.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఓ బాధ్యత కలిగిన కేంద్ర జలసంస్థలాగా గాకుండా… ఓ పొలిటికల్ ఆర్గనైజేషన్గా NDSA వ్యవహరిస్తోందా..? మొదట్లో టెక్నికల్, ఇంజినీరింగ్ సంస్థలా వ్యవహరించిన సంస్థ చివరకు బీజేపీ ఆడుతున్న కొత్త డ్రామాలో లేదా డబుల్ గేమ్లో భాగస్వామి అయిపోయిందా..? బీఆర్ఎస్ మెప్పుకోసం బీజేపీ చివరకు ఇలా దిగజారుతోందా..?
… బీజేపీ ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రాజెక్టు విషయంలోనైనా సహాయ నిరాకరణ చేస్తున్నదంటే ఏకైక కారణం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటం! అది ఓ బాధ్యత కలిగిన కేంద్ర ప్రభుత్వంలాగా కాదు, కేవలం రాజకీయ కోణంలో మాత్రమే దేశపరిపాలనను చూస్తోంది, అది విషాదం… తాజా ఏమిటంటే..?
Ads
కాళేశ్వరం కేసీయార్ అక్రమ సంపాదనకు ఏటీఎం అన్నదీ వాళ్లే… లక్ష కోట్లు గోదాట్లో పోశారు అన్నదీ వాళ్లే… సీబీఐకి అప్పగించండి, తాటతీస్తాం అన్నదీ వాళ్లే… మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల డిజైన్ లోపాల కారణంగా గేట్లు మూసి, ఏమాత్రం నీటిని నిల్వ చేసినా అవి కొట్టుకుపోతాయని హెచ్చరించిందీ వాళ్లే… మరి ఇప్పుడు..?
అబ్బే, బరాజుల భద్రత మాత్రమే మేం చూస్తాం, నీళ్లు వదలాలా లేదానేది రాష్ట్రం ఇష్టం అని డొంకతిరుగుడు క్షుద్ర, శుష్క వాదనలకు దిగింది NDSA… ఎందుకు..? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి… ఎందుకు..? బీఆర్ఎస్ ఓ ట్రాప్ వేస్తోంది కదా, దానికి సహకరించడం కోసం… ఎందుకు..? భవిష్యత్తులో రెండూ సంసారం చేయడానికి రెడీ అయిపోతున్నాయి కాబట్టి… ఎందుకు..? సొంతంగా కాంగ్రెస్తో పోటీపడే స్థితిలో లేవు కాబట్టి..!

బీఆర్ఎస్ తక్షణం నీళ్లు వదిలేయాలని అంటుంది… వెంటనే బీజేపీ ప్రతినిధులు వెళ్లి జలశక్తి మంత్రిత్వ శాఖ వద్ద కూర్చుంటారు… ఏమిటిదంతా..? రేప్పొద్దున నిజంగానే NDSA మీ నీళ్లు- మీ ఇష్టం అని నివేదిక, సూచనలు ఇవ్వగలదా..? ఇస్తే ఆ బరాజులు కొట్టుకుపోయి భద్రాచలం కొంప కొల్లేరయితే రాష్ట్ర బీజేపీ గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ బాధ్యత తీసుకోగలదా..?
బీఆర్ఎస్ పార్టీదేముంది..? అంగట్లో తెడ్డు… అది ఎటయినా మాట్లాడగలదు… మునిగితే బీజేపీ, కాంగ్రెస్, నాదేం పోయింది అనే టైపు! పక్కా బాధ్యతారాహిత్యం!

బీజేపీ డబుల్ గేమ్తో షాక్ తిన్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించింది… క్లియర్ కట్ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేయబోతోంది… జల్ శక్తి మంత్రిత్వ శాఖ, ఎన్డీఎస్ఏ నుంచి స్పష్టమైన సాంకేతిక మార్గదర్శకాలు కోరనున్నది… ఎన్డీఎస్ఏ సూచనల మేరకే ఇప్పటివరకు మూడు బ్యారేజీలు ఫ్రీ-ఫ్లో మోడ్లోనే కొనసాగిస్తున్నారు…
రాజకీయ ఒత్తిళ్లతో కాదు… నిపుణుల లిఖితపూర్వక సిఫారసుల ఆధారంగానే తుది నిర్ణయం అని స్పష్టం చేస్తోంది… బీజేపీ, బీఆర్ఎస్ కలిసి తమను ట్రాప్ చేస్తున్నాయని పసిగట్టింది… CWC, GPR పరీక్షలు, ఫౌండేషన్లోని Cavities సహా అన్ని సాంకేతిక నివేదికలను కేంద్రానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులను ఆదేశించింది…
ప్రభుత్వ నిర్ణయాలన్నీ అధికారిక రికార్డులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది… రెసిడెంట్ కమిషనర్ ద్వారా జల్ శక్తి మంత్రిత్వ శాఖకు లేఖను వెంటనే అందజేయాలని ఆదేశించింది… అన్నారం బ్యారేజీ రాఫ్ట్ ఫౌండేషన్లో కూడా Cavities ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు, ప్రస్తుత పరిస్థితుల్లో అన్నారం బ్యారేజీలోనూ నీటి నిల్వ ఏమాత్రం సురక్షితం కాదని సాంకేతిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు…

మరి బీజేపీ- బీఆర్ఎస్ సంయుక్త కుట్ర వ్యూహం ఏమిటి..? అదీ తేలాల్సి ఉంది… కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వైఖరి చాలా విషయాల్లో సందేహాస్పదంగా కనిపిస్తోంది… నిజానికి మేడిగడ్డ పునరుద్ధరణ కాన్సెప్ట్ డిజైన్ ఆగస్టు నెలాఖరులో సిద్ధం కానుంది…ప్రాథమిక వ్యయ అంచనాలు సెప్టెంబర్ మధ్య నాటికి సిద్ధం అవుతాయి… అన్నారం, సుందిళ్ల బ్యారేజీల అదనపు సాంకేతిక విశ్లేషణలు మరో రెండు వారాల్లో పూర్తి అవుతాయి…
కేవలం నీరు ప్రవహిస్తోందనే కారణంతో పంపింగ్ సాధ్యం కాదని అధికారుల స్పష్టీకరిస్తున్నారు, తాత్కాలిక పంపింగ్ ప్రయత్నాలు నిర్మాణ సమస్యలను మరింత తీవ్రతరం చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు, సో, కేంద్ర తన వైఖరిని స్పష్టంగా వెల్లడించాలంటూ బాల్ను మోదీ కోర్టులోనికే పంపించాలని రాష్ట్రం నిర్ణయం తీసుకుంది..!!
Share this Article