.
Rochish Mon …. అహల్య రాయి కాలేదు… ——– రామాయణం మనకు ఏం చెప్పింది?
ఇంద్రుడివల్ల అహల్య మోసపోలేదు. తప్పు చేసినందుకుగానూ రాయిలా జడపదార్థమై పడి ఉండమని గౌతముడు శపించినట్టుగానే చెప్పింది వాల్మీకి రామాయణం. చేసిన తప్పుకు అహల్య కూడా సంఘ బహిష్కరణకు గురై అన్నిటినీ కోల్పోయి జడపదార్థమై ఒక రాయిలా జీవనాన్ని సాగిస్తోంది. అప్పటికే చాలా కాలం గడిచిపోయింది.
తప్పులు చెయ్యడం మానవ నైజం. ఎంత కాలం ఒక మనిషికి శిక్ష కొనసాగుతుంది? ఇక అహల్యను సహజమైన జీవితంలోకి తీసుకురావాలన్న ఆలోచనతో విశ్వామిత్రుడు జడపదార్థంలా, రాయిలా, జీవచ్చవంలా పడి ఉన్న అహల్య ఆశ్రమానికి రాముణ్ణి తీసుకువెళతాడు. తన ఆశ్రమంలో రాముని పాదం పడగానే అహల్యకు ప్రాణం లేచివచ్చింది.
Ads
స్వయానా రాముడే వెళ్లి అహల్యను పరిగణించడం జరిగాక ఇతర ఆశ్రమవాసులు కూడా అహల్యను తమలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఆమె మామూలు మనిషి అయింది. అలా రాముడి పాదం వల్ల అహల్య పాపం కడగబడింది. “కామిని పాపము కడిగిన పాదము” అని అన్నమయ్య అన్నారు.
అహల్య రాయిగా మారడమూ, రాముడి పాదం తగలగానే మళ్లీ స్త్రీ అవడమూ వాల్మీకి రాసింది కాదు. తరువాతి నాళ్లలో మార్చి చెప్పబడింది అది. తప్పు జరిగాక, శిక్ష అనుభవించాక ఎవరినైనా మళ్లీ మామూలు జీవనంలోకి తీసుకురావాలి అన్న విశ్వామిత్రుడి చింతన విప్లవాత్మకమైంది ఆపై మహోన్నతమైంది. ఇది రామాయణం మనకు నేర్పే సంస్కారం.
రామాయణంలో ఉన్నదాన్ని మార్చి అహల్య రాయిగా మారి ఆపై రామ పాదం సోకి మళ్లీ స్త్రీ అయిందని చెప్పడం వల్ల రామాయణం మనకు చెప్పిన మహోన్నతమైన తత్త్వం మనకు అందకుండా పోయింది.
మహర్షులు, మహనీయులు చెప్పినదాన్ని ఉన్నదున్నట్టుగానే తీసుకుని అర్థం చేసుకోవాలి.
రోచిష్మాన్
9444012279
Share this Article