న మా FCA ఇలా మీట్ ది ప్రెస్ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ఒక ఆనవాయతీగా పెట్టుకుంది.
ఆ క్రమంలోనే ‘పెదరాయుడు’ సినిమా విషయంలో కూడా వేడుక నిర్వహించాం.
ఆ రోజు సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ కార్యక్రమంలో ఈ సినిమా నిర్మాణం వెనుక వున్న కథను, నిర్మాణ విశేషాలను మోహన్ బాబు వివరించారు.
అలాగే, పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు కూడా ఆయన తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు.
మూడు దశాబ్దాల క్రితం నాటి ఓ మధుర జ్ఞాపకం ఇది!
-మోహన్ గోటేటి
#MohanBabu
#Rajnikanth
#Pedarayudu
Share this Article