.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నాడు..? ‘‘ఎవరైనా ఇంజనీరింగ్ పూర్తయిన విద్యార్థి ఉంటే.. ఒక తెల్ల కాగితం ఇచ్చి, ఉద్యోగం కోసం దరఖాస్తు పత్రం రాయమనండి.. రాయలేరు.. అలాంటివారు రాష్ట్రంలో ఏటా వేల సంఖ్యలో ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నారు. వారికి ఉద్యోగాలెలా వస్తాయి? ఇంజనీరింగ్ విద్య క్రిమినల్ వేస్ట్. వారికి సరైన చదువు చెప్పలేకపోతున్నాం. ఇన్నాళ్లూ సరిగా నైపుణ్యాలు నేర్పించలేకపోయాం. సరిగా చెబితే ఎందుకు నేర్చుకోరు’’ ఇదే కాదు, ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లోని విద్యార్థుల నైపుణ్యాల పెంపుకి ప్రత్యేక కార్యాచరణ స్టార్ట్ చేయబోెతున్నామనీ చెప్పాడు…
…. క్రిమినల్ వేస్ట్ అనే పదాన్ని పట్టుకుని హరీష్ రావు, కేటీయార్ ఏదో ఈ పదం జెన్-జీ తరాన్ని అవమానించినట్టు, రేవంత్ రెడ్డి యువతను కించపరిచినట్టు ఏదో వక్రబాష్యం వినిపించే విపల రాజకీయ ప్రయత్నం చేశారు… నిజానికి సీఎం చెబుతున్నది మనం కొలువులకు ఉపయోగపడే స్కిల్స్ నేర్పడంలో విఫలం అవుతున్నామని… అంతేతప్ప విద్యార్థులది తప్పు అనడం లేదు…
Ads
ఇంజనీరింగ్ అయ్యాక మరీ కొలువుల్లేక, కొలువులకు పనికిరాక ఏవేవో చిన్నాచితకా ఉద్యోగాల్లో ఎలా చేరుతున్నారో నిన్న చెప్పుకున్నాం కదా… ఎస్, రేవంత్ రెడ్డి మంచి డిబేట్కు తెరలేపాడు, అవసరమైన చర్చ, మథనం… ఇంకాస్త లోతుగా చెప్పుకుందాం… కొన్ని సర్వేల సాక్షిగా… ఇలా…

ఏటా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు… జాబ్ రెడీ అర్హులు వేలల్లో! తప్పు విద్యార్థిదా? విద్యా వ్యవస్థదా?
ప్రతి ఏడాది లక్షలాది మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారు. అయితే అదే సమయంలో పరిశ్రమలు మరో మాట చెబుతున్నాయి. “సరైన ఇంజనీర్లు దొరకడం లేదు.” ఈ రెండు వాక్యాల్లో ఏది నిజం? నిజానికి… రెండూ నిజమే!
భారత్లో ఇంజనీర్ల కొరత లేదు. ఉద్యోగానికి సిద్ధంగా ఉన్న (Job-ready) ఇంజనీర్ల కొరత ఉంది. అదే మన విద్యా వ్యవస్థకు అద్దం పడుతోంది. AICTE గణాంకాల ప్రకారం దేశంలో ఇప్పటికీ ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. AISHE డేటా ప్రకారం ఏటా సుమారు 8–9 లక్షల మంది B.E., B.Tech గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. అంటే సంఖ్య ఉత్పత్తిలో లోటు లేదు.
కానీ… HirePro 2026 సర్వే ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. కేవలం 9 శాతం కంపెనీలు మాత్రమే “ఫ్రెష్ ఇంజనీర్లు మొదటి రోజు నుంచే పని చేయగలరు” అని నమ్ముతున్నాయి.
అదే సమయంలో… 68 శాతం మంది విద్యార్థులు మాత్రం “మేము పూర్తిగా సిద్ధమే” అంటున్నారు. ఇక్కడే అసలు గ్యాప్ ఉంది. విద్యార్థి తనను తాను సిద్ధమని అనుకుంటున్నాడు. పరిశ్రమ మాత్రం “ఇంకా కాదు” అంటోంది.
India Skills Report 2025 ప్రకారం B.Tech గ్రాడ్యుయేట్లలో 71.5 శాతం మందికే పరిశ్రమ కోరే స్థాయి Employability ఉందని పేర్కొంది. గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇది ఉద్యోగాలు వచ్చిన శాతం కాదు. ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు ఉన్నాయని అంచనా వేసిన వారి శాతం మాత్రమే.
Unstop Graduate Employment Report 2025 ప్రకారం సర్వేలో పాల్గొన్న ఇంజనీరింగ్ విద్యార్థుల్లో 80 శాతం మందికి పైగా క్యాంపస్ ప్లేస్మెంట్ లేదా ఇంటర్న్షిప్ ఆఫర్ కూడా లేకపోయింది. ఈ నివేదిక మొత్తం దేశాన్ని ప్రతిబింబించకపోయినా, క్యాంపస్ నియామకాలపై పెరుగుతున్న ఒత్తిడిని స్పష్టంగా చూపిస్తోంది.
ఇప్పుడు అసలు ప్రశ్న… ఈ పరిస్థితికి కారణం ఎవరు? విద్యార్థులా? పూర్తిగా కాదు.
- నాలుగేళ్ల ఇంజనీరింగ్ చదివిన తర్వాత కూడా ఎందుకు లక్షలాది మంది హైదరాబాద్, బెంగళూరు, పుణే, చెన్నైల్లోని ప్రైవేట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లలో మళ్లీ జావా, పైథాన్, ఫుల్ స్టాక్, AWS, Azure, DevOps, Data Analytics, GenAI కోర్సులు నేర్చుకుంటున్నారు? ఇప్పుడు చెప్పండి మనం నిజంగా జాబ్ రెడీ నైపుణ్యాన్ని ఇస్తున్నామా పిల్లలకు?
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది మన విద్యా వ్యవస్థే. AI, Data Science, Cyber Security, Machine Learning, IoT వంటి కొత్త బ్రాంచీలు చాలా కాలేజీల్లో వచ్చాయి. అది స్వాగతించాల్సిన విషయమే. అవసరమే, కానీ…
- బ్రాంచ్ పేరు మారితే సరిపోదు. బోధనా విధానం కూడా మారాలి. చాలా చోట్ల ఇంకా పాత ల్యాబ్లు. పాత అసైన్మెంట్లు. పాత ప్రశ్నపత్రాలు. సెమిస్టర్ పాస్ అయితే చాలు అనే దృక్పథం.పరిశ్రమ అడిగేది మాత్రం GitHub ప్రొఫైల్, నిజమైన ప్రాజెక్టులు, AI టూల్స్ వినియోగం, క్లౌడ్ డిప్లాయ్మెంట్, టీమ్వర్క్, కమ్యూనికేషన్, సమస్య పరిష్కార సామర్థ్యం.అంటే… మన కాలేజీలు ఇప్పటికీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నాయి. పరిశ్రమ మాత్రం ఉద్యోగానికి సిద్ధమైన వారిని వెతుకుతోంది. ఈ రెండింటి మధ్య దూరమే లక్షలాది మంది యువత భవిష్యత్తును ప్రభావితం చేస్తోంది.
ఇదిలా ఉంటే మరో విప్లవం తలుపు తడుతోంది. అదే Generative AI. Microsoft, Google, Amazon, Meta వంటి సంస్థలు ఇప్పటికే AI ఆధారిత కోడింగ్ టూల్స్ను భారీగా వినియోగిస్తున్నాయి. GitHub Copilot, ChatGPT, Gemini వంటి సాధనాలు సాధారణ కోడ్ రాయడం, టెస్టింగ్, డాక్యుమెంటేషన్ వంటి ఎంట్రీ-లెవల్ పనుల్లో మనుషుల అవసరాన్ని తగ్గిస్తున్నాయి.
దీని అర్థం… భవిష్యత్తులో సాధారణ కోడర్కు అవకాశాలు తగ్గవచ్చు. కానీ AIతో కలిసి పనిచేయగల ఇంజనీర్కు డిమాండ్ పెరుగుతుంది. అందుకే ఇప్పుడు విద్యార్థికి కేవలం C లేదా Java నేర్పితే సరిపోదు. AIని ఎలా ఉపయోగించాలి? డేటాను ఎలా విశ్లేషించాలి? సైబర్ దాడులను ఎలా అడ్డుకోవాలి? క్లౌడ్లో అప్లికేషన్ను ఎలా నిర్మించాలి? ఇలాంటి నైపుణ్యాలే రేపటి ఉద్యోగాలను నిర్ణయిస్తాయి.

ఇక్కడ మనం మరోసారి ప్రపంచాన్ని చూడాలి… జర్మనీలో “డ్యుయల్ ఎడ్యుకేషన్” మోడల్లో విద్యార్థి కాలేజీలో నేర్చుకున్నదాన్ని పరిశ్రమలోనే ప్రాక్టికల్గా అమలు చేస్తాడు. దక్షిణ కొరియాలో విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు కలిసి కరికులాన్ని తరచూ నవీకరిస్తాయి.
- చైనాలో AI, రోబోటిక్స్, సెమీకండక్టర్లు, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటి రంగాలకు అనుగుణంగా వేలాది ప్రత్యేక ల్యాబ్లు, పరిశ్రమ భాగస్వామ్యాలు ఏర్పాటు చేశారు. ఐటీయేతర రంగాలకూ ప్రయారిటీ ఇస్తున్నారు.
భారత్లో కూడా మంచి సంస్థలు, IITలు, IIITలు, కొన్ని ప్రముఖ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఇదే దిశగా ముందుకు వెళ్తున్నాయి. కానీ దేశవ్యాప్తంగా వేలాది సాధారణ ఇంజనీరింగ్ కాలేజీల వరకు ఆ మార్పు ఇంకా సమానంగా చేరలేదు. అందుకే ఇప్పుడు చర్చ “ఇంకెన్ని ఇంజనీరింగ్ కాలేజీలు?” అనే దానిపై కాదు.
“ఇప్పటికే ఉన్న కాలేజీల్లో ప్రపంచ స్థాయి నైపుణ్యాలు ఎలా నేర్పాలి?” అన్నదానిపై జరగాలి. లేకపోతే… విద్యార్థి చేతిలో డిగ్రీ ఉంటుంది. తల్లిదండ్రుల చేతిలో లక్షల రూపాయల ఫీజుల రసీదులు ఉంటాయి. కాలేజీల చేతిలో 100 శాతం రిజల్ట్ ప్రకటనలు ఉంటాయి.
రేవంత్ రెడ్డి ఉపయోగించిన “క్రిమినల్ వేస్ట్” అనే పదంపై రాజకీయాలు చేయడం చాలా సులభం. కానీ ఆయన లేవనెత్తిన ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత సులభం కాదు. నాలుగేళ్లు చదివిన ఇంజనీరింగ్ విద్యార్థికి, ఉద్యోగం రావాలంటే మరో ఏడాది ప్రైవేట్ ట్రైనింగ్ అవసరమవుతుంటే… లోపం విద్యార్థిలో కాదు. వ్యవస్థలో ఉంది. అందుకే ఈ వ్యాఖ్యపై రాజకీయ రచ్చ కంటే… విద్యా సంస్కరణలపై జాతీయ స్థాయి చర్చ జరగడం దేశానికి ఎక్కువ ఉపయోగం.
Share this Article