.
మోక్ష మార్గమా? మృత్యుమార్గమా? తిరువణ్ణామలైలో భక్తుల భద్రత కోసం కొత్త నిబంధనలు!
అరుణాచల శివుని సన్నిధి… అంతులేని భక్తి భావంతో నిత్యం వేలాది మంది భక్తులతో కళకళలాడే దివ్యక్షేత్రం తిరువణ్ణామలై. ఇక్కడ ప్రతి అడుగులోనూ ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంటుంది. అయితే, భక్తి పరాకాష్టలో భక్తులు చేసే కొన్ని సాహసాలు ఒక్కోసారి ప్రాణాల మీదికి తెస్తుంటాయి. ఈ కోవకే చెందిందే ప్రసిద్ధ ‘మోక్ష మార్గం’ (ఇడుక్కు పిళ్లైయార్) గుహ ప్రవేశం.
Ads
అనంత కోటి సమస్యలకు నానాకోటి పరిష్కారాలు ఉంటాయంటారు కానీ, ప్రాణం పోయాక మాత్రం దానికి ఎలాంటి పరిష్కారమూ ఉండదు కదా! అందుకే, ఇటీవల జరిగిన కొన్ని విషాద ఘటనల నుంచి పాఠం నేర్చుకున్న ఆలయ యంత్రాంగం భక్తుల ప్రాణాలను కాపాడేందుకు ఒక వినూత్నమైన, కఠినమైన భద్రతా చర్యకు శ్రీకారం చుట్టింది. ఇదోరకం పరిష్కారం. (అసలు ఈ పాయింట్ దగ్గర ఏ దేవుడూ లేడని గమనించమనవి).
ప్రాణాలు తీస్తున్న ఇరుకైన దారి…
మోక్ష మార్గం అనగానే భక్తులలో ఒకటే ఉత్సాహం. ఈ ఇరుకైన గుహ మార్గం గుండా వెళ్తే పుణ్యం వస్తుందనే నమ్మకంతో చాలా మంది ఉత్సాహం చూపుతుంటారు. కానీ, కొలతలు లేని ఈ ఇరుకు దారి తాజాగా కొందరి పాలిట మృత్యుమార్గంగా మారింది:
-
మణికుమార్ విషాదం: ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరానికి చెందిన 36 ఏళ్ల మణికుమార్ అనే భక్తుడు ఈ గుహ గుండా వెళ్లేందుకు ప్రయత్నించి మధ్యలోనే ఇరుక్కుపోయారు. తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బంది తలెత్తడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. పోలీసులు రంగప్రవేశం చేసి మృతదేహాన్ని అతి కష్టమ్మీద బయటకు తీయాల్సి వచ్చింది.
-
తప్పిన ప్రాణాపాయం: ఇదే గుహలో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన మరొక మహిళా భక్తురాలు కూడా ఇలాగే ఇరుక్కుపోయి విలవిల్లాడిపోయారు. శ్వాస ఆడక కేకలు వేయడంతో, అప్రమత్తమైన తోటి భక్తులు ఆమెను సకాలంలో కష్టమ్మీద బయటకు లాగడంతో ప్రాణాలతో బయటపడ్డారు.
సైజ్ చెకింగ్… గ్రిల్స్ టెస్ట్!
ఇలాంటి ప్రాణాంతక ఘటనలు పునరావృతం కాకూడదని భావించిన ఆలయ యంత్రాంగం, గుహ మార్గం వద్ద సరికొత్త ‘సైజ్ చెకింగ్’ విధానాన్ని తీసుకువచ్చింది.
-
ఇనుప గ్రిల్స్ ఏర్పాటు: ప్రవేశ ద్వారం వద్దే రెండు బలమైన ఇనుప గ్రిల్స్ను అమర్చారు.
-
నిబంధన ఇదీ: ఈ గ్రిల్స్ మధ్య ఖాళీ గుండా ఎవరైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా సులువుగా దూసుకెళ్లగలరో, వారిని మాత్రమే మోక్ష మార్గంలోకి అనుమతిస్తున్నారు. ఒకవేళ ఇక్కడ ఇబ్బంది పడితే… ఇక లోపలికి వెళ్లినట్టేనని హెచ్చరిస్తూ వారిని అక్కడికక్కడే నిరోధిస్తున్నారు.
-
హెచ్చరిక బోర్డులు: అధిక బరువున్న వారు, వృద్ధులు, తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ సాహసానికి పోవద్దంటూ స్పష్టమైన హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేశారు.
భక్తుల నమ్మకాలను గౌరవిస్తూనే, వారి ప్రాణ రక్షణే ధ్యేయంగా అధికారులు తీసుకున్న ఈ ముందస్తు భద్రతా నిర్ణయం పట్ల స్థానికులు, హేతువాదులు, విజ్ఞులైన భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భక్తి ముసుగులో ప్రాణాల మీదకు తెచ్చుకోవడం కంటే, ఆయురారోగ్యాలతో జీవించడమే అసలైన మోక్ష మార్గమని ఈ ఘటనలు మరోసారి నిరూపించాయి.

ఇక్కడ చెప్పాలని అనుకుంటున్నది మరో విశేషం… ఈ బోర్డు చూశారు కదా, ఇదీ తెలుగు దురవస్థ… అక్కడ ఈ గుహప్రవేశాల పిచ్చి మన తెలుగు భక్తుల్లోనే ఎక్కువ… ఈ ప్రకటనేమో ఇలా… ఒరేయ్ నాన్నా, అర్థమయ్యే తెలుగులో బోర్డు రాసిపెట్టేవాళ్లే లేరా..? సో, ఈ ప్రకటన అర్థం చేసుకుంటే మోక్షసిద్ధి ప్రాప్తిరస్తు!
Share this Article