.
ఒక విరుద్ధ దృశ్యం… భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభసభలో చంద్రబాబు మోదీని ఆకాశానికెత్తేశాడు… అఫ్కోర్స్, పవన్ కల్యాణ్ పొగిడినా సరే, తనవెప్పుడూ చంచల, అస్థిర భాషణలు, విధేయతలే కాబట్టి వదిలేస్తే… దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్, దేశముదురు చంద్రబాబు పొగడ్తలే మరీ ‘అతి’గా అనిపించాయి చాలామందికి…
సరే, ఎవరి బాష్యం వాళ్లు చెప్పుకున్నారు… మోదీ భార్యను కూడా ప్రస్తావించి ఎగతాళి చేసిన చంద్రబాబుకు తరువాత రోజుల్లో ‘తత్వం’ బోధపడి, దాదాపు కాళ్లబేరానికి వచ్చాడు… సరే, పొత్తు, ఫలించిన గెలుపు, మళ్లీ అధికారం, అదంతా వేరే కథ… వరుస దెబ్బలు, తలనొప్పులతో డీలాపడిన మోదీని ఆకాశానికెత్తడం ఎవరికో ఎందుకు..?
Ads
సాక్షాత్తూ చంద్రబాబు వాయిస్ రాధాకృష్ణకే నచ్చడం లేదు పాపం… అందుకే నేటి తన తొలిపలుకు వ్యాసంలో తన ఆక్రోశాన్ని వెళ్లగక్కాడు… సరే, అంగారక గ్రహంలో జీవం ఉనికి అనే సబ్జెక్టు తీసుకున్నా సరే, తను అందులో కూడా జగన్ ప్రస్తావన తీసుకొచ్చి తిడతాడు కదా, ఇందులోనూ జగన్ను తీసుకొచ్చాడు…

ఏమనీ అంటే..? ‘‘ప్రధాని మోదీ జగన్మోహన్రెడ్డికి అండగా ఉంటున్నాడనే భావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బలంగా ఉంది కాబట్టి, అందుకని మోదీని చంద్రబాబు అతిగా పొగడటం జనానికి నచ్చడం లేదట… (రాధాకృష్ణకు నచ్చకపోతే ఏపీ ప్రజలకు నచ్చనట్టే లెక్క తన దృష్టిలో… దీన్నీ జెన్జీ భాషలో సంకుచితిజం అంటారు) …
2019 లో మోదీ బలంగా ఉన్నప్పుడు చంద్రబాబు తనతో సయోధ్యతో ఉన్నాడు సరే, ఇప్పుడు మోదీ బలహీనపడ్డాడు, ఇప్పుడు కూడా అదే సాగిలబాటు అవసరమాని తెలుగు ప్రజలు తెగ ఫీలయిపోతున్నారట… అంటే మోదీ బలంగా ఉంటే దోస్తీ, బలహీనపడితే దూరమా..?
వావ్… రాధాకృష్ణ ‘అవకాశవాదం ఎలా వదిలేస్తావోయ్ బాబూ’ అని ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది… అంటే, చంద్రబాబూ, నీ ఒరిజినల్ వైఖరి వదిలేస్తున్నావా, ఎంత సిగ్గుచేటు, మన నిజతత్వం ఏమిటి, నువ్వు చేస్తున్నదేమిటి..? అని శంకరాభరణంలో శంకరశాస్త్రిలా ప్రశ్నిస్తున్నాడు…
జగన్ మనిషిగా, పాలకుడిగా, పార్టీ అధినేతగా ఎలాంటివాడైనా సరే… తనకు ప్రాప్తకాలజ్ఞత ఉంది.., మోదీకి చంద్రబాబు నిజగుణం తెలుసు… అందుకే జగన్ను మోదీ దూరం చేసుకోడు… జగన్ మోదీ మీద తిరుగుబాటు జెండా ఎగరేయడు… ఇదే కదా, ఈమధ్య ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పుకొచ్చింది… కాకపోతే దాన్ని జనసేన- ఢిల్లీ అమిత్ షా భేటీ అనే కల్పనాత్మక కథలో చెప్పడమే పెద్ద వివాదమై కూర్చుంది…
చివరగా… కాక్రోచ్ పార్టీ రాజకీయాల్లోకి రావద్దనే నిర్ణయం భేష్ అంటాడు రాధాకృష్ణ… కేవలం విజిల్ బ్లోయర్లాగే ఉండాలట… జయప్రకాష్ నారాయణ, లక్ష్మినారాయణ దెబ్బతినడమే ఉదాహరణ అంటాడు… ఎందుకంటే..? ఏమో, జగన్, బాబు తప్ప వేరే ఆల్టర్నేట్ దిక్కులేని ఏపీలోకి కాక్రోచ్ పార్టీ జొరబడితే తన బాబుకే ప్రమాదం అనే భావన ఇది… అందుకే బొద్దింకలు సజీవంగా ఉండాలి, కానీ రాజకీయాల్లోకి రావద్దు..!!
Share this Article