.
రాందేవ్కూ కంగనాకూ నడుమ పంచాయితీ ఏమిటి..?
‘గట్టర్ జనరేషన్’తో మొదలై… ‘నా జవానీ, నా బెడ్రూమ్’ దాకా వెళ్లిన మాటల యుద్ధం!
కంగనా రనౌత్తో పెట్టుకోవడం అంటే… తేనెతుట్టెను కదపడం లాంటిదే! ఆమెను ఎవరు ఏ మాట అన్నా… తిరిగి సమాధానం వస్తుంది. అది కూడా మామూలు సమాధానం కాదు. ఎదుటివాడు ఎంత పెద్దవాడైనా సరే… తనకు నచ్చని మాట పడితే కంగనా వెనక్కి తగ్గే రకం కాదు. సినిమా రంగంలోనూ, రాజకీయాల్లోనూ ఆమె ఈ స్వభావాన్ని చాలాసార్లు చూపించింది.
Ads
ఇప్పుడు యోగా గురు బాబా రాందేవ్తోనూ అదే జరిగింది. కానీ ఈ పంచాయితీకి అసలు కారణం రాందేవ్- కంగనాల మధ్య పాత గొడవ ఏమీ కాదు. Gen-Z గురించి కంగనా చేసిన వ్యాఖ్యలే ఈ వ్యవహారానికి మూలం.
ఇటీవల యువత నిరసనలు, సోషల్ మీడియా రీల్స్పై స్పందిస్తూ కంగనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కొందరు యువ నిరసనకారులను ఉద్దేశించి ఆమె ‘Generation Gutter’ అంటూ విమర్శించింది. యువతలో కొందరి ప్రవర్తన, భాష, సోషల్ మీడియా సంస్కృతిని ఆమె తీవ్రంగా తప్పుబట్టింది.
అక్కడితో ఆగలేదు. తర్వాత కూడా తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ… తాను మొత్తం Gen-Zని ఉద్దేశించి మాట్లాడలేదని, కొందరిని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నానని వివరణ ఇచ్చింది. ఆ తర్వాత మరింత ఆసక్తికరంగా… Gen-Z దేశానికి పెద్ద బలమని, కొంతమంది చేసిన పనులతో మొత్తం తరాన్ని తీర్పు ఇవ్వడం సరికాదని కూడా చెప్పింది.
అంటే… కంగనా మాటల పంచాయితీ అప్పటికే నడుస్తోంది. ఇదే సమయంలో బాబా రాందేవ్ రంగంలోకి వచ్చారు. ఏదో మీడియా కార్యక్రమంలో కంగనా చేసిన వ్యాఖ్యలపై రాందేవ్ తీవ్రంగా స్పందించాడు. ‘‘ఆమె వ్యాఖ్యలు మైండ్ దెబ్బతిన్నట్టుగా ఉన్నయ్, అసలు ఆమె బాల్యం ఎలాంటిది? ఆమె యవ్వనం ఎలా ఉంది?
గతంలో ఆమె చేసిన పనులు ఎలాంటివి? అలాంటి వ్యక్తుల గురించి నేను మాట్లాడదలుచుకోదు, ఆమె పార్టీ ఆలోచించుకోవాలి…’’ అన్న రీతిలో రాందేవ్ వ్యాఖ్యలు చేశాడు.
ఇక్కడే అసలు ట్విస్ట్. కంగనా… కంగనానే కదా! ఆమెకు మండింది. ‘నేను జెన్ జీ గురించి ఏమైనా మాట్లాడితే దానికి పరిమితమై స్పందించాలి, కానీ నా యవ్వనం, నా గతం గురించి చీప్ కామెంట్స్ దేనికి’ అనుకుని రీకౌంటర్ ఇచ్చింది ఘాటుగా… సో వాట్..? బాబా రాందేవ్ అయితేనేం, బాబాకు తాత అయితేనేం..?
ఆమె ఓ సోషల్ మీడియా పోస్టులో… ‘నా యవ్వనం గురించి, నా బెడ్రూమ్ గురించి కలలు కనడం ఆపెయ్, నా కేరక్టర్ గురించి నువ్వు తీర్పు చెబుతావా? నీకన్నా నేను చాలా చాలా బెటర్’ అంటూ, ‘పతంజలి సంస్థకు సంబంధించిన తప్పుడు ప్రకటనల కేసును ప్రస్తావిస్తూ… ‘తప్పుడు వైద్య ప్రకటనలు చేసినందుకు సుప్రీంకోర్టుతో తాను ఎప్పుడూ చీవాట్లు తినలేదు’ అని గట్టిగానే తగిలించింది…
అక్కడితో వివాదం Gen-Z నుంచి వ్యక్తిగత జీవితానికి షిఫ్ట్ అయిపోయింది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో అసలు చర్చ. మరి రాందేవ్ ఎందుకు కంగనాతో పెట్టుకున్నాడు? ఇదే ఆసక్తికరమైన ప్రశ్న. గతంలో ఏమైనా లొల్లి ఉందా వీరిద్దరి నడుమ అని నెటిజనం నెట్ను తవ్విపోస్తున్నారు…
నిజమే, రాందేవ్ విమర్శలకు, వివాదాలకు కొత్త కాదు. పతంజలి, ఆయుర్వేదం, అల్లోపతి, ప్రకటనలు… ఇలా ఎన్నో విషయాల్లో తన ప్రకటనలు, వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు వరకూ వివాదాలు వెళ్లాయి. 2024లో పతంజలి ప్రకటనల వ్యవహారంలో రాందేవ్, ఆచార్య బాలకృష్ణ కోర్టు ముందు క్షమాపణలు కూడా సమర్పించారు.
అంటే… రాందేవ్ కూడా ‘నో కామెంట్’ టైపు వ్యక్తి కాదు. కంగనా కూడా అంతే. ఆమెకు డబుల్ టెంపర్… ఇద్దరి మధ్య కామన్ పాయింట్ ఏమిటంటే… ఇద్దరూ తమకు నచ్చిన విషయాన్ని బహిరంగంగా చెప్పే స్వభావం ఉన్నవాళ్లే. తాము నమ్మిన దానిపై వెనక్కి తగ్గే అలవాటు పెద్దగా ఉండదు. అందుకే ఈ కంట్రవర్సీ…
ఆమెను విమర్శించొచ్చు… కానీ ఎదురు మాట పడటానికి సిద్ధంగా ఉండాలి. ఇక్కడ సమస్య ఏమిటంటే? రాందేవ్ ఆమె వ్యక్తిగత జీవితం దాకా ఎందుకు వెళ్లినట్టు..? ‘‘ఆమెను ఎందుకు గోకాడు? ఈ తగాదాకు అసలు గతం ఏమిటి’’…
Share this Article