.
- ముందుగా డిస్క్లెయిమర్ వంటి కొన్ని నిజాలు…. ఏ అంతర్రాష్ట్ర నదిపైనయినా సరే, ఏ రాష్ట్ర ప్రభుత్వమూ రాజీపడదు… ఏ పాలకుడూ రాజీపడడు… చంద్రబాబుకు రేవంత్ రెడ్డి చూపే మెహర్బానీ గానీ, రేవంత్ రెడ్డి పట్ల చంద్రబాబు చూపే ప్రేమ గానీ ఏమీ ఉండవు… సేమ్, డీకే శివకుమార్తో దోస్తీ ఉంది, సేమ్ పార్టీ అని రేవంత్ రెడ్డి సహకరించడు, రేవంత్ రెడ్డి మనవాడే అని డీకే రాజీపడడు… ఎవరికివారు తమ రాష్ట్ర ఇంట్రస్టులను ప్రొటెక్ట్ చేసుకోవడానికే పోరాడతారు, పోరాడాలి… ఒకరికోసం ఇంకొకరు తమ రాష్ట్ర వాటాల్ని ఏమీ సమర్పించరు.., అలా చేస్తే తామే రాజకీయంగా నష్టపోతారు కాబట్టి…
- రాజకీయాలు వేరు- రాష్ట్రాల హక్కులు, ప్రయోజనాలు వేరు… కర్నాటక, ఏపీలలో ప్రతిపక్షాలు- అధికారపక్షాలు తమ రాష్ట్ర ప్రయోజనాల పట్ల కలిసికట్టుగా ఆలోచిస్తాయి… ఎటొచ్చీ తెలంగాణలో దరిద్రం ఏమిటంటే… కాంగ్రెస్ మీద అకారణ ద్వేషంతో, రేవంత్ రెడ్డి అకారణ ద్వేషంతో… రేవంత్ రెడ్డి ఏమైనా ముందుడుగులు వేయాలంటే ఆ కాళ్లల్లో కట్టెలు పెట్టడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది… అదీ కేసీయార్ పదేళ్ల వైఫల్యాల మరకలు ఉండి కూడా, ఉల్టా గాయిగత్తర చేయడం..!!
దక్షిణ తెలంగాణకు కృష్ణా ప్రాజెక్టుల విషయంలో కేసీయార్ చేసిన అన్యాయం సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నా, చర్చలు జరుగుతున్నాయి, శుభవార్త వినిపిస్తాను, పాలమూరు- రంగారెడ్డికి 90 టీఎంసీలు, డిండికి 20 టీఎంసీలకు ఏపీ నుంచి ఎన్వోసీ తెప్పిస్తా అని నిన్న రేవంత్ రెడ్డి ప్రకటించగానే… బీఆర్ఎస్లో కలవరం, దీంతో రేవంత్ రెడ్డికి మంచి పేరొస్తే ఎలా అని… దాంతో ‘నమస్తే తెలంగాణ’లో కొన్ని ఊహాగానాల్ని అచ్చేయించింది… అదుగో రేవంత్ రెడ్డి ఏపీ- కర్నాటకలతో కుమ్మక్కై తెలంగాణకు ద్రోహం చేయబోతున్నాడు, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా వాటాల్ని పునఃఖరారు చేయబోెతున్నవేళ ఇది తీవ్ర నష్టం అంటూ ఏదేదో రాసుకొచ్చింది…
Ads
ఏందయ్యా అంటే… సమ్మక్క సాగర్ (తుపాకుల గూడెం నుంచి నాగార్జునసాగర్కు) 47 టీఎంసీల మళ్లింపుకి ఏపీ ప్రతిపాదిస్తోంది, రేవంత్ రెడ్డి వోకే అనబోతున్నాడు… బనకచర్ల లేదా నల్లమలసాగర్ కోసం చంద్రబాబు ఢిల్లీ స్థాయిలో కుట్రలు చేస్తుంటే రేవంత్ రెడ్డి తలొగ్గుతున్నాడు అని పేజీల కొద్దీ పరిచిన వ్యాసాల సారాంశం… నిజానికి జరుగుతున్నది వేరు…
ఎస్, చంద్రబాబుకు అర్జెంటుగా ఓ ఏటీఎం ప్రాజెక్టు కావాలి… అదీ కేసీయార్ కాళేశ్వరంలో సంపాదించే రీతిలో ఉండాలి… పోలవరం నుంచి బనకచర్ల ప్రతిపాదించాడు… తరువాత దాన్ని మార్చి నల్లమలసాగర్ అన్నాడు… రేవంత్ రెడ్డి రాజీపడలేదు… బనకచర్ల జాన్తా నై అని రకరకాల కొర్రీలు వేశాడు, తెలంగాణ గోదావరి ప్రయోజనాలు దెబ్బతినకుండా… దాంతో చంద్రబాబు ఒడిశా నుంచి, అంటే మహానది నుంచి నరుక్కొస్తున్నాడు ఇప్పుడు…
రేవంత్ రెడ్డి ససేమిరా అంటుండటంతో మహానది నుంచి 147 టీఎంసీలను పోలవరానికి తీసుకుపోయి, అక్కడి నుంచి ఆ నీటిని చూపి బనకచర్ల లేదా నల్లమలసాగర్కు అనుమతులు కేంద్రం నుంచి తెచ్చుకోవాలని చంద్రబాబు ప్లాన్ వేశాడు… దీనికి ఉత్తరాంధ్ర రైతుల ప్రయోజనాలు అని కవరింగు… పైగా మహానది నుంచి కావేరి లింక్ పేరిట కేంద్రం కళ్లకు గంతలు…
ఇలాంటి ప్రతిపాదనల్ని గతంలో నవీన్ పట్నాయక్ కొట్టిపారేసేవాడు… మహానది చత్తీస్గడ్- ఒడిశాలో ప్రవహిస్తున్నా, దాని క్యాచ్మెంట్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్ దాకా ఉంది… సో, మహారాష్ట్ర, ఒడిశా, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అన్నీ బీజేపీ చేతుల్లో ఉన్నవే కాబట్టి… మోడీపై ఒత్తిడి తెచ్చి, మహానదిని మళ్లించాలనే ప్రణాళిక చంద్రబాబుది…
నిన్న హైదరాబాదులో NWDA మీటింగ్ జరిగింది, మహానది – గోదావరి అనుసంధాన మార్గంలో మార్పులను అంగీకరించింది… అంటే… మహానది టు పోలవరం… అక్కడి నుంచి నల్లమలసాగర్… ప్రతి దశలోనూ పంపులు, లిఫ్టులు ఉంటాయి… అంటే కాసులవర్షమే… పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో అదే కదా జరిగింది…
చత్తీస్గఢ్, ఒడిశాల్లో మహానదిపై పెండింగ్ ప్రాజెక్టులున్నాయి… అవి పూర్తయితే మహానదిలో మిగులు జలాలే లేవు… మరి ఏ లెక్కన ఆ నీటిని తరలించుకుపోతారు..? NWDA వోకే అనగానే చత్తీస్గఢ్, ఒడిశా ప్రభుత్వాలు అంగీకరిస్తాయా..? వేచి చూడాలి… చంద్రబాబు ప్లాన్లకు బోల్తాకొట్టరనే ఆశించాలి…
అదే బీజేపీ పాలిత మహారాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం తుమ్మడిహెట్టి మీద మాట్లాడుకుందాం, అపాయింట్మెంట్ ఇవ్వండీ అంటే స్పందించడు… చంద్రబాబు చెప్పగానే అన్నీ అలా సానుకూలంగా కదులుతూ ఉంటాయి… మోడీ బలహీనత మరి… చంద్రబాబుపై ఆధారపడటం..!
Share this Article