.
పర్లేదు, ఇండియాలో ప్రభుత్వానికి కూడా వెన్నెముక ఉంది, అది స్పందిస్తూ ఉంటుంది… అమెరికన్ సోషల్ మీడియా సంస్థల ఎదుట సాగిలబడకుండా తన అస్థిత్వాన్ని, అభిమానాన్ని అప్పుడప్పుడూ ప్రదర్శిస్తూ ఉంటుంది… కాకపోతే అది ప్రధానికి నొప్పి తగిలితేనే!!
విషయం ఏమిటంటే..? యూట్యూబ్, ఎక్స్, ఫేస్బుక్, వాట్సప్… ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తీసుకున్నా సరే, మన ప్రభుత్వాలు ఏం నిర్ణయాలు తీసుకున్నా బేఖాతరు చేసేవి… ఈసారి ఏకంగా ప్రధాని వీడియోనే పీకిపారేశాయి… కారణం ఏమనడిగితే ఎవరో లీగల్ కంప్లయింట్ చేస్తే తీసేశామని మొదట చెప్పుకుంది… అప్పుడు చర్రుమంది ప్రధాని టీమ్కు…
Ads
సీజేపీ ఆందోళనలు, ఉద్రిక్తతల నేపథ్యంలో ఒక ప్రధాని జాతిని ఉద్దేశించిన చేసిన ప్రసంగ వీడియోను తొలగించడం ఖచ్చితంగా బాధ్యతారాహిత్యమే, ఈ ప్రభుత్వమంటే లెక్కలేనితనం… సరే, ప్రధాని టీమ్ను ఎక్కడో కాలింది కదా… చర్యలకు దిగింది… సాక్షాత్తూ జుకర్బర్గ్ క్షమాపణ చెప్పి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి, అంతేకాదు, లీగల్ కంప్లయింట్ ఫైల్ చేసిందెవరో చెప్పాలి… ఇంకా వివరాల్లోకి వెళ్తే…
జూలై 23న ప్రధాని మోదీ విద్యార్థులు, యువత (Gen Z)ను ఉద్దేశించి పేపర్ లీక్లపై చేసిన సెల్ఫీ వీడియోను ఇన్స్టాగ్రామ్లో, ఆ తర్వాత ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అయితే ఫేస్బుక్లో ఉన్న ఈ వీడియోను మెటా ఏఐ ఆటోమేటెడ్ ఫిల్టర్స్ సాకుతో సుమారు 5 గంటల పాటు (రాత్రి 12:30 నుండి ఉదయం 5:00 గంటల వరకు) తొలగించింది…
దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో మెటా దాన్ని మళ్లీ పునరుద్ధరించింది. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే నేతృత్వంలోని ‘కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ కమిటీ’ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. మెటా సీఈఓ మార్క్ జుకర్బెర్గ్ స్వయంగా 3 రోజుల్లోగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఐటీ చట్టం సెక్షన్ 79(3) కింద లభించే ‘సేఫ్ హార్బర్’ (Safe Harbour – చట్టపరమైన మినహాయింపు/ ఇమ్యూనిటీ) రక్షణను రద్దు చేస్తామని అల్టిమేటం జారీ చేసింది.
మెటాకు చెందిన స్థానిక (ఇండియా) పాలసీ అధికారులు ప్రభుత్వ అభ్యంతరాలను అమెరికాలోని ప్రధాన కార్యాలయానికి సరిగ్గా చేరవేయట్లేదని కేంద్రం భావించింది. అందుకే కేవలం స్థానిక టీమ్తో సరిపెట్టకుండా మెటా గ్లోబల్ లీడర్షిప్ను (గ్లోబల్ అఫైర్స్ హెడ్ జోయెల్ కప్లాన్, గ్లోబల్ పాలసీ హెడ్ కెవిన్ మార్టిన్ తదితర సీనియర్ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్లను) నేరుగా చర్చలకు రావాల్సిందిగా కేంద్ర ఎలక్ట్రానిక్స్- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) సమన్లు జారీ చేసింది.
ఈ నేపథ్యంలోనే మెటా గ్లోబల్ ఎగ్జిక్యూటివ్లు MeitY అధికారులను కలిసి చర్చలు జరుపుతున్నారు. ఈ భేటీలో ప్రధానంగా చర్చకొస్తున్న అంశాలు… ప్రధాని వీడియో తొలగింపుపై వివరణ… టెక్నికల్ గ్లిచ్ లేదా ఏఐ లోపం వల్ల దేశ అత్యున్నత పదవిలో ఉన్న ప్రధాని పోస్ట్ తొలగిపోవడంపై మెటా గ్లోబల్ టీమ్ను ఐటీ మంత్రిత్వ శాఖ నిలదీసింది.
భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా ఎలాంటి పటిష్టమైన సిస్టమ్స్ ఏర్పాటు చేస్తారో స్పష్టం చేయాలని కోరింది. ప్రధాని లాంటి ప్రముఖుల వెరిఫైడ్ అకౌంట్ల కంటెంట్కు మరింత పటిష్టమైన రక్షణ కవచం (Safeguards) ఉండాలని స్పష్టం చేసింది.
కేవలం రాజకీయ వివాదమే కాకుండా, ప్లాట్ఫారమ్లలో బాలల లైంగిక వేధింపుల మెటీరియల్ (CSAM), మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన కంటెంట్, సింథటిక్గా జనరేట్ చేసిన డీప్ఫేక్స్ వంటి నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం హెచ్చరించింది.
మొత్తంగా చూస్తే, సోషల్ మీడియా దిగ్గజాలు ఇకపై భారత చట్టాలను అత్యంత కఠినంగా పాటించేలా చేయాలని, కంటెంట్ మాడరేషన్ పేరిట ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చట్టపరమైన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటరీ ప్యానెల్ స్పష్టమైన సంకేతాలు పంపుతున్నాయి…
Share this Article