.
బీఆర్ఎస్ నంబర్ త్రీ హరీష్ రావు క్షుద్ర పూజల యవ్వారం రాజకీయంగా ముదురుతోంది… రాష్ట్రంలో కరువు రావాలని, తద్వారా ప్రజల్లో ప్రభుత్వం మీద విపరీతమైన అసంతృప్తి పెరగాలని, తమకు పొలిటికల్ ఫాయిదా రావాలని హరీష్ రావు షిమోగా, తిరుచ్చి ప్రాంతాల్లోని గుళ్లలో క్షుద్ర పూజలు జరిపించాడని మొదట ఇద్దరు కాంగ్రెస్ నేతలు ఆరోపించగా…
హరీష్ రావు కస్సుమన్నాడు, పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తే కోర్టుకు గుంజుతానని హెచ్చరించాడు, క్షమాపణ చెప్పండి అన్నాడు… కానీ ఇదిక్కడ ఆగలేదు… ఈసారి పీసీసీ అధ్యక్షుడే ఆ ఆరోపణలు చేశాడు, పక్కన మరో కీలకనేత జగ్గారెడ్డి కూడా ఉన్నాడు… ఫోఫోవోయ్, ఏం బెదిరిస్తున్నావు..? నువ్వు ఏయే తేదీల్లో ఎక్కడెక్కడ ఉన్నావో మొత్తం తెలుసు, ఏం చేశావో తెలుసు, ఆధారాలున్నాయి, మేం రెడీ నిరూపించడానికి అని పేర్కొన్నాడు పీసీసీ ప్రెసిడెంట్…
Ads
రాష్ట్రంలో పార్టీపరంగా, ప్రభుత్వపరంగా ఏ నిర్ణయం జరిగినా పార్టీ సమన్వయ కమిటీ ఆమోదం ఉండాలని కదా మొన్న ఢిల్లీలో నిర్ణయం తీసుకుంది, మరి ఈ క్షుద్ర పూజల ఆరోపణలపై ఆ కమిటీ ఆమోదం ఉందో లేదో, మీనాక్షి నటరాజన్ గ్రీన్సిగ్నల్ ఇచ్చిందో లేదో తెలియదు… ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి హైకమాండ్ ఆమే కదా…
అసలు షిమోగాలో క్షుద్ర పూజలు ఉండవు, అది ఆదిశంకరాచార్యుడు నెలకొల్పిన శక్తిపీఠం అని బీఆర్ఎస్ ఎదురుదాడి ప్రారంభించింది… ఎప్పటిలాగే అదే దాసోజు, అదే ఆర్ఎస్పీ… ఇంకెవరూ మాట్లాడరు, మాట్లాడకూడదు కదా… నాన్సెన్స్, గుళ్లను సందర్శించినా ఈ క్షుద్ర విమర్శలు ఏమిటని కౌంటర్లు స్టార్ట్ చేశారు…
నిజంగా ఒక ప్రాంతంలో వర్షాలు పడకూడదని, పంటలు పండకూడదని, ప్రజలు కరువుతో అల్లాడిపోవాలని చేసే క్షుద్ర పూజలు కూడా ఉంటాయానేది వదిలేస్తే… షిమోగా, తిరుచ్చిలో ఆ పూజలు చేస్తారానేది మరో ప్రశ్న… కానీ అక్కడ ప్రధాన ఆలయాలు గాకుండా క్షుద్ర పూజలు చేసే వేరే గుళ్లున్నాయని కాంగ్రెస్ చెబుతోంది… అంతేకాదు,
హరీషుడు మార్చి 2న తిరుచ్చి, మే 31, జూన్ 1, జులై 23 తేదీల్లో షిమోగాకు వెళ్లినట్లు ఆధారాలు న్నాయని పీసీసీ చెబుతోంది… కానీ వెళ్లడం వేరు, గుళ్లకు ఎవరైనా వెళ్తారు, కానీ అక్కడ ఏం పూజలు చేశాడనే ఆధారాలు కాంగ్రెస్ వద్ద ఉన్నాయా..? ఒకవేళ నిజంగా క్షుద్రపూజలు చేసినా సరే, అవి కరువు కోసమే అని ఎవరు, ఎలా నిరూపిస్తారు..?
సరే, అది వదిలేస్తే… హరీష్ రావు కదిలితే, తుమ్మితే, దగ్గితే తన సోషల్ మీడియా, బీఆర్ఎస్ సోషల్ మీడియా మస్తు కవరేజ్ ఇస్తుంది కదా… మరి ఆ గుళ్లకు వెళ్లినప్పుడు ఒక్క ఫోటో లేదు, ఒక్క వార్త లేదు, అంత సీక్రెసీ ఎందుకు మెయింటెయిన్ చేశారు..? ఇదీ సందేహాస్పదం..!!
తాము లీగల్ నోటీసులకు భయపడబోమని పీసీసీ అధ్యక్షుడు చెబుతున్నాడు… బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి అఘోర, తాంత్రిక పూజలు చేసే సంస్కృతి కొనసాగుతోందని ఆరోపించాడు…. కేసీఆర్ ఫామ్ హౌస్ లో క్షుద్ర పూజలు జరుగుతాయనే ప్రచారాన్ని ఇంతకాలం తాను నమ్మలేదని, అయితే హరీష్ రావు వ్యవహారం చూస్తే ఆ ప్రచారంపై అనుమానాలు కలుగుతున్నాయని అన్నాడు…
ఈ విమర్శలకు ఆధారాలున్నాయా..? తెలియదు! జనానికి తెలిసి కేసీయార్ హోమాలు, యాగాలు, ఆయుత చండీయాగాలు వంటి అత్యున్నత వైదిక క్రతువులు చేస్తాడు… మరి పీసీసీ అధ్యక్షుడికి తెలిసి కేసీయార్ ఎలాంటి క్షుద్ర పూజలు చేశాడు, ఏమైనా బలులు ఇచ్చాడా..? ఆ ‘కాష్మోరా’ తాలూకు ఆధారాలేమిటో బయటపెట్టేస్తే ఓ పనైపోతుంది..!!
Share this Article