.
తాగేవాడు కడతాడు తాళ్ల పన్ను! అది పెరిగితే తాగేవాడిపైనే భారం, సేమ్, మద్యం ధరలు కూడా! ప్రభుత్వానికి ఏం నొప్పి, తన ఆదాయం తను పెంచుకుంటుంది… కానీ ఈ సూత్రం అన్ని రంగాల్లోనూ వర్తించదు… ప్రత్యేకించి సినిమా రంగం!
నాదేం పోయింది, నా వినోదపన్ను నాకు అదనంగా వస్తే సరి అనుకుని టికెట్ రేట్ల పెంపుకీ, అదనపు షోలకీ ఎడాపెడా పర్మిషన్లు ఇస్తోంది ప్రభుత్వం… అంతేకాదు, ఇప్పుడు రెగ్యులర్ షోల టికెట్ రేట్ల పెంపుకీ వోకే అనేసింది… రోజుకు అయిదు షోలకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది… పేరుకు రెగ్యులేషన్…
Ads
టికెట్ రేట్లు పెరిగితే… ఆఁ ఏముందిలే ప్రేక్షకుడు కడతాడు అని ప్రభుత్వం అనుకోవచ్చుగాక, కానీ అసలే మూలుగుతున్న నక్కపై తాటిపండు పడ్డట్టు ఇది… అసలే థియేటర్ రావడానికి ప్రేక్షకుడు భయపడి చస్తున్న ఈరోజుల్లో ఈ నిర్ణయాలు ప్రేక్షకుడిని థియేటర్కు రావడం అంటేనే మరింత భయపెట్టడం… వెరసి ఇండస్ట్రీ కూడా తాము కూర్చున్న కొమ్మను తామే నరుక్కోవడం అవుతుంది…
జనం టీవీల్లో సినిమాల్ని చూడటం మానేస్తున్నారు, ఇప్పుడంతా ఓటీటీ వీక్షణమే, సినిమాలే కాదు, సీరీస్, రియాలిటీ షోలు, బోలెడు కంటెంటు, అందుకే ఓటీటీల చందాదారులు పెరుగుతున్నారు, ఇళ్లల్లోనే మినీ థియేటర్లు వెలుస్తున్నాయి… థియేటర్ వెళ్తే బోలెడంత ఖర్చు, ప్రయాస, ట్రాఫిక్, కాలుష్యం, పైగా సమోసాలు, పాప్కార్న్ దందా… ఈ స్థితిలో థియేటర్లకు ప్రేక్షకుడిని రప్పించడానికి కొత్త ఆలోచనలు చేయాలి…
కానీ ఎగ్జిబిటర్లు ఏదో అడిగారు, ప్రభుత్వం వోకే అనేసింది… నాకు రెవిన్యూ పెరిగితే సరి అనుకుంది… ఏసీ, నాన్ ఏసీ, మల్టీప్లెక్సులు, స్పెషల్ థియేటర్లు అనే కొత్త కేటగిరీ… అన్నింట్లోనూ కనిష్ట, గరిష్ఠ ధరల్ని ఖరారు చేసింది తెలంగాణ ప్రభుత్వం… నాన్ ఏసీ, ఏసీ థియేటర్లలో కూడా ప్రీమియం- నాన్ ప్రీమియం… నాన్ ఏసీ 100, ఏసీ 200 గరిష్ఠ ధర… మల్టీప్లెక్సులు, స్పెషల్ థియేటర్లలో గరిష్ఠ టికెట్ ధర 300…
కొత్తగా స్పెషల్ థియేటర్స్ కేటగిరీ ఏర్పాటు… 7.1 సౌండ్, 2K/4K స్క్రీన్లకు స్పెషల్ కేటగిరీ స్టేటస్… అందులో 25% సీట్లు నాన్-ప్రీమియం అట… ఉదయం 8 నుంచి రాత్రి 1 వరకు 5 షోలకు అనుమతి… చిన్న సినిమాలపై దయతలంచి, రోజూ ఒక షో తప్పనిసరి అట…
ఈ నాన్ ప్రీమియం అంటే… నేల టికెట్టు బాపతు అన్నమాట… 25 శాతం… ఇవి తెరకు దగ్గరగా ఉంటాయి… ఇకపై ప్రత్యేకంగా జీవోలు, సర్క్యులర్లు అక్కర్లేదు… రూ.100 కోట్లు పైబడిన సినిమాలకు సూపర్ హైబడ్జెట్ హోదా, తొలి 10 రోజులు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం… కాకపోతే కార్మికుల సంక్షేమ నిధికి రూ.కోటి వరకు విరాళం తప్పనిసరి…
అవైనా సరిగ్గా చెల్లిస్తారా నిర్మాతలు..? గత యేడాది డిసెంబర్లో వచ్చిన బాలకృష్ణ ‘అఖండ 2’ సినిమాతో పాటు ఈ సంక్రాంతికి వచ్చిన చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారూ’, ప్రభాస్ ‘ది రాజా సాబ్’ చిత్రాలు ఉన్నాయి. అలానే ఇటీవల విడుదలైన ‘పెద్ది’ సినిమా సైతం టిక్కెట్ రేట్లను పెంచుకునే వెసులు బాటును ఉపయోగించుకుంది.
ఈ నలుగురు నిర్మాతలు ఇంతవరకూ టిక్కెట్ రేట్ల పెంపు కారణంగా వచ్చిన లాభంలో ఇరవై శాతాన్ని ఎఫ్.డి.సి.లో నమోదు చేయలేదు. దాంతో తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఆ మొత్తాన్ని చెల్లించాలని కోరుతూ ఈ నాలుగు సినిమాల నిర్మాణ సంస్థలకు లేఖ రాసింది. ఎగ్జిబిటర్స్ నుంచి డబ్బులు వసూలు చేసి, ఎఫ్.డి.సి.లో జమ చేయాల్సిన బాధ్యత సదరు నిర్మాణ సంస్థలదే అని స్పష్టం చేసింది…
ఏతావాతా మా సినిమా నిర్మాణవ్యయం 100 కోట్ల పైమాటే అని చెబితే చాలు… రోజుకు అయిదు షోలు వేసుకో, పదిరోజులపాటు టికెట్ రేట్లు పెంచుకో… కాకపోతే వచ్చిన ఆ అదనపు ఆదాయంలో 20 శాతం లేదా కనీసం కోటి రూపాయల్ని కార్మికుల సంక్షేమనిధికి ఇవ్వాలి…
పర్లేదు, హీరోల మూర్ఖాభిమానులు ఉంటారు, ఇంకా ఎంత పెంచేసినా సరే థియేటర్కు వస్తారు, చెల్లిస్తారు, ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు, ప్రభుత్వానికి అదనపు డబ్బు… కానీ ఆ 10 రోజుల తరువాత..? ఈ ప్రశ్నకు ఇకపై తావు లేదు… ఫస్ట్ వారంలోనే వీలైనంత డబ్బు పిండుకోవాలి, అంతే…!!
Share this Article