.
పాడిందే పాటరా… అన్నట్టుగా… ప్రతి దానికీ చంద్రబాబు బనకచర్లకు ముడిపెట్టి, ఇదంతా గురుశిష్యుల కుట్ర అని పాటపాడటం బీఆర్ఎస్ క్యాంపుకి పరిపాటి అయిపోయింది… చివరకు అదెంత పైత్యానికి చేరిందంటే… పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్రం చెప్పడాన్ని కూడా దానికే ముడిపెట్టిన చిత్తవికారం ఇప్పుడు…
కావాలనే చంద్రబాబు కోసం… మోదీ నేతృత్వంలోని కేంద్రం మధ్యవర్తిత్వం, సంప్రదింపులు అని కొత్త పాట అందుకున్నదట… చంద్రబాబు కోసమే రేవంత్ రెడ్డి దానికి సై అన్నాడట… కర్నాటక నుంచి ఎన్వీసీ తీసుకొస్తామని మభ్యపెడుతున్నాడట… సో, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును పణంగా పెడుతున్నాడట… అదీ బనకచర్ల కోసమేనట…
Ads

అసలు బనకచర్లకూ ఎగువన ఉండే కృష్ణా జలాలకు ఏం సంబంధం..? ఇదే కేంద్రం బనకచర్ల కుదరదు పోవోయ్ అని మొన్ననే తేల్చి చెప్పింది… ఒకవేళ నిజంగానే చంద్రబాబు చెప్పినట్టు, రేవంత్ రెడ్డి కోరినట్టు జరుగుతూ ఉన్నట్టయితే… మొన్న బనకచర్లకు రెడ్ సిగ్నల్ దేనికి..? ఇప్పుడు పాలమూరు- రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేననే స్పష్టీకరణ దేనికి..? అసలు ఏమైనా గులాబీ వాదనలో రీజనింగు ఉందా..?
ఏదో బట్ట కాల్చి మీదేస్తాం, కడుక్కో అన్నట్టుంది… పైగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ ఫలితం అని మరో సూత్రీకరణ… కేంద్రం ఏం చెబుతోంది..? ఈ ప్రాజెక్టు కృష్ణా ట్రిబ్యునల్-2 పరిధిలో ఉంది, అంతర్రాష్ట్ర వివాదాలున్నాయి, కోర్టు వ్యాజ్యాలు ఉన్నాయి, సో, జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించలేం అని చెప్పింది… ఇక్కడ రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం ఏముంది..? ట్రిబ్యునల్, కోర్టులు, అంతర్రాష్ట్ర వివాదాలు రేవంత్ రెడ్డి కుంపటి కాదు కదా…

సరే, రేవంత్ రెడ్డి నిర్లక్ష్యమే అనుకుందాం… మరి పదేళ్లు ఉద్దరించిన కేసీయార్ ప్రభుత్వం దీనిపై పోరాడింది ఏముంది..? హక్కు సుస్థిరం కావాలంటే త్వరత్వరగా దాన్ని పూర్తి చేయాల్సి ఉండింది… అదీ చేయలేదు… కేసీయార్ స్వర్ణయుగంలో కూడా డీపీఆర్ వాపస్ వచ్చింది కదా.. ఇక ఇప్పుడేమో బనకచర్ల అనే ఓ డొల్ల వాదనతో మళ్లీ రెడీ… తెలంగాణ జనం ఎడ్దోళ్లు, మేం ఏం చెప్పినా నమ్ముతారు అనే తెగింపు, అడిదరిమి వేషం…
మరి బీజేపీ ఏం చేసింది..? ఎస్, ఇద్దరు కేంద్ర మంత్రులు, కిమ్మనలేరు, ఇరిగేషన్ సబ్జెక్టు తెలియదు… ఎంపీలకూ ఏమీ పట్టదు… పోలవరం అనగానే వెంకయ్యనాయుడు ఏడు మండలాలను అర్జెంటుగా, మోదీ ఇంకా కుదురుకోకముందే బిల్లు పెట్టించి, మమ అనిపించాడు… ఇకపై నో జాతీయ ప్రాజెక్టులు అంటూనే, మన ఎగువన అప్పర్ భద్ర ప్రాజెక్టుకు సై అంటుంది కేంద్రం… కెన్ బత్వాకూ వోకే అంటుంది…

మరి బీజేపీ నిర్వాకం మీద ఎలుగెత్తడానికి మాత్రం బీఆర్ఎస్ క్యాంపుకి మాటలు రావు, అసలే కాళేశ్వరం వంటి కత్తులు పెద్దల మెడలపై వేలాడుతున్నవేళ… భయం… అందుకని మోదీ మాటెత్తడానికి వణికి… రేవంత్ రెడ్డి మీద శోకాలు… శుష్క రాద్ధాంతాలు..!!
నిజంగానే బనకచర్ల కోసమే మోదీ, రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారు అనుకుంటే… మరి అదే బనకచర్లకు అనుమతి ఇవ్వకుండా కేంద్రం చెత్తబుట్టలో పడేయడం ఏమిటి..? ఐనా మళ్లీ మళ్లీ పదే పదే బనకచర్ల కోసమే మోదీ- బాబు- రేవంత్ కుమ్మక్కు అనే వ్యర్థవాదనలు దేనికి..?! ప్చ్, పొలిటికల్ విమర్శల్లోనూ నాణ్యత ఉండాలనే సోయి లేకుండా పోయింది బీఆర్ఎస్ క్యాంపుకి..!!

Share this Article