.
ఎవడేమి అనుకుంటేనేమి..? అనుకున్నది పక్కాగా చేసేస్తాన్, ఎవరడ్డొస్తారో నేనూ చూస్తాన్ అనే టైపు సీఎం రేవంత్ రెడ్డి, చాలా విషయాల్లో చూస్తేనే ఉన్నాం కదా… మేల్ శివగామి… నామాటే శాసనం… అయితే ప్రత్యర్థులు పనిగట్టుకుని చేసే విమర్శలకు తానూ కొంత ఆజ్యం పోస్తుంటాడు… యాదగిరిగుట్ట ట్రస్టు బోర్డు నియామకం, ఇతర నిర్ణయాలు ఆ కోవలోనివే అనిపిస్తుంది… పాపం శమించుగాక… అమంగళం ప్రతిహతమవుగాక…
నిజానికి యాదగిరిగుట్టను రాజకీయాలకు అతీతంగానే ఉంచాడు కేసీయార్… గుడి నిర్మాణ విషయంలో జరిగిన అవినీతి, నిర్మాణ నాణ్యత, ఆ స్థంభాలపై తన సొంత ప్రచార కండూతి వంటివి పక్కన పెడితే… పైన దేవుడు, గుడి తప్ప ఇంకేమీ ఉండకూడదనే భావనను కుర్చీ దిగిపోయేదాకా కంటిన్యూ చేశాడు…
Ads
ఇప్పుడు ఇక ట్రస్టు బోర్డు నియామకం జరిగిపోయింది… చైర్మన్ ఎవరు..? మన్నె సత్యనారాయణరెడ్డి… ఫార్మా దిగ్గజం… ఎంఎస్ఎన్ గ్రూపు కంపెనీలతో వేల కోట్ల ఆస్తిపరుడు… ఆ కోణంలో పర్లేదు, కానీ తన సోదరుడు మన్నె శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ సింగిల్ విండో చైర్మన్గా స్టార్టయి 2019లో బీఆర్ఎస్ ఎంపీ… 2024లో ఓటమి…
సరే, సత్యనారాయణరెడ్డిని రాజకీయ కోణంలో చూడలేం, పైగా సోదరుడి రాజకీయంతో తనకేం సంబంధం అనుకుంటే వోకే… స్వాతి కంఠమణి నాట్కో అనే మరో బడా ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలోని నాట్కో ట్రస్టుకు మేనేజింగ్ ట్రస్టీ (CSR వ్యవహారాలు చూస్తుంది) … ఈ నియామకం కూడా ఓకే… నాన్ పొలిటికల్…
అలాగే స్థానిక పెత్తనాలు, రాజకీయాలు ఉండకూడదని ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులను వద్దనుకున్నారు బోర్డులో అంటున్నారు కానీ (ఆల్రెడీ వైటీడీఏలో ఉన్నారు) … రాజకీయ వాసనలు లేకుండా ఏమీ లేదు. ఉదాహరణకు వినోద్ వెంకటస్వామి కాంగ్రెస్ ఎమ్మెల్యే…
లక్ష్మినారాయణ నాయక్, జనగామ డీసీసీ ప్రెసిడెంట్ ధన్వంతి భర్త… జాబితాలో ప్రముఖ కంట్రాక్టర్ విజయరాజం పేరుంది… శ్రీమతి పోచబోయిని ఈశ్వరమ్మ యాదవ్ గతంలో కర్మన్ఘాట్ గుడి ట్రస్టు బోర్డు మాజీ చైర్మన్… యాదవ జేఏసీ చైర్మన్గా కూడా ఉన్నారు. మొదట్లో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్… మరో ఇద్దరు ముగ్గురి వివరాలు అంతగా తెలియవు… (సామాజిక సమతూకం కూడా కనిపిస్తోంది)
మాజీ హోం మంత్రి తూళ్ల దేవేందర్ గౌడ్ కొడుకు విజయేందర్ పేరుంది కానీ, కొడుకు సోషల్ యాక్టివిస్టు, ఎస్వీఎం గ్రూప్ చైర్మన్… కానీ తను ప్రత్యక్ష రాజకీయాల్లో లేడు…

(మొన్నటి రగ్బీ ట్రోఫీ ప్రదానోత్సవం బాపతు ఫోటో… చిరంజీవి, ఎంఎస్ఎన్, రేవంత్ రెడ్డి…)
ప్రధానంగా విమర్శకు తావిచ్చేది కొణిదెల సురేఖ పేరు… ఎవరామె..? చిరంజీవి భార్య…! చిరంజీవి పవన్ కల్యాణ్ అన్న..! పవన్ కల్యాణ్ జనసేన చీఫ్, ఏపీ కూటమి ప్రభుత్వ భాగస్వామి..! అంటే చంద్రబాబు సహచరుడు..!
ఒకవైపు చంద్రబాబు- రేవంత్ రెడ్డి బంధం గురించి బీఆర్ఎస్ పదే పదే గాయిగత్తర చేస్తుంటే సురేఖను ట్రస్టు బోర్డులోకి తీసుకోవడం చిత్రమే… పైగా చిరంజీవి దంపతులు ఎప్పుడూ పెద్దగా యాదగిరిగుట్ట దర్శించినట్టు కూడా లేదు… మరి ఎవరి మెహర్బానీ కోసం ఈ ఎంపిక అనే విమర్శలు మళ్లీ సహజంగానే వస్తాయి… ఐనా ముందే చెప్పుకున్నాం కదా, రేవంత్ రెడ్డి తను ఏదనుకుంటే అది చేసేస్తాడు అని… విమర్శ గిమర్శ జాన్తా నై… वह वही कर रहा है जो वह चाहता है।
తిరుమలలోనే గెస్ట్ హౌజుల నిర్మాణాలు, వ్యాపారాల మీద బోలెడు విమర్శలున్నాయి… యాదగిరిగుట్టను అలాంటి పోకడలకు అతీతంగా ఉంచితేనే బాగుండేది… ఇప్పుడు గుట్టపైన గెస్ట్ హౌజులు కడతారట, రేవంత్ రెడ్డి గోఎహెడ్ అనేశాడు..!! ప్చ్..!!
Share this Article