.
రేవంత్ రెడ్డి అన్నాడని కాదు గానీ… కాళేశ్వరం కిలాడీ కమిటీలో ఈటల నిజంగానే చేరాడా..? దానికి కవరింగుగా నాకు పార్టీకన్నా తెలంగాణ ముఖ్యం అంటున్నాడా..? ఇదేం విడ్డూరం… ఇదే ఈటలను అరిగోస పెట్టాడు పెద్ద దొర… దాదాపు తన్ని తరిమేసినంత పనిచేస్తే, తక్షణ రక్షణ కోసం తన భావజాలానికి పూర్తి విరుద్ధమైన బీజేపీలో చేరాడు… ఇది అందరికీ తెలిసిన చరిత్ర…
ఒకవైపు బీజేపీ హైకమాండ్ పదే పదే కాళేశ్వరంలో లక్షల కోట్ల అవినీతిపై మాట్లాడుతుంటే… ఈటల మాత్రం ఠాట్, లక్ష కోట్ల అవినీతి అనేది నాన్సెన్స్ అంటూ, కాళేశ్వరం అంటే మేడిగడ్డ మాత్రమే కాదు, బోలెడు రిజర్వాయర్లు, పంపు హౌజులు అంటూ అచ్చంగా హరీష్ రావు భాష అందుకున్నాడు… అంతే కాదు, సబ్జెక్టు మీద గ్రిప్ లేనట్టుంది, తక్షణం నీటిని ఎత్తిపోయండి అంటున్నాడు… ( కాళేశ్వరం అవినీతి అక్రమాల సమయంలోనూ తనూ కేసీయార్ టీమ్ మెంబర్ కదా… అన్నా, నీకేం ప్రాబ్లం లేదులే, ఎందుకీ అడ్డగోలు సమర్థనలు? )
Ads
అదెలా సాంకేతికంగా అసాధ్యమో, ప్రమాదమో ఉత్తమకుమార్ రెడ్డికి చెప్పడం చేతకాకపోతే, మళ్లీ రేవంత్ రెడ్డే చెప్పుకోవాల్సి వచ్చింది… కానీ భలే సవాల్ విసిరాడు, అచ్చంగా మెట్రోపై కిషన్రెడ్డికి విసిరినట్టుగానే! కేంద్రంలో మీదే కదా ప్రభుత్వం, NDSA చెబుతుంది కదా, మూడు బరాజులు ప్రమాదకరంగా ఉన్నాయి, నీరు నిల్వ చేయడం కుదరదు అని, వెళ్లి వాళ్లకు ఓ మాట చెప్పు, అలాగే పనిలోపనిగా కాళేశ్వరం మీద సీబీఐ కేసు ఏమైందో కనుక్కుని చెప్పు అని ఓ చురక అంటించాడు…
నిజంగానే ఈటలకు ఒక దేవాదుల ఎత్తిపోతకు, ఒక కాళేశ్వరం ఎత్తిపోతకు తేడా తెలియనట్టుంది… కానీ, పెద్ద రిలీఫ్ ఏమిటంటే… తను కూడా నాకు వారం రోజులు అప్పగించు, ఎత్తిపోసి చూపిస్తా అనలేదు… మరికొన్ని నిజాల్లోకి వెళ్దాం…
1) డ్యామ్ సేఫ్టీ చట్టానికి (2021) మద్దతు తెలిపింది బీఆర్ఎస్… ఇప్పుడు అదే చట్టంతో ఏర్పడిన సంస్థ నివేదికల్ని ప్రశ్నిస్తూ అదే బీఆర్ఎస్ ఏదో గాయిగత్తరకు ప్రయత్నిస్తోంది… ఇదే మాట రేవంత్ రెడ్డి అడుగుతుంటే బీఆర్ఎస్ నుంచి సమాధానం లేదు… పైగా పోలవరం కాపర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోతే కిమ్మనని NDSA కాళేశ్వరంపైనే ఈ కాన్సంట్రేషన్ దేనికి అని ప్రశ్నించడం మరీ డొల్ల వెైఖరి…
2) ఈటల ఎందుకు డిఫెన్సులో పడిపోయాడంటే… NDSA ను తప్పుపడితే అది తన పార్టీ హైకమాండ్ ధోరణికీ, కేంద్ర ప్రభుత్వానికీ వ్యతిరేకం… అందుకే నాకు పార్టీకన్నా తెలంగాణ ముఖ్యం అంటున్నాడు… ఇక బీజేపీ ఆలోచించుకోవాలని తన పార్టీ నిబద్ధతను… అంత సీన్ ఉంటే తనను ఎందుకు పార్టీలోకి చేర్చుకునేవారు అంటారా..? అవును, అదీ నిజమే…
3) రేవంత్ రెడ్డి తెలివిగా… ఈటల తాజా వ్యాఖ్యల్ని ఆసరాగా తీసుకుని, మరోసారి బీఆర్ఎస్- బీజేపీ అక్రమ బంధాల్ని, రహస్య సంసారాల్ని ఎక్స్పోజ్ చేయటానికి ప్రయత్నించాడు… ఈటల బీజేపీకి మేలు చేస్తున్నాడా..? నష్టం చేస్తున్నాడా..?
…. ఎక్కడో మాట్లాడుతూ ఈటల ఏమంటాడంటే..? ‘‘నదులకు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు ఉండవు, ప్రైవేటు భూముల్లో నుంచి కూడా నదులు ప్రవహిస్తాయి’’… తనకు తెలియనిది ఏమిటంటే..? నది నిరంకుశం, రివర్ కోర్సులోకి వచ్చే భూములపై ఎవరికీ ఏ యాజమాన్య హక్కులు ఉండవ్… అవునూ, ఈటలకు హఠాత్తుగా ఏమైంది..? ఇదీ అసలు ప్రశ్న!!
ఈటలకు ‘ముచ్చట’ సూచన… ఒక దేవాదుల నుంచి గోదారి నీటిని ఎత్తిపోయడం వేరు- మేడిగడ్డ పాయింట్ నుంచి ఎత్తిపోయడం వేరు… ఇంత సీనియర్ రాజకీయవేత్తవు, అనాలోచిత వ్యాఖ్యానాలు ఎందుకు నాయకా..?
.
- చివరగా… రేవంత్ రెడ్డి కూడా సంయమనం కోల్పోతున్నాడు… భాష అదుపు తప్పుతోంది… ‘వీళ్లను కోసి రక్తం చల్లితే పంటల మీద, అదే పండుతది’ అనే వ్యాఖ్య అత్యంత అభ్యంతరకరం, తనకే నష్టదాయకం!! కాళేశ్వరంపై బీఆర్ఎస్, బీజేపీలను సమర్థంగా కౌంటర్ చేస్తూ, ఇదుగో ఇలాంటి భాషతోనే చేజేతులా నష్టం తెచ్చుకోవడం!! నువ్వు ఇప్పుడు కొడంగల్ జెడ్పీటీసీవి కాదు పాలకా..!! తెలంగాణ సమాజం హర్షించదు!!
Share this Article