.
ఎవరినీ కాదనలేం.. ఎవరినీ హత్తుకోలేం!
బ్రిక్స్తో భారత్కు అసలు లాభమేంటి?
ఒకే వేదికపై నరేంద్ర మోదీ, జిన్పింగ్, పుతిన్.. ప్రపంచ రాజకీయాల్లోనే ఇది ఆసక్తికరమైన దృశ్యం. అమెరికాతో వ్యూహాత్మకంగా దగ్గరవుతున్న భారత్.. అదే సమయంలో అమెరికా ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న చైనాతో ఒకే వేదికపై కూర్చుంటోంది. ఉక్రెయిన్ యుద్ధంతో పాశ్చాత్య దేశాలతో దూరమైన రష్యాతో మాత్రం పాత మిత్రబంధాన్ని కొనసాగిస్తోంది. ఇప్పుడు పుతిన్, జిన్పింగ్ ఇద్దరూ భారత్కు వచ్చి బ్రిక్స్ సదస్సులో పాల్గొనడం మారుతున్న సమీకరణాలకు, జియోపాలిటిక్స్ దృశ్యాలకు అద్దం పట్టింది.
Ads
న్యూఢిల్లీలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరిగిన 18వ బ్రిక్స్ సదస్సు కేవలం రెండు రోజుల అంతర్జాతీయ సమావేశం కాదు. బహుళ ధ్రువ ప్రపంచంలో భారత్ తన స్థానాన్ని ఎలా నిర్మించుకుంటోందో చూపించిన ఒక దౌత్య ప్రదర్శన. భారత అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు 11 సభ్యదేశాల నేతలు, ప్రతినిధులు హాజరయ్యారు. ప్రపంచ జనాభాలో దాదాపు సగం ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ కూటమి ఇప్పుడు పాత బ్రిక్స్ కంటే చాలా పెద్దదైంది. అందుకే ఈ సదస్సులో జిన్పింగ్ రావడం, పుతిన్ రావడం రెండూ ముఖ్యమే.

గల్వాన్ తర్వాత భారత్- చైనా సంబంధాల్లో ఏర్పడిన ఉద్రిక్తత ఇంకా పూర్తిగా మాయమైందని చెప్పలేం. కానీ ఏడేళ్ల తర్వాత జిన్పింగ్ భారత్కు రావడం మాత్రం సంబంధాలు పూర్తిగా తెగిపోలేదన్న సంకేతం. (గల్వాన్ బాధ్యుడిగా భావించే ఓ కీలక ఆర్మీ అధికారిని చైనా తొలగించడం గమనార్హం)… అదే సమయంలో పుతిన్తో భారత్కు రక్షణ, ఇంధనం, అణుశక్తి, అంతరిక్షం, వాణిజ్యం వంటి అనేక రంగాల్లో ప్రత్యేక వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోదీ- పుతిన్ సమావేశంలో కూడా ఈ అంశాలపై చర్చ జరిగింది.
ఇక్కడే భారత విదేశాంగ విధానంలోని అసలు తెలివి కనిపిస్తుంది. చైనాను శత్రువుగా భావించినా, చైనాతో మాట్లాడక తప్పదు. రష్యా పాశ్చాత్య దేశాలకు ప్రత్యర్థిగా మారినా రష్యాను వదులుకోలేం. అమెరికా మనకు అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామి అయినా, అమెరికా చెప్పిన ప్రతి విషయంలోనూ మనం అదే వైఖరి తీసుకోలేం.
అంటే… ఎవరినీ కాదనలేం. ఎవరినీ పూర్తిగా హత్తుకోలేం. ఇదే ఇప్పుడు భారత విదేశాంగ విధానానికి ప్రాథమిక సూత్రంగా మారుతోంది.
బ్రిక్స్తో భారత్కు మొదటి లాభం.. ఒకే టేబుల్పై అందరూ… ఒకప్పుడు ప్రపంచం రెండు శిబిరాలుగా కనిపించేది. అమెరికా ఒక వైపు.. సోవియట్ యూనియన్ మరోవైపు. ఆ తర్వాత సోవియట్ యూనియన్ కూలిపోయింది. అమెరికా ఏకధ్రువ ప్రపంచంలోకి వెళ్లింది. ఇప్పుడు పరిస్థితి మళ్లీ మారుతోంది.
చైనా ఎదుగుతోంది. రష్యా అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేస్తోంది. గల్ఫ్ దేశాలు తమ స్వంత వ్యూహాలను అనుసరిస్తున్నాయి. భారత్ ఆర్థిక, సైనిక, దౌత్య పరంగా తన బరువును పెంచుకుంటోంది. ఇలాంటి సమయంలో బ్రిక్స్ భారత్కు ఒక ప్రత్యేక వేదిక. (నాటోలు, యూఎన్ఓలకు ఓ ప్రత్యామ్నాయ వేదిక నిర్మితమవుతోంది… అది డాలర్ ఆధిపత్యాన్ని బద్దలు కొట్టబోతోంది, అదే అమెరికాకు మంట)…
అమెరికా లేకుండానే అమెరికాతో మాట్లాడగలిగే శక్తి.. చైనాతో విభేదిస్తూ చైనాతో మాట్లాడగలిగే అవకాశం.. రష్యాతో సంబంధాలను కొనసాగిస్తూ పాశ్చాత్య దేశాలతోనూ సంబంధాలు పెట్టుకునే స్వేచ్ఛ. ఇదే భారతానికి అతిపెద్ద ప్రయోజనం.
గ్లోబల్ సౌత్లో భారత్కు మరో మెట్టు… బ్రిక్స్ ఇప్పుడు కేవలం బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా అనే ఐదు దేశాల సమూహం కాదు. విస్తరణ తర్వాత ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, యూఏఈ, ఇండోనేషియా, సౌదీ అరేబియా వంటి దేశాలతో దీని పరిధి పెరిగింది. ఇది భారత్కు మరో అవకాశం ఇస్తోంది.
ఆఫ్రికా, ఆసియా, మధ్యప్రాచ్యం, లాటిన్ అమెరికా దేశాల సమస్యలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో భారత్ కీలక పాత్ర పోషించగలదు. అందుకే మోదీ బ్రిక్స్ను కేవలం సభ్యదేశాల ప్రయోజనాల వేదికగా కాకుండా గ్లోబల్ సౌత్ గొంతుకగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. న్యూఢిల్లీ డిక్లరేషన్లో కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రపంచ పాలనా వ్యవస్థలో మరింత ప్రాతినిధ్యం, ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణ అవసరాన్ని ప్రస్తావించారు.
ఇది భారత్కు చిన్న విషయం కాదు… ఎందుకంటే రేపు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ మరింత బలంగా పోరాడాలంటే.. ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న దేశాల మద్దతు అవసరం. బ్రిక్స్ ఆ మద్దతును నిర్మించడానికి ఉపయోగపడే వేదిక.
కానీ చైనా కూడా ఇదే బ్రిక్స్ను తన ప్రయోజనాలకు వాడుకోవాలని చూస్తోంది. ఇక్కడే అసలు కథలో ట్విస్ట్ ఉంది. భారత్కు బ్రిక్స్ ఒక బహుళ ధ్రువ ప్రపంచానికి వేదిక అయితే.. చైనాకు అది అమెరికా ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా ప్రపంచ వ్యవస్థను నిర్మించే సాధనంగా కనిపిస్తోంది.
న్యూఢిల్లీ సదస్సులో జిన్పింగ్ కూడా “Greater BRICS”ను మరింత బలమైన ఆర్థిక, సాంకేతిక, ఆర్థిక సహకార వేదికగా మార్చే ప్రతిపాదనలు చేశాడు… AI, వాణిజ్యం, ఫైనాన్స్ వంటి రంగాల్లో సహకారాన్ని పెంచాలని చైనా ప్రయత్నిస్తోంది. ఇదే భారత్కు సవాలు.
బ్రిక్స్ బలపడాలి.. కానీ అది చైనా నేతృత్వంలోని అమెరికా వ్యతిరేక కూటమిగా మారకూడదు. అది భారత్కు ఇష్టం ఉండదు. ఎందుకంటే అమెరికా, యూరప్ భారత ఆర్థిక వ్యవస్థకు, పెట్టుబడులకు, సాంకేతికతకు, రక్షణ సహకారానికి అత్యంత ముఖ్యమైన భాగస్వాములు. అందుకే భారత్ అనుసరిస్తున్న మార్గం చాలా సున్నితమైనది.
రష్యాతో సంబంధం కూడా అంతే ముఖ్యం… ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యాను పాశ్చాత్య ప్రపంచం దాదాపు ఒంటరిచేసింది. కానీ భారత్ మాత్రం మాస్కోతో సంబంధాలను తెంచుకోలేదు. రష్యా నుంచి చమురు దిగుమతులు భారత్కు ఆర్థికంగా ఉపయోగపడ్డాయి. రక్షణ రంగంలో దశాబ్దాల సంబంధం ఉంది. అణుశక్తి, అంతరిక్షం, ఎరువులు వంటి రంగాల్లోనూ సహకారం కొనసాగుతోంది.
ఇప్పుడు అదే పుతిన్ ఢిల్లీకి వచ్చి బ్రిక్స్ వేదికపై మోదీతో కూర్చున్నాడు. ఇది ప్రపంచానికి భారత్ ఇచ్చే మరో సందేశం: “మీరు ఎవరితో సంబంధాలు తెంచుకున్నా.. మేము మా ప్రయోజనాల ప్రకారం ఎవరితో మాట్లాడాలో మేమే నిర్ణయించుకుంటాం.” అదే సమయంలో యుద్ధాల విషయంలో భారత్ నిరంతరం చర్చలు, దౌత్యమే పరిష్కారం అని చెబుతోంది.
మరి నష్టాలేమిటి? అన్నీ లాభాలే కావు. బ్రిక్స్ బలపడుతున్న కొద్దీ దానికి ఒక “పాశ్చాత్య వ్యతిరేక కూటమి” అనే ముద్ర పడితే భారత్ ఇబ్బందుల్లో పడుతుంది. చైనాతో మన సరిహద్దు వివాదం ఇంకా పరిష్కారం కాలేదు. చైనాతో వాణిజ్యం పెరుగుతున్నా.. భారీ వాణిజ్య లోటు భారత్కు సమస్యగానే ఉంది. రష్యాతో దగ్గరగా ఉండటం వల్ల అమెరికా, యూరప్తో కొన్ని సందర్భాల్లో దౌత్య ఒత్తిళ్లు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
మరోవైపు బ్రిక్స్లోనే భారత్కు విరుద్ధ ప్రయోజనాలున్న దేశాలు ఉన్నాయి. ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాల మధ్య కూడా భిన్నమైన భౌగోళిక రాజకీయ సమీకరణాలు ఉన్నాయి. ఇలాంటి విభిన్న దేశాలను ఒకే వేదికపై ఏకాభిప్రాయానికి తీసుకురావడం అంత సులభం కాదు. ఈ సదస్సులో కూడా కొన్ని అంతర్జాతీయ అంశాలపై సభ్యదేశాల మధ్య విభేదాలు బయటపడ్డాయి.
అంటే బ్రిక్స్కు ఆర్థిక బలం ఉంది. జనాభా బలం ఉంది. వనరుల బలం ఉంది. కానీ ఒకే రాజకీయ బలం ఇంకా లేదు. అదే దాని పరిమితి. అందుకే భారత్ చేయాల్సింది కూటమి రాజకీయాలు కాదు.. సమతుల్య రాజకీయాలు భారత్కు ఇప్పుడు కావాల్సింది “బ్రిక్స్ వైపు” వెళ్లడమో “అమెరికా వైపు” వెళ్లడమో కాదు.
రెండింటినీ తన ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం. అమెరికాతో టెక్నాలజీ, పెట్టుబడులు, రక్షణ. రష్యాతో ఇంధనం, రక్షణ, అంతరిక్ష సహకారం. చైనాతో వాణిజ్యం.. కానీ సరిహద్దు విషయంలో అప్రమత్తత. గల్ఫ్ దేశాలతో ఇంధనం, పెట్టుబడులు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా దేశాలతో గ్లోబల్ సౌత్ భాగస్వామ్యం. అంటే ప్రపంచం రెండు శిబిరాలుగా విడిపోయినప్పుడు ఒక వైపు నిలబడటం కాదు.
ప్రతి శిబిరంతో అవసరమైనంత దూరం.. అవసరమైనంత దగ్గర. అదే భారత విదేశాంగ విధానం..
Share this Article