.
Subramanyam Dogiparthi …. 1993 జూన్ మాసంలో పుట్టపర్తి సత్య సాయిబాబా ఆశ్రమంలో కాల్పులు , కొందరి మరణాలు అంటే పోలీసుల చేతిలో.., వీటి చుట్టూ ఓ పెద్ద వివాదం ఇంకా కొంతమందికి గుర్తుండే ఉంటుంది . ఈ సంఘటన స్ఫూర్తితో 1994 లో ఈ ఆవేశం సినిమా తీయబడింది . ఫక్తు రాజశేఖర్ మార్క్ సినిమా .
పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లు స్వాములందు మంచి స్వాములు వేరయా అలాగే చెడ్డ స్వాములు వేరయా . కేవలం ఆధ్యాత్మికంగా భగవత్సందేశాలను ప్రజలకు చేర్చే స్వాములు ఒక వైపు . మరో వైపు స్వామీజీల ముసుగులో వివాదాస్పదులవుతున్న స్వామీజీలు మరోవైపు .
Ads
ఆ లిస్టులో ఇప్పుడు దేశంలోనే నంబర్ వన్ పొజిషన్లో గుర్మీత్ రాం రహీం సింగ్ అలియాస్ డేరా బాబా . ఆయన చక్కగా రాముడి పేరు రహీం పేరు కూడా పెట్టుకున్నాడు . ఆ వరుసలో ఆశారాం బాపు , స్వామి ప్రేమానంద , స్వామి నిత్యానంద , చంద్రస్వామి వగైరా .
అన్ని మతాలలోనూ ఇలాంటి ఆషాఢభూతులు ఉన్నారు . Trance అనే మళయాళ సినిమాలో చర్చిని అడ్డుపెట్టుకుని జరిపే భక్తి మాఫియా కథ చాలామందికి గుర్తుండే ఉంటుంది . నంబరు ఎక్కువా తక్కువ . అంతే . భక్తి మూఢభక్తి కానన్నాళ్ళు ఎలాంటి సమస్య ఉండదు . అలాంటి భక్తి సమాజానికి మంచిది కూడా .
ఈ సినిమాలో కూడా ఇలాంటిదే సందేశం . కోడి రామకృష్ణ దర్శకత్వంలో ధైర్యంగా తీయబడిన సినిమా .
రొటీన్ దుష్టులు . ఈ దుష్టుల ముఠాలో ఓ నేరచరితుడయిన స్వామీజీ , అతని భాగస్తుడు హోం మినిస్టర్ , ఇంకా కొందరు రౌడీ చెంచాలు . వీళ్ళు చేసే దురాగతాలను బయటపెట్టేందుకు ఓ నలుగురు యువతీ యువకులు ఆ ఆశ్రమంలోకి జొరబడటానికి చేసే విఫల ప్రయత్నంలో ముగ్గురు యువకులు చంపబడతారు .
మిగిలిన ఆ యువతి ఎలాగోలా ఆ స్వామీజీ దురాగతాలను బయటపెట్టేందుకు కంకణం కట్టుకుని పోరాడుతూ ఉంటుంది . నగ్మా ఈ పాత్రలో నటించింది . మరో హీరోయిన్ మధుబాల . ఓ పత్రిక అధినేత . సమాజంలో జరిగే అన్యాయాలను ధైర్యంగా ప్రజల ముందుకు తెచ్చే సాహస యువతి . స్వామీజీ అనుచరుల చేతిలో చంపబడుతుంది . 1+2 హీరోహీరోయిన్ల సమస్య కూడా తీర్చబడుతుంది .
IPS ఆఫీసరుగా చార్జ్ తీసుకోవాల్సిన కొద్ది గంటల ముందు తన కళ్ళ ముందే జరుగుతున్న అన్యాయాన్ని చూడలేక దుండగులను చంపి ఉద్యోగాన్ని పోగొట్టుకుంటాడు అవేశపరుడయిన హీరో రాజశేఖర్ . ఇలాంటి పాత్రలు అతనికి కొట్టిన పిండేగా ! బాగానే నటించాడు . అయితే ఇలాంటి పాత్రలు ఆయన నుండి చూసీ చూసి ప్రేక్షకులకు థ్రిల్ పోయింది .
స్వామీజీగా సురేంద్రపాల్ , హోం మినిస్టరుగా రామిరెడ్డి నటించారు . సినిమాలో రెండు కీలకమైన పాత్రల్లో చిన్నా , లలితకుమారి నటించారు . గిరిజన ప్రాంతం నుండి పొట్ట పోసుకోవటానికి పట్టణానికి వచ్చి కష్టాల పాలవుతారు . స్వామీజీ దురాగతాలకు పావులవుతారు .
(చిన్నాకి జోడీగా చేసిన లలిత కుమారి ప్రకాశ్ రాజ్ మాజీ భార్య, డిస్కో శాంతి సొంత సోదరి)
ఇతర పాత్రల్లో అచ్యుత్ , సంధ్యశ్రీ , ముక్కా నరసింగరావు తదితరులు నటించారు . పరుచూరి బ్రదర్స్ డైలాగులు ఉండవలసినంత పదునుగా ఉండవు . కీరవాణి సంగీత దర్శకత్వంలో వేటూరి , సిరివెన్నెల , భువనచంద్ర వ్రాసిన పాటలు థియేటర్లో బాగానే ఉన్నాయి .
రొటీన్ ఏక్షన్ సినిమాయే . కొత్త కోణం స్వామీజీ పాత్ర . ఏక్షన్ సినిమాలను మెచ్చే ప్రేక్షకులకు నచ్చుతుంది . ఇంతకుముందు చూడనట్లయితే వాచ్ లిస్టులో పెట్టుకోవచ్చు …
Share this Article