.
పార్టీల సోషల్ మీడియా వింగ్స్ వ్యాప్తిచేసే దరిద్రాన్ని కాసేపు పక్కనపెడదాం… మరీ గులాబీ క్యాంప్ దరిద్రం రేంజ్ ఏమిటో కవితే చెబుతోంది… వాళ్లకు తల్లీచెల్లీ లేరా? వాళ్ల ఇళ్లల్లో ఆడవాళ్లు లేరా? కాళ్లు ఇరగ్గొడతం బిడ్డా అనీ హెచ్చరిస్తోంది… అది నేరుగా కేటీయార్, హరీష్ రావు మెయింటెయిన్ చేసే సోషల్ వింగ్స్ గురించి..!
ఆమె బాధను కూడా పక్కన పెడితే… పార్టీల సొంత పత్రికలు, టీవీల ప్రధాన ఉద్దేశం ప్రత్యర్థులపై విషం, ఓనర్లకు భజన… ఐనా కూడా అప్పుడప్పుడూ కొన్ని ప్రమాణాలకు కట్టుబడతాయి… ఎటొచ్చీ నమస్తే తెలంగాణ ఏ కోవలోకీ రాదు… దీనికి జర్నలిజంలోనే ఓ పేరు పెట్టాలి… మరీ ఇంత దిగజారుడుతనం అవసరమా దొరా.?
Ads
ఈ మాట ఎందుకు అంటున్నానంటే..? పొద్దున్నే ఆ పత్రిక ఓపెన్ చేస్తే మాస్ట్ హెడ్ కింద అన్నికాలాలూ కవరయ్యే ఓ అడ్డదిడ్డం స్టోరీ కనిపించింది… దీన్ని శోకజర్నలిజం అనాలేమో… నిన్న తటస్థ మీడియా గానీ, సోషల్ మీడియా గానీ… రేవంత్ రెడ్డి తన మనమడికి పూరీలు చేసి ఇస్తున్న ఫోటోను, వీడియోను సరదాగా, ఆఫ్ బీట్ కథనంగా చూశాయి…
ముఖ్యమంత్రి అయితేనేం, ఒక మనమడికి తాత… తాత ప్రేమ ఎప్పుడూ ఏ కుటుంబంలోనైనా అపురూపమే… దానికోసమే మెస్సీతో ఫుట్బాల్ ఆడించాడు తన మనమడిని… అంతేకాదు, నాయకులకు కుటుంబాలు, జీవితాలు, ఈతిబాధలు, సరదాలు ఉండవా..? 24 గంటలు సీఎం సెక్రెటేరియట్లో కూర్చోవాలా..? మరి అసలు సచివాలయం మొహమే చూడని పాత సీఎం మాటేమిటి..? చివరకు రేవంత్ పూరీ ఎపిసోడ్ను కూడా తమ శోకజర్నలిజానికి వాడుకుంది నమస్తే తెలంగాణ..,. ఎలా అంటే..? ఇలా…

ఎక్కడో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్… ఆ ఫోటో… ఇంకెక్కడో ట్రాక్టర్ ఇంజన్తో పొలానికి నీళ్లు… ఆ ఫోటో… సమస్యలు ఇలా ఉంటే… రోమ్ తగలబడి పోతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించిన ఉదంతంతో రేవంత్ తాతామనమల పూరీ ఫోటోకు ఓ క్షుద్రాభిప్రాయం ప్రచురించింది నమస్తే…
ఫుట్ బాల్ చూస్తూ కూర్చున్నాడు… మనమడికి పూరీలు చేస్తున్నాడు… కాలక్షేపం చేస్తున్నాడు అని ఏదేదో రాసిపారేసింది… ‘మనమడు కోరినప్పుడు తాతకు తప్పుతుందా’ అని రేవంత్ సరదాగా ఆ వీడియోను ట్వీట్ చేసుకున్నా ఏడుపేనా..?
అంతేకాదు, ఒకరు ఈత కొడుతున్నాడు, ఇంకొకరు విహారయాత్రలో ఉన్నాడు, మరొకరు దావత్లకు తిరుగుతున్నాడు… అని మంత్రుల మీదా అవే శోకజలాలు! ఈ ప్రజలు తనను ఓడించి, గద్దె దించారనే కోపంతో, అలకతో, పాత కుంభకోణాల అప్రతిష్టతో ఎవరికీ మొహం చూపించని ఫామ్ హౌజ్ దొరవారు తన మనమడు హిమాంశ్ జిమ్లో ముక్కుకు చిన్న దెబ్బ తగిలించుకుంటే, తన గడీని దాటొచ్చి హాస్పిటల్ వెళ్లాడు కదా మరి…
అదే తాత- మనమడి బంధం… దీనిపై ఎవరూ నమస్తే తెలంగాణ కథనాల్లాగా ఏడవలేదు కదా… ఏ పత్రిక, ఏ మీడియా నెగెటివ్గా స్పందించలేదు కదా… అదీ పాత్రికేయ సంస్కారం… జనం సర్వావస్థలు పడుతున్నది నిజమే అయితే… మరి కేసీయార్ ప్రతిపక్ష నేతగా బయటికి ఎందుకు రావడం లేదు..? జనంలోకి ఎందుకు రావడం లేదు..? ప్రజాజీవితంలో ఉన్నాననే సోయి ఎందుకు లేదు..? దొరతనమంటే అదేనా..? ఇది కదా, రోమ్ తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించడం అంటే!!
ఏం తక్కువ చేసింది తెలంగాణ సమాజం ఈ దొర వారికి..? అపారమైన సంపద పోగేసుకుని, చివరకు ఆ జనం మీదే అలక, అసంతృప్తి, ఆగ్రహ ప్రకటన!!
Share this Article