.
తెలంగాణలో హైదరాబాద్ మినహా వేరే ఎయిర్ పోర్టులు లేవు… ఏపీలో మాత్రం ఎడాపెడా, తాజాగా భోగాపురం కూడా…! ఒక విశ్లేషణ ఇది….. నిజానికి హైదరాబాద్ ఎయిర్పోర్టు తెలంగాణ సెంటర్లో ఉంది కాబట్టి పెద్ద తేడా కనిపించడం లేదు… ఆదిలాబాద్, వరంగల్ ఆలోచిస్తే బెటర్… ఐనా వయబులిటీ ప్రశ్నార్థకమే…
ఏపీ వేరు, భౌగోళిక కారణాల రీత్యా… తిరుపతి, విశాఖ, విజయవాడ దూరదూరంగా ఉన్నాయి కాబట్టి ‘రవాణా సౌలభ్యం’ కోణంలో అవసరమే,, వయబుల్ కూడా… మిగతా మూడింటి వయబులిటీ ఎలా ఉందో తెలియదు… ఇప్పుడు భోగాపురం స్టార్ట్ చేశారు, మరో రెండు ప్రతిపాదనల్లో ఉన్నాయిట…
Ads
నిజానికి వందేమాతరం, హైస్పీడ్ రైళ్లు వస్తున్న నేపథ్యంలో చిన్న చిన్న ఎయిర్పోర్టులు వయబులిటీ లేక, నిర్వహణ ఖర్చు ప్రభుత్వంపై భారమే… ఈ చర్చ ఇలా ఉంటే, మోదీ నిన్న ఘనంగా చెప్పాడు…2014లో జస్ట్ 74 ఉండేవి ఎయిర్పోర్టులు, ఇప్పుడు 166… మోదీ తనకుతానే జబ్బలు చరుచుకునే స్వీయపొగడ్త ఇది…..

ఒక రాష్ట్రంలో ఇదీ పరిస్థితి… సో, సంఖ్య ముఖ్యం కాదు, అవసరం- దూరం- ఆర్థికంగా లాభదాయకత వంటి చాలా అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి… భోగాపురం గురించి ఇప్పుడే అపశకున వ్యాఖ్యలు అవసరం లేదు, కానీ విశాఖకు దగ్గరలోనే కదా, ఇక చూడాలి దాని భవిష్యత్తు…
ఖరీదు కోణంలో కాదు గానీ, విమానాల్లో ప్రయాణాలకు చిన్న చిన్న దూరాలు ఏమాత్రం అవసరం కాదు… గంటాగంటన్నర ముందు వెళ్లడం, పోర్టు దాకా వెళ్లడం, చెక్ ఇన్, చెకింగ్, డెస్టినేషన్ చేరాక మళ్లీ ఇంటికి వెళ్లడానికి దూరం… ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే బస్సులు, రైళ్లే సౌకర్యం అనిపిస్తుంది… పెద్ద దూరాలకు మాత్రం విమానాలే సౌఖ్యం…
(ఇది భోగాపురం పోర్టు కాదు, ఖజురహో ఎయిర్ పోర్టు)
నిజానికి కార్గో విషయంలో కూడా విమానాలకన్నా రైళ్లే చీప్… రోడ్డు మార్గం కూడా చౌక… సరే, ఎయిర్ పోర్టుల ర్యాంకింగ్ మరో విడ్దూరం, అదీ ఓసారి చెప్పుకోవాలి… నిన్నంతా మీడియాలో వ్యంగ్య కథనాలు బోలెడు, విషయం ఏమిటీ అంటే..?
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) విడుదల చేసిన కస్టమర్ సాటిస్ఫ్యాక్షన్ ఇండెక్స్ (CSI – వినియోగదారుల సంతృప్తి జాబితా) లో ఖజురహో ఎయిర్పోర్టు దేశంలోనే మొదటి స్థానాన్ని దక్కించుకుంది… నిజానికి ఇప్పుడక్కడ వాణిజ్య విమానాల రాకపోకలే లేవు… ఢిల్లీ, వారణాసిలకు నడిచే కొన్ని సర్వీసులు కూడా గత కొంతకాలంగా నిలిచిపోవడంతో జూలై 1 నుండి ఇక్కడ విమానాల రాకపోకలు పూర్తిగా సున్నాకి పడిపోయాయి. అక్టోబర్ కన్నా ముందు కొత్త సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం కూడా లేదని తెలుస్తోంది.
AAI సర్వే చేసే విధానం వల్లనే ఈ విచిత్ర పరిస్థితి తలెత్తింది: ఈ సర్వేలో విమానాల సంఖ్యను, ఎయిర్ట్రాఫిక్ను లేదా ప్రయాణ సౌలభ్యాన్ని ప్రధాన కొలమానంగా తీసుకోరు. బదులుగా ఎయిర్పోర్టులో పరిశుభ్రత, భద్రత, సిబ్బంది ప్రవర్తన, మరుగుదొడ్ల నిర్వహణ వంటి 33 రకాల పారామీటర్లను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులు ఇస్తారు.
పెద్ద ఎయిర్పోర్టులలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండి క్యూలైన్లు, ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి. కానీ, ఖజురహోలో అసలు ప్రయాణికులే లేకపోవడంతో అక్కడ ఎలాంటి రద్దీ, కిరికిరి లేదు. ఫలితంగా పరిశుభ్రత, ఇతర సౌకర్యాల పాయింట్లు అత్యధికంగా వచ్చి అది నేరుగా టాప్ ప్లేస్కి చేరింది.
పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి కోట్ల రూపాయలు వెచ్చించి ఎయిర్పోర్టులు, టెర్మినల్స్ నిర్మించడం అవసరమే అయినప్పటికీ, సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల అవి నిరుపయోగంగా మారుతున్నాయి. కనీస విమాన సర్వీసులు కూడా నడవని ఇలాంటి విమానాశ్రయాల నిర్వహణ కోసం ప్రజాధనం ఖర్చు కావడం, మరోవైపు అసలు సమస్యలను పక్కనపెట్టి కేవలం కాగితాలపై నిర్వహించే సర్వేల ఆధారంగా ‘అగ్రస్థానం’ ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి…
సీనియర్ జర్నలిస్ట్ బుద్దా మురళి పోస్టు ఒకటి ఈ సందర్భంగా ఉదహరించుకుందాం… ‘‘ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నియోజకవర్గ ఎమ్మెల్యేలు / ఇంచార్జులకు ర్యాంకులు ఇచ్చేవారు . పార్టీ సమావేశాల నిర్వహణ , పార్టీ ఇచ్చిన కార్యక్రమాల అమలు , కార్యవర్గ సభ్యుల హాజరు వంటి వాటికి మార్కులు ఉండేవి . ఓసారి చార్మినార్ నియోజకవర్గం ఈ ర్యాంకులలో మొదటి స్థానంలో నిలిచింది …
ర్యాంకులు ప్రకటిస్తూ బాబే నవ్వారు . చార్మినార్ ఇంచార్జ్ ఇంట్లోనే సమావేశం , కార్యవర్గంలో పలువురు ఇంటివారు, బంధువులే … అంతా ఇంట్లో కూర్చుంటే అదే సమావేశం, సో, సర్వేలు- ర్యాంకింగుల ప్రాతిపదికలు ఎప్పుడూ ఓ బ్రహ్మపదార్థమే… భ్రమపదార్థమే… అసలు చార్మినార్లో టీడీపీకి డిపాజిట్ వస్తుందా..? కానీ, ఆ ర్యాంకు, అంతే…
ఎయిర్పోర్టుల సంఖ్య గురించి చెప్పుకుందాం… చిన్న పట్టణాలకు కనెక్టివిటీ: ఉడాన్ (UDAN – Ude Desh ka Aam Nagrik) పథకం కింద చిన్న, ద్వితీయ, తృతీయ శ్రేణి (Tier-2 & Tier-3) పట్టణాలను కూడా విమాన మార్గాలతో అనుసంధానించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
కొత్త నిర్మాణాలు, పునరుద్ధరణ: కేవలం కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణమే కాకుండా, మూతపడిన పాత రన్వేలు, ఎయిర్స్ట్రిప్లను (దర్భంగా, షిర్డీ, పాసిఘాట్ వంటి ప్రాంతాల్లో) సైతం పునరుద్ధరించి విమాన సర్వీసులు నడిపించడం వల్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.
అభివృద్ధిపై వ్యతిరేక వాదనలు, విమర్శలు… ఎయిర్పోర్టుల సంఖ్య పెరగడాన్ని ప్రభుత్వం గొప్ప విజయంగా చెప్పుకుంటున్నప్పటికీ, దీనిపై నిపుణులు, విపక్షాల నుంచి కొన్ని గట్టి విమర్శలు వస్తున్నాయి… ఖజురహోలాగే దేశంలోని అనేక చిన్న పట్టణాల్లో కోట్లు వెచ్చించి ఎయిర్పోర్టులు కట్టినప్పటికీ, ఆదరణ లేక, విమాన కంపెనీలు (Airlines) సర్వీసులు రద్దు చేసుకుంటున్నాయి. ఫలితంగా ఆ ఎయిర్పోర్టుల భద్రత, సిబ్బంది జీతభత్యాలు, నిర్వహణ కోసం ప్రభుత్వ నిధులు నిరంతరం వృథాగా ఖర్చు చేయాల్సి వస్తోంది..!!
Share this Article