.
క్లియర్… ఒకవేళ బీఆర్ఎస్, బీజేపీ ఒత్తిడి చేసినట్టుగా… ఆ ట్రాపులో పడిపోయి గనుక కాంగ్రెస్ ప్రభుత్వం కన్నెపల్లి పంపుల్ని ఆన్ చేసి, నీటిని ఎత్తిపోసే ప్రయత్నం చేస్తే, పెద్ద ప్రమాదమే సంభవించేది… బీఆర్ఎస్ అంతే కదా, కమీషన్ల యావతో కట్టిందే ఓ నాసిరకం ప్రాజెక్టు, పైగా అదీ పూర్తిగా కూలిపోయేలా ఇప్పటికీ కుట్రలు… తరువాత ప్రభుత్వాన్ని బదనాం చేసే ఎత్తుగడలు…
అబ్బే, ఒక పిల్లర్ కుంగింది, అంతే అని ఒకరు… నాలుగు తట్టల కాంక్రీట్ చాలు రిపేర్లకు అని మరొకరు… లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకున్నాయి, ఈ బరాజులకు ఏమీ కాదు, నీళ్లు ఎత్తిపోయడం ఇష్టం లేక ప్రాజెక్డును పఢావు పెట్టారని ఇంకొకరు… బీఆర్ఎస్ పెద్ద తలలన్నీ ఇష్టారాజ్యం శుష్క వాదనల్ని వినిపించాయి… హరీష్ రావు అయితే మరనో పదడుగులు ముందుకుపోయి, గోదావరి నీళ్లను చంద్రబాబుకు గురుదక్షిణగా పంపిస్తున్నాడని వెటకారాలు… లక్ష కోట్ల ప్రజాధనాన్ని గోదాట్లో పోసి, పైగా ఇప్పుడీ ఆటలు!!
Ads
ఈ మాటలు కటువుగా అనిపించినా… నిజం మాత్రం దారుణంగానే కనిపిస్తోంది… ఈ మూడు బరాజుల స్థితి ఏమిటో తెలుసుకోవడానికి పూణెలోని CWPRS (కేంద్ర జల, విద్యుత్తు పరిశోధన సంస్థ) జీపీఆర్ పరీక్షల్ని నిర్వహించిన సంగతి తెలుసు కదా… ఈ పరీక్షలు కూడా పెద్ద ప్రయాస… దీనికితోడు బోర్హోల్ అండ్ కోర్ డ్రిల్లింగ్, ERT (ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ టోమోగ్రఫీ) పరీక్షలు కూడా అవసరమే… ఆ జీపీఆర్ ఫలితాల్ని పూణె సంస్థ రాష్ట్రానికి పంపించింది…
(ఆ వివరాల్ని ఈనాడు ఎక్స్క్లూజివ్గా ప్రచురించింది… కానీ గందరగోళంగా, పాఠకులకు సరిగ్గా అర్థం గాని శైలిలో…, అనేక ఇంగ్లిష్, టెక్నికల్ పదాల్ని అలాగే పబ్లిష్ చేసింది… మామూలుగా ప్రతి ఇంగ్లిష్ పదానికి ఏదో చేతబడి చేసినట్టుగా తెలుగు పదాల్ని క్రియేట్ చేయడం ఈనాడు అలవాటు కదా, ఇది పూర్తి కంట్రాస్టు… అనామలీస్, వెంట్స్, పియర్స్, వాయిడ్స్, ర్యాఫ్ట్ తదితర అనేక పదాల్ని యథాతథంగా అచ్చేసింది..)

సరే, కాస్త అర్థమయ్యేట్టు చెప్పుకుందాం… బరాజుల్లో నీళ్లు వెళ్లే వెంట్స్ (తూముల) కింద చాలా సమస్యలున్నట్టు ఈ పరీక్షల్లో తేలింది… మేడిగడ్డలో ఏడు, సుందిళ్లలో మూడు, అన్నారంలో ఒకటి… అంటే మొత్తం పదకొండు సమస్యాత్మకం… 30 మీటర్ల లోతు వరకూ జరిగిన ఈ పరీక్షల్లో ప్రధానంగా కనిపిస్తున్న లోపాలు…
ఇవన్నీ డిజైన్, ఇంజనీరింగ్ లోపాలే… ఇది గమనించదగిన కీలకవిషయం… పలుచోట్ల అనామలీస్ గుర్తించారు, అంటే కాలం చెల్లిన డిజైన్లు లేదా భౌగోళిక పరిస్థితులను సరిగ్గా అంచనా వేయకపోవడం వల్ల ప్రాజెక్ట్ నిర్మాణంలో తలెత్తే సాంకేతిక లోపాలు… పలుచోట్ల కేవిటీస్ ఏర్పడ్డాయి… అంటే బరాజుల గేట్ల వద్ద, కాంక్రీట్ నిర్మాణాలు లేదా పియర్స్ (Piers) తాకిడి ప్రాంతాలలో నీటి ఉధృతి వల్ల ఏర్పడే గుంటలు, రంధ్రాలు లేదా డొల్ల ప్రాంతాలు…
మేడిగడ్డ 8, 5, 7 బ్లాకుల్లో ఎక్కువ లోపాలు కనిపించాయి… అక్కడే ఏడో బ్లాకులో పలు పియర్స్ కుంగిపోయాయి… పలుచోట్ల ర్యాఫ్ట్ ఫౌండేషన్ (Raft Foundation) కింద “వాయిడ్స్” (Voids) ఏర్పడ్డాయి.. అంటే కాంక్రీట్ మట్టానికి (Raft Slab), కింద ఉన్న నేలకు (Soil/Subgrade) మధ్య ఏర్పడే ఖాళీలు లేదా గ్యాప్లు…
ఇంకా టెక్నికల్ పదజాలం ఇక్కడ అవసరం లేదు గానీ… మొత్తానికి మూడు బరాజుల్లోనూ సమస్యలున్నాయి… NDA పాలనలో ఉన్న కేంద్ర సంస్థ చెబుతున్నదే ఇది… ఇప్పుడు చెప్పండి తెలంగాణ బీజేపీ నేతలూ (పర్టిక్యులర్లీ ఈటల, అప్పటి ఆర్థిక మంత్రి గారు) కన్నెపల్లి పంపుల్ని నడిపించాలా, ఆ బరాజుల్ని మొత్తం ప్రమాదంలోకి నెట్టేయాలా..? మీరు కూడా బీఆర్ఎస్ డొల్ల, కుట్ర వాదనలకు, డిమాండ్లకు వంతపాడుతున్నారా..?
Share this Article