.
మాజీ ఐపీఎస్ అధికారిణి దమయంతి సేన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆధ్వర్యంలో ఒక కీలక దర్యాప్తు పదవిలోకి తిరిగి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ/ఎస్టీ, మైనారిటీ మహిళలపై జరుగుతున్నట్లు ఆరోపించబడిన హింస, అఘాయిత్యాలపై దర్యాప్తు చేయడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు, దీనికి దమయంతి సేన్ను సభ్య కార్యదర్శిగా నియమించారు.…
ఇంతకీ ఆమె ఎవరు..? ఎందుకంత స్పెషల్..? ఓసారి ఆమె ఏ కేసులో పాపులరైందో తెలుసుకోవాలి… పశ్చిమ బెంగాల్ కేడర్కు చెందిన మాజీ ఐపీఎస్ అధికారిణి దమయంతి సేన్ పేరు వినగానే కోల్కతా “పార్క్ స్ట్రీట్ సామూహిక అత్యాచారం” (2012) కేసు, ఆమె చూపిన అసాధారణ సాహసమే గుర్తొస్తుంది… అప్పట్లో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈ కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించినప్పటికీ, ఆమె వెనక్కి తగ్గకుండా నిజాన్ని నిరూపించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది…
Ads
పార్క్ స్ట్రీట్ కేసు (2012) – టర్నింగ్ పాయింట్
-
ఘటన…: ఫిబ్రవరి 2012లో కోల్కతాలోని ప్రసిద్ధ పార్క్ స్ట్రీట్ ప్రాంతంలో ఒక ఆంగ్లో-ఇండియన్ మహిళ (సుజెట్ జోర్డాన్) పై కారులో సామూహిక అత్యాచారం జరిగింది.
-
రాజకీయ ఒత్తిడి…: అప్పట్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఘటనను ప్రభుత్వంపై బురదజల్లేందుకు జరిగిన “చిన్న కట్టుకథ” (Chhoto ghotona / fabricated incident) గా కొట్టిపారేసింది… తనకు అలవాటేగా ఆర్జీకర్ హత్యాచారంపై తలతిక్క కామెంట్లు కూడా చేసింది గుర్తుంది కదా…
-
దమయంతి సేన్ పాత్ర…: ఆ సమయంలో దమయంతి సేన్ కోల్కతా పోలీస్ డిటెక్టివ్ డిపార్ట్మెంట్కు జాయింట్ కమిషనర్గా ఉంది… సీఎం స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ, దమయంతి సేన్ రాజకీయ ఒత్తిళ్లకు లొంగలేదు… బాధితురాలి ఫిర్యాదులో నిజముందని నమ్మిన ఆమె, స్వయంగా విచారణను లీడ్ చేసింది…
-
నిజం నిరూపణ…: శాస్త్రీయ ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ సేకరించి, నిందితులను గుర్తించి, అది నిజంగానే సామూహిక అఘాయిత్యం అని మీడియా ముందు ధైర్యంగా ప్రకటించింది…
బదిలీ – ప్రతీకారం
నిజాయితీగా పనిచేసి నిందితులను పట్టుకున్నందుకు ఆమెకు దక్కిన బహుమతి “స్థానచలనం”. ముఖ్యమంత్రి ప్రకటనకు భిన్నంగా నివేదిక ఇచ్చిన కొద్ది రోజులకే, దమయంతి సేన్ను కోల్కతా డిటెక్టివ్ డిపార్ట్మెంట్ నుండి బారక్పూర్లోని పోలీస్ ట్రైనింగ్ స్కూల్కు (కంపారేటివ్గా లూప్ లైన్ పోస్టింగ్) బదిలీ చేశారు. మమతకు ఇలాంటి ఆఫీసర్లంటే అస్సలు పడదు కదా…
కానీ, ఈ బదిలీ ఆమె ఇమేజ్ను మరింత పెంచింది… పత్రికలు, ప్రజలు ఆమెను ఒక రియల్ లైఫ్ హీరోగా కొనియాడారు… ఆమె వేసిన బలమైన పునాది వల్లే 2015లో కోల్కతా కోర్టు ఈ కేసులోని నిందితులకు కఠిన శిక్ష విధించింది…
ఆ తర్వాత కెరీర్.. తిరిగి కోల్కతాకు..
-
బదిలీల తర్వాత కూడా ఆమె తన శైలిని మార్చుకోలేదు. డార్జిలింగ్ ఐజీగా, క్రైమ్ బ్రాంచ్ (CID) లో కీలక బాధ్యతలు నిర్వహించింది.
-
విచిత్రం ఏమిటంటే, 2019లో కోల్కతాలో శాంతిభద్రతల సమస్యలు, మహిళలపై నేరాలు పెరిగినప్పుడు.. మళ్లీ సమర్థురాలైన అధికారి అవసరం పడటంతో మమతా బెనర్జీ ప్రభుత్వమే ఆమెను తిరిగి కోల్కతా పోలీసు విభాగానికి (Special CP గా) పిలిపించింది.
-
ఏప్రిల్ 2022లో కలకత్తా హైకోర్టు రాష్ట్రంలో జరిగిన కొన్ని కీలక అత్యాచార కేసుల విచారణ పర్యవేక్షణ బాధ్యతలను కూడా నేరుగా దమయంతి సేన్కే అప్పగించింది. కోర్టుకు సైతం ఆమెపై ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం.
దమయంతి సేన్ ఏప్రిల్ 2026లో (గత నెలలోనే) ఐజీ (IG) హోదాలో పదవీ విరమణ చేసింది… ఇప్పుడు మళ్లీ ఓ కీలక బాధ్యతలోకి చేరుతోంది…!
Share this Article